Asia Cup 2022: భారత్తో పోరుకు ముందు పాక్కు భారీ షాక్.. గాయంతో మరో పేసర్ దూరం
India vs Pakistan: శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్నది. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ ఆదివారం తలపడనున్నాయి.
భారత్తో కీలక పోరుకు ముందు పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ నుంచి తప్పుకొనగా.. తాజాగా మరో పేసర్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆ జట్టు యువ పేసర్ మహ్మద్ వసీం జూనియర్.. పక్కటెముకల నొప్పితో ఆసియా కప్ నుంచి నిష్క్రమించాడు. ఆసియా కప్ సందర్భంగా దుబాయ్ చేరుకున్న పాకిస్తాన్ జట్టు.. ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉంది. ప్రాక్టీస్ సందర్భంగానే వసీం బౌలింగ్ చేస్తున్నప్పుడు నొప్పితో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నొప్పితో విలవిల్లాడిన వసీంను జట్టు సిబ్బంది వెంటనే ఐసీసీ అకాడమీకి తరలించింది. అక్కడే అతడికి ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించారు. వైద్య పరీక్షల్లో వసీంకు వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో అతడిని ఆసియా కప్ ఆడించడం కంటే విశ్రాంతినిచ్చిందే ఉత్తమమనే భావనతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. అతడిని టోర్నీ నుంచి తప్పించింది.
ఆసియా కప్ తర్వాత పాకిస్తాన్ కు బిజీ షెడ్యూల్ ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో పాటు ఆస్ట్రేలియాతో కూడా వరుసగా సిరీస్ లు ఆడనుంది. అంతేగాక అక్టోబర్ లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. దీంతో వసీంను ఆసియా కప్ లో ఆడించి అతడి గాయాన్ని మరింత పెద్దది చేయడం కంటే విశ్రాంతినిచ్చిందే బెటరని టీమ్ మేనేజ్మెంట్ భావించింది.
వసీం స్థానంలో హసన్ అలీ..?
గాయపడిన వసీం స్థానాన్ని భర్తీ చేయడానికి పాక్ జట్టు యాజమాన్యం హసన్ అలీని పిలిపించింది. ఫామ్ కోల్పోయి పసలేని బౌలింగ్ తో విమర్శలు ఎదుర్కుంటున్న హసన్ అలీని జట్టు సభ్యుడిగా చేర్చాలని ఐసీసీని కోరింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అయితే హసన్ అలీ ఎంపికపై సోషల్ మీడియాలో పాకిస్తాన్ నెటిజనులు మాత్రం మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఆసీస్ తో సెమీస్ మ్యాచ్ లో కీలక సమయంలో క్యాచ్ మిస్ చేసి పాకిస్తాన్ కు తీరని వేదన మిగిల్చిన హసన్ అలీ జట్టులోకి వస్తే మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందని మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.