BCCI New President: పది రోజులుగా సర్వత్రా ఉత్కంఠ రేపిన బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడింది. బీసీసీఐకి కొత్త బాస్ గా రోజర్ బిన్నీ ఎంపికయ్యాడు. ముంబైలో ముగిసిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) లో కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపిన బీసీసీఐ కొత్త అధ్యక్షుడి వ్యవహారం ముగిసింది. ముంబై లోని తాజ్ హోటల్ వేదికగా ముగిసిన బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం) లో కొత్త బాసుతో పాటు పలు కీలక విషయాలపై చర్చించారు. రోజర్ బిన్నీతో పాటు పలువురు ఆఫీస్ బేరర్లు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు కొత్త ప్రతినిధులతో పాటు ఇతర విషయాలపైనా విస్తృత స్థాయిలో చర్చించారు. ఉమెన్స్ ఐపీఎల్, ఐసీసీలో భారత ప్రతినిధి గురించిన కీలక విషయాలు చర్చలోకి వచ్చాయి.
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ ప్రకటనలో సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఓ ప్రకటన వెలువరించాడు. బీసీసీఐ 91వ సమావేశానికి సంబంధించిన వివరాలు ఇవే..
బీసీసీఐ కొత్త పాలకవర్గం :
- రోజర్ బిన్నీ : అధ్యక్షుడు
- రాజీవ్ శుక్లా : ఉపాధ్యక్షుడు
- జై షా : సెక్రటరీ
- దేవజిత్ సైకియా : జాయింట్ సెక్రటరీ
- ఆశిష్ షెలార్ : ట్రెజరర్
- బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో జనరల్ బాడీ ప్రతినిధిగా ఎంకేజే మజూందార్
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులుగా అరుణ్ ధుమాల్, అవిషేశ్ దాల్మియా
కీలక నిర్ణయాలు :
- 2022-23 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ఆమోదం
- 2023-2027 కాలానికి మెన్స్ క్రికెట్ టీమ్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ), 2022-2025 కాలానికి మహిళల ఎఫ్టీపీ ధ్రువీకరణ
- మహిళల ఐపీఎల్ నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్
గంగూలీ, పాత పాలకవర్గానికి ప్రశంస :
మూడేండ్ల పాటు బీసీసీఐలో అధ్యక్షుడితో పాటు ఐపీఎల్, ఇతర పదవులలో ఉండి తమ బాధ్యతలను నిర్వర్తించిన వారి సేవలకు జనరల్ బాడీ ప్రత్యేక ప్రశంసలు.
ఐసీసీ ప్రతినిధిపై..
ఏజీఎంలో కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ.. ఐసీసీకి వెళ్లబోయే భారత ప్రతినిధి గురించి మాత్రం చర్చించనట్టు తెలుస్తున్నది. ఆ విషయాన్ని బీసీసీఐ ఆఫీస్ బేరర్లు చూసుకుంటారని బోర్డు వర్గాలు తెలిపాయి. అలాగే ఐసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన అంశం కూడా ఈ సమావేశంలో చర్చలోకి రాలేదని, ముందుకు అనుకున్న ఎజెండా ప్రకారమే మీటింగ్ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ పదవి కూడా జై షా కు దక్కేట్టు ఉందని బోర్డు వర్గాల సమాచారం.
