మళ్లీ రోడ్డెక్కిన రెజ్లర్లు.. జంతర్ మంతర్ వద్ద ఆందోళన
Wrestlers Protest: భారత రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడి వల్ల తాము రోజూ మానసిక హింసకు గురవుతున్నామని చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది జనవరిలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసి కొన్నిరోజుల పాటు ధర్నాకు దిగిన రెజ్లర్లు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ రోడ్కెక్కారు. ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పూనియాలతో పాటు మరికొంతమంది తమ ఆందోళనలను తిరిగి ప్రారంభించారు. బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడి వల్ల తాము రోజూ మానసిక హింసకు గురవుతున్నామని చెప్పుకొచ్చారు.
బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని మేరీ కోమ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కమిటీ ఇటీవలే క్రీడా మంత్రిత్వ శాఖకు అందించింది.
అయితే ఈ నివేదికలోని అంశాలను బహిర్గతం చేయడం లేదని.. దాచాల్సిన అవసరం ఏముందని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక ఇప్పటివరకూ బ్రిజ్ భూషణ్ పై ఏ చర్యలూ తీసుకోకపోవడం కూడా రెజ్లర్లకు ఆగ్రహం తెప్పించింది. అదీగాక బ్రిజ్ భూషణ్ పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు (లైంగిక వేధింపులపై) ఫిర్యాదు చేసినా పోలీసులు ఆయనపై ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని రెజ్లర్లు చెబుతున్నారు.
బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఈ పిటిషన్ ను మంగళవారం విచారించాలని సూచించారు.
కాగా ఆదివారం జంతర్ మంతర్ వద్ద ఆందోళనచేపట్టిన రెజ్లర్లు రాత్రి అక్కడే ఫుట్ పాత్ మీద పడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. ఫుట్ పాత్ మీద పడుకున్న వారిలో భారత స్టార్ రెజ్లర్లు పునియా, సాక్షి మాలిక్, వినేశ్ లు ఉండటం గమనార్హం. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ ఈ ఫోటోను షేర్ చేస్తూ .. ‘దేశానికి పతకాలు అందించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన వారిని ఇలా అవమానిస్తారా..?’అని ప్రశ్నించారు.