ICC T20I Rankings: శ్రీలంకతో  మూడు మ్యాచుల సిరీస్ లో రఫ్ఫాడించిన  టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. తాజాగా టీ20 ర్యాంకింగ్స్ లో కూడా దుమ్మురేపాడు. మరోవైపు  మాజీ సారథి కోహ్లి మాత్రం.. 

ఇటీవలే శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో 3 బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో జోరు చూపాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో అతడు ఏకంగా 27 స్థానాలకు ఎగబాకి టాప్-20లోకి చేరాడు. లంకతో సిరీస్ కు ముందు 45వ స్థానంలో ఉన్న అయ్యర్.. ఇప్పుడు 18వ స్థానానికి ఎగబాకాడు. లంకతో సిరీస్ లో అయ్యర్.. వరుస మ్యాచులలో 57, 74, 73 పరుగులతో 204 రన్స్ చేశాడు. మూడు మ్యాచులలో నాటౌట్ గా నిలిచి భారత్ విజయాలలో కీలక పాత్ర పోషించిన అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. 

ఇదిలాఉండగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మాత్రం టీ20 ర్యాంకింగులలో మరింత దిగజారాడు. లంకతో సిరీస్ కు ర్యాంకింగ్స్ జాబితాలో పదో స్థానంలో ఉన్న కోహ్లి.. సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడి ర్యాంకు కూడా దారుణంగా పడిపోయింది. 612 పాయింట్లతో కోహ్లి 15 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ 805 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా రెండో స్థానంలో అదే దేశానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (798 పాయింట్లు) ఉన్నాడు. టాప్-10 లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ ఒక్కడే 646 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. 

Scroll to load tweet…

బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంషీ.. 784 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. హెజిల్వుడ్, రషీద్ (ఇంగ్లాండ్), ఆడమ్ జంపా, రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. లంకతో భారత్ ఆడిన టీ20 సిరీస్ లో రాణించిన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. 17వ స్థానంలో నిలిచాడు. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో కూడా భారత్ నుంచి ఒక్క ఆటగాడు కూడా లేడు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. వన్డే ర్యాంకింగ్స్ (బ్యాటింగ్) లో మాత్రం కోహ్లి(811పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కూడా బాబర్ ఆజమ్ 873 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (791 పాయింట్లతో) మూడో స్థానంలో నిలిచాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో నిలవగా.. బుమ్రా ఆరో స్థానంలో ఉన్నాడు.