IPL: ఐపీఎల్ ఫైనల్స్ లో సిన్మా చూపించనున్న అమీర్ ఖాన్.. ప్రమోషన్స్ లో ఇది నెక్స్ట్ లెవల్..
IPL 2022 Finals: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన కొత్త సినిమాను ఐపీఎల్ ఫైనల్ లో చూపించనున్నాడు. మే 29న ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ పూర్తి చేసింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి బంగారు బాతుగా మారిన ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాపార సంస్థ ఆరాటపడుతున్నది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ సంస్థ ఆరామ్ కో కూడా ఐపీఎల్ లో భాగం (ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అఫిషియల్ పార్ట్నర్) అయిందంటే దాని క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్నాళ్లు వ్యాపార సంస్థలకే పరిమితమైన ఈ క్రేజ్ ను చిత్ర పరిశ్రమ కూడా ఉపయోగించుకోనుంది. ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా చిత్ర ట్రైలర్ ను ఐపీఎల్ ఫైనల్ లో విడుదల చేయనున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో లీగ్ దశలు రేపటి (మే 22) తో ముగుస్తాయి. తర్వాత వారం ప్లేఆఫ్స్ జరుగుతాయి. మే 29న ఫైనల్.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తారు. హై ఓల్టేజీ మ్యాచ్ గా జరుగబోయే ఈ పోరు కోసం స్టేడియంలోకి వేల సంఖ్యలో ప్రేక్షకులు రానుండగా.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందే వీక్షిస్తారు.
సరిగ్గా ఈ క్రేజ్ నే అమీర్ ఖాన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఫైనల్ లో తన చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఇదే విషయమై ట్విటర్ వేదికగా ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
మ్యాచ్ జరుగుతుండగా...!
కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 22న విడుదల చేయడానికి అమీర్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నాడు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరో తో పాటు నిర్మాతగానూ ఉన్నాడు. మ్యాచ్ జరుగుతుండే సమయంలో అయినా.. లేకుంటే ఫైనల్ కు ముందు బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ సంగీత ప్రదర్శన సమయంలో అయినా ఈ ట్రైలర్ ను విడుదల చేసే అవకాశముంది.
సూపర్ బౌల్ లీగ్ మాదిరే..
అమీర్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. అతడు నటించిన త్రీ ఇడియట్స్, దంగల్, పీకే సినిమాల ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేసిన ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ప్రమోట్ చేయనుండటం విశేషం. కాగా,ఐపీఎల్ లో ఒక సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. యూఎస్ఏ లో అత్యంత మంది వీక్షించే లీగ్ గా గుర్తింపు పొందిన సూపర్ బౌల్ లీగ్ లో అడ్వర్టైజ్మెంట్స్, హాలీవుడ్ సినిమాల ట్రైలర్లను విడుదల చేస్తారు. తద్వారా ఆ సినిమాలకు విపరీతమైన ప్రాచుర్యం లభిస్తుంది. ఈ ఫార్ములాను ఇప్పుడు ఐపీఎల్ అనుసరిస్తున్నది.
ఇదిలాఉండగా.. మే 24న ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు ప్రారంభమవుతుంది. గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్ 1 ఈడెన్ గార్డెన్ (కోల్కతా) వేదికగా జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మే 25న జరగాల్సి ఉంది. ఇక రెండో క్వాలిఫైయర్ మే 27న, 29న ఫైనల్ ను నిర్వహించాల్సి ఉంది.