మెగా క్రికెట్ ఈవెంట్లపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ముందు నిర్దేశించిన ప్రకారం 2021లో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్ భారత్లోనే జరుగుతుందని పేర్కొంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో క్రీడా పోటీల షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఐపీఎల్ వంటి భారీ క్రికెట్ సంరంభం సైతం దేశం వెలుపల జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, మెగా క్రికెట్ ఈవెంట్లపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. ముందు నిర్దేశించిన ప్రకారం 2021లో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్ భారత్లోనే జరుగుతుందని పేర్కొంది.
అయితే, ఈ ఏడాది ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 పురుషుల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే 2022లో జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తిని దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వివరించింది. ఇక, న్యూజిలాండ్ లో వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వరల్డ్ కప్ పోటీలను 2022కి రీషెడ్యూల్ చేశారు.
ఇకపోతే... కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్కు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది.
ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీపై ఉన్నాయనడంలో సందేహం లేదు. మిస్టర్ కూల్ ఎప్పుడు బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ టీమిండియా జెర్సీ ధరించలేదు. అలా 14 నెలలుగా మహేంద్రుడు గ్రౌండ్లోకి అడుగుపెట్టలేదు. తాజాగా ఐపీఎల్కు గ్రీన్సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్లో సాధన చేస్తున్నాడు.
హెలికాఫ్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేశ్ రైనా చెప్పిన తర్వాతి రోజు మహేంద్రుడు ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. ఈ విషయాన్ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
గత వారం జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్కు మహీ వచ్చాడు. ఇండో ర్ స్టేడియంలో బౌలింగ్ మెషిన్ను ఉపయోగించి బ్యాటింగ్ సాధన చేశాడు. ఎంఎస్ ధోని ప్రణాళికలు ఏమిటో, అతను ప్రాక్టీస్ కోసం మళ్లీ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. సాధన కోసం ఇక్కడికి రావడంతోనే ఆ విషయం మాకు తెలిసిందని ఓ అధికారి పేర్కొన్నారు.
