సక్సెస్ఫుల్గా ఐపీఎల్ 2020.. యూఏఈకి భారీగా ముట్టజెప్పిన బీసీసీఐ
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే!
భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే!
దాదాపు రెండున్నర నెలలపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది.
అనధికార సమాచారం ప్రకారం దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న ఏప్రిల్-మే నెలల్లో భారత్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అనంతరం జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యపడలేదు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బీసీసీఐ అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు.
2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో యూఏఈ ఐపీఎల్ను నిర్వహించింది. ఈ టోర్నీ విజయవంతంగా నిర్వహించడంతో ఐపీఎల్ 2020కి యూఏఈ ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది.
బీసీసీఐ, ఐపీఎల్ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ తాజా సీజన్ దిగ్విజయంగా కొనసాగింది.
ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్ కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి వుంది.