Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కోరలు చాస్తున్న కరోనా: సీఎం జగన్‌కు బాబు లేఖ, కీలక సూచనలు

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ, వైద్య పరికరాల తయారీ, రైతుల సమస్యలు, నిత్యావసరాల ధరల నియంత్రణపై టీడీపీ అధినేత కొన్ని సూచనలు చేశారు. 

coronavirus: TDP Chief Chandrababu Naidu Letter To AP CM YS Jagan
Author
Amaravathi, First Published Apr 3, 2020, 6:18 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ, వైద్య పరికరాల తయారీ, రైతుల సమస్యలు, నిత్యావసరాల ధరల నియంత్రణపై టీడీపీ అధినేత కొన్ని సూచనలు చేశారు. 

చంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం కింద చదవండి:

గౌ జగన్మోహన్ రెడ్డి గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి,
విషయం: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ-విశాఖ మెడ్ టెక్ జోన్ లో భారీఎత్తున వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ-పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం-నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ-ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట-వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం. 

1) విశాఖ మెడ్ టెక్ జోన్ లో పూర్తి సామర్ధ్యంలో వెంటిలేటర్లు, రక్షణ ఉపకరణాల తయారీ: 
కరోనా మహమ్మారిపై ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లు మన డాక్టర్లు, వైద్య-ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాలకు పెను సవాల్ గా మారింది. వారికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ అందించడం ప్రభుత్వాల బాధ్యత.  ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం మెడ్ టెక్ జోన్ పిపిఈల తయారీకి ఒక కల్పతరువు కానుంది. 

దేశంలోనే మొట్టమొదటి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్  గా విశాఖ మెడ్ టెక్ జోన్ ను నెలకొల్పడం జరిగింది. సూది నుంచి సీటి స్కాన్ యంత్రం దాకా అన్ని వైద్య పరికరాలు తయారు చేసేలా 100 సంస్థలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రులకే కాదు మొత్తం దేశానికే కావాల్సిన వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను ఇక్కడ తయారుచేసి పంపే సౌలభ్యం ఉంది. 2019 మే వరకు అనేక కంపెనీలతో మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీలో ముందున్న విశాఖ మెడ్ టెక్ జోన్ గత 11 నెలలుగా నిర్లక్ష్యానికి గురైంది.సిఈవోను మార్చడం, మళ్లీ ఆయననే తెచ్చుకోవడం ద్వారా చేసిన తప్పు దిద్దుకోవడం వంటి చర్యలతో నిర్వీర్యం అయ్యింది. 

గత ప్రభుత్వాలు నెలకొల్పారనే అక్కసుతో ప్రజోపయోగమైన ప్రాజెక్టులను మూసేయడం, ఆపేయడం సమాజానికి చేటు. ఇప్పటికే అన్నా కేంటిన్ల మూత వల్ల పేదలకు నాణ్యమైన ఆహారం రూ 5కే లభించే అవకాశం లేకుండా పోయింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) నిర్వీర్యం కావడం వల్ల ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి దూరమైంది. విశాఖ మెడ్ టెక్ జోన్ ను కూడా వాటిలానే పూర్తిగా నిర్లక్ష్యంచేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. మన రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు మొత్తం 30వేల మందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ కేర్ అందుబాటులో లేదు. 

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి, కేంద్ర ప్రభుత్వమార్గదర్శకంలో పూర్తి స్థాయిలో మెడ్ టెక్ జోన్ ను గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికే కాకుండా దేశానికి అంతటికీ కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్, డాక్లర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన రక్షణ ఉపకరణాలు తయారీకి నడుం కట్టాలని సూచిస్తున్నాం. 

2)పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవడం: 
ఒకవైపు పొలాల్లో ధాన్యం, తోటల్లో పండ్లు కళ్లముందే మాగిపోవడం చూసి రాష్ట్రంలో రైతాంగం తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో పాలకులు మీనమేషాలు లెక్కించడం భావ్యం కాదు. ప్రభుత్వమే ముందుకొచ్చి  కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసి, అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల ద్వారా రైతుల్లో భరోసా కల్పించాల్సిన సందర్భమిది. 

వరికోత యంత్రాల అద్దెలు పెరిగిపోయి, కోతలకు కూలీలు రాక, ఏం చేయాలో తోచక ధాన్యం రైతులు అల్లాడుతున్నారు. రబీలో 30లక్షల టన్నుల ధాన్యం కొనాల్సివుండగా ఖరీఫ్ ధాన్యం ఇంకా 30% రైతుల వద్దే ఉందని తెలుస్తోంది. 

రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో సెరికల్చర్ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో రైతుకు రూ 50వేల నుంచి రూ లక్షన్నర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఎండలో పట్టుగూళ్లు ఆరబెట్టడం వల్ల తరుగునష్టం తోపాటు, రవాణా లభించక, మార్కెట్ లేక సెరికల్చర్ రైతులు ఆవేదనలో ఉన్నారు. కొనుగోళ్లు లేక ఒక్క ప్రకాశం జిల్లాలోనే 78మిలియన్ కిలోల పొగాకు నిల్వలు పేరుకు పోయాయి. పొగాకు అమ్ముడుబోక, రంగుమారి, బరువు తగ్గి ధర కోల్పోయి, కొనేవారు లేక రైతాంగం నిరాశలో ఉన్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం సర్వనాశనం అయ్యే దుస్థితి ఏర్పడింది.  చేపలు, రొయ్యలు చెరువుల్లోనే ఉన్నాయి, మేత అందుబాటులో లేదు, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ మూతబడ్డాయి, రాబోయే 2నెలలు ఆక్వా ఉత్పత్తులను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఖిన్నులై ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఏ ఒక్కచోటా లభించడం లేదని రైతులే పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీడ్ అందుబాటులోకి తేవడంతో పాటు ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర రైతులకు లభించేలా పర్యవేక్షించాలి.అరటి ధర రూ 14వేల నుంచి రూ 2వేలకు పడిపోయింది. బొప్పాయి రూ 14వేల నుంచి 3వేలకు పడిపోయింది. మామిడి కాయలు కోసేందుకు కూలీలు దొరక్క, లారీలు లేక రవాణా స్థంభించి, మార్కెట్ మూతబడి, ధరలు పడిపోయి మామిడి తోటల రైతులు కుదేలయ్యారు.

టమాటా కిలో రూ 2కూడా కొనేవాళ్లు లేక మదనపల్లి మార్కెట్ మూతబడి రైతుల్లో నిరాశ నెలకొంది. చీనీతోటల్లోనే కాయలు మాగి రాలిపోవడం చూసి చీనీ రైతులు కుదేలయ్యారు. కూలీల కొరత, రవాణా స్థంభించి, ధరపడిపోయి అన్నిందాలా నష్టం జరిగింది. పుచ్చ, కర్బూజ, ఇతర పండ్లు, పూల తోటల రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో హార్టీ కల్చర్ రైతాంగాన్ని ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలి. 

3)నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ:
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక, ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఈ విపత్కర పరిస్థితిని కూడా సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో కొందరు దళారులు, అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి. 

మొబైల్ రైతుబజార్ల ద్వారా  ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు చౌకధరలకు ఇళ్ల వద్దకే అందుబాటులోకి తేవాలి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆర్టీసి సిటి బస్సులు, పల్లె వెలుగు సర్వీసులను వినియోగించుకోవాలి. 

4)ఇసుక,గ్రావెల్,మట్టి మాఫియాకు అడ్డుకట్ట: 
కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలా అని ప్రపంచ దేశాలన్నీ తలలు పగుల కొట్టుకుంటుంటే, మనరాష్ట్రంలో మాత్రం ఈ విపత్కర పరిస్థితిలో కూడా ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల్లో మాఫియా మూకలు తలమునకలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ప్రధాని లాక్ డౌన్ పిలుపునకు తూట్లు పొడవడమే. ఒకవైపు దేశం అంతా లాక్ డౌన్ అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇటువంటి దుశ్చర్యల ద్వారా లాక్ డౌన్ కు తూట్లు పొడవడం వల్ల కరోనా మహమ్మారి మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది. 

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వందల లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారు. కడప జిల్లా కమలాపురంలో గ్రామస్తులే వందలాది లారీల్లో ఇసుక తరలింపును అడ్డుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో తిరిగే వారినే ఆపేస్తున్న అధికారులు, వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించినట్లుగా చూశాం. ప్రకాశం జిల్లాలో  గతంలో నిర్మించిన చెక్ డ్యామ్ లు ధ్వంసం చేసి ఊరకుంటలు చదును చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఇతర ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్దంగా మెషీన్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. 

ఒకవైపు భౌతికదూరం పాటించాలని చెబుతూ రీచ్ లలో ఇసుక లోడింగ్, అన్ లోడింగ్ కు, వందలాది లారీ డ్రైవర్లు, రవాణా సిబ్బందిని, వేలాది కూలీలను అనుమతించడం ప్రజారోగ్యానికే ప్రమాదకరం..

5)వివిధ శాఖల మధ్య సమన్వయం, సరైన మార్గదర్శకత్వం: 
ప్రస్తుత విపత్కర పరిస్థితిలో రాష్ట్రంలో పోలీసు, రెవిన్యూ, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య మరియు సంబంధిత ఇతర శాఖల మధ్య సమన్వయం అత్యవసరం. సమన్వయ లోపం ఉంటే, కరోనా మహమ్మారిని కట్టడి చేయలేం, దాని వ్యాప్తిని నిరోధించలేం. 

పోలీసులకు ప్రజలు సహకరించాలి, అదే సమయంలో పోలీసులు కూడా సంయమనం పాటించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా కైకలూరు యువకుడు తిరుపతినుంచి స్వస్థలానికి వెళ్తూ, బాపట్లలో పోలీసులు కొట్టారనే ఆవేదనతో చెట్టుకు ఉరేసుకోవడం, పాలకొల్లు ఎల్ ఆర్ నగర్ లో టిఫిన్ బండి వద్ద తింటున్నవాళ్లను పోలీసులు తరమడంతో, భయపడి పరుగెత్తడంతో కుప్పకూలి ఒకరు మృతి చెందడం ఆవేదనకు గురిచేస్తున్నాయి. పోలీసులు, ప్రజల మధ్య మరింత సంయమనం పెరగాల్సిన అవసరాన్ని ఈ దుర్ఘటనలే తెలియ జేస్తున్నాయి.

-వీటన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, జిల్లాలనుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, ప్రపంచ, దేశ పరిణామాలను అధ్యయనం చేస్తూ, అన్నిశాఖల మధ్య సమన్వయం సాధించి, రాష్ట్రానికి సరైన మార్గదర్శకం చేయాలని, తద్వారా ప్రజారోగ్యానికి ఒక దృఢమైన రక్షణ కవచంలా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

(నారా చంద్రబాబు నాయుడు)
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత

Follow Us:
Download App:
  • android
  • ios