దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ‘విప్రో’ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదరగొట్టింది. రూ.2,484 కోట్ల నికర లాభాలు గడించింది. దీంతోపాటు రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ను ప్రకటించింది.
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజాల్లో సానుకూల ద్రుక్పథం మొదలైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ తర్వాత అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో కూడా గత నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో అద్భుత ఫలితాలను ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో విప్రో నికర లాభం ఏకంగా 38.4 శాతం వృద్ధి చెందింది.
విప్రో నికర లాభం రూ.2,493.90 కోట్లుగా నమోదైంది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ.1,800.80 కోట్లుగా ఉంది. సమీక్షా సమయంలో విప్రో మొత్తం ఆదాయం 8.9% వృద్ధి చెంది రూ.13,768.60 కోట్ల నుంచి రూ.15,006.30 కోట్లకు చేరుకున్నది.
కాగా గత నెలతో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.58,584.5 కోట్ల రాబడిపై రూ.9,017.9 కోట్ల నికర లాభం ఆర్జించింది. మరోవైపు రూ.10,500 కోట్లతో బైబ్యాక్ ఆఫర్ను విప్రో బోర్డు ప్రకటించింది.
కాగా 2018-19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో నికర లాభం 1 శాతం తగ్గింది. మూడో త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ.2,510.4 కోట్లుగా ఉంది. రాబడి కూడా 0.5 శాతం తగ్గి రూ.14,585.50 కోట్లుగా నమోదైంది.
పటిష్ఠమైన ఆర్డర్ బుక్తో చివరి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలిగినట్లు విప్రో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలీ నీముచ్వాలా తెలిపారు. డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ సర్వీసెస్, క్లౌడ్ విభాగాల్లో పెట్టుబడులను కొనసాగించటం కలిసివచ్చిందని ఆయన అన్నారు.
చివరి త్రైమాసికంలో కొత్తగా ముగ్గురు క్లయింట్లు వచ్చి చేరారని, మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 10 మంది క్లయింట్లు వచ్చి చేరినట్లు విప్రో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలీ నీముచ్వాలా చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఆఫ్రికా, పశ్చిమాసియా మార్కెట్లు విప్రోకు కీలకంగా ఉన్నాయన్నారు.
అమెరికాలో స్థానిక నియామకాలకు పెద్ద పీట వేసినట్లు విప్రో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలీ నీముచ్వాలా చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల వ్యాపారం 204.6 -208.7 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మొత్తం వృద్ధి ఒక శాతానికి అటుఇటూగా ఉండే అవకాశం ఉందన్నారు.
కొంతమంది తమ ఉద్యోగుల ఖాతాలు హ్యాకింగ్కు గురయినట్లు విప్రో తెలిపింది. ఉద్యోగుల సున్నితమైన సమాచారం అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ ద్వారా తస్కరించినట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని వెంటనే గుర్తించటంతోపాటు దీనిపై సత్వరమే విచారణ చేపట్టినట్లు తెలిపింది.
అంతేకాక ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నట్లు విప్రో పేర్కొంది. విప్రోకు చెందిన కొన్ని సిస్టమ్స్ హ్యాకింగ్కు గురయ్యాయని సైబర్ సెక్యూరిటీ బ్లాగ్ క్రెబ్స్ఆన్ సెక్యూరిటీ గుర్తించింది.
కొంతమంది క్లయింట్లపై దాడి చేయటానికి ఈ ఖాతాలను హ్యాక్ చేసినట్లు విప్రో తెలిపింది. కాగా తమ నెట్వర్క్లోని కొంతమంది ఉద్యోగుల ఖాతాల్లో సాధారణ స్థితికి భిన్నంగా కొన్ని కార్యకలాపాలు సాగినట్లు గుర్తించినట్లు పేర్కొంది.
కంపెనీ ఉపయోగిస్తున్న అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఇందుకు ఎంతగానో దోహదపడిందని విప్రో స్పష్టం చేసింది. అయితే ఎక్కడా కూడా క్లయింట్ల సమాచారంపై ఈ ప్రభావం పడలేదని పేర్కొంది. సమాచార రక్షణకు అన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విప్రో మరోసారి బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. 15 నెలల క్రితం బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించిన విప్రో తాజాగా రెండోసారి రూ.10,500 కోట్లతో షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలిపింది. దీనికి విప్రో బోర్డు ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా 32.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో షేర్ రూ.325కు కొనుగోలు చేయనున్నట్లు విప్రో తెలిపింది. బైబ్యాక్ కోసం రూ.10,500 కోట్లు వెచ్చిస్తామన్నది. ఇది విప్రో చేపట్టిన మూడో బైబ్యాక్ అని పేర్కొంది.
2016లో రూ.2,500 కోట్లతో తొలిసారి బైబ్యాక్కు రాగా ఆ తర్వాత 2017 నవంబరు-డిసెంబరులో రూ.11,000 కోట్లతో బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. తాజాగా రూ.10,500 కోట్లతో మొత్తం 32,30,76,923 ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయాలని మంగళవారం విప్రో బోర్డు నిర్ణయించింది. మొత్తం పెయిడప్ క్యాపిటల్లో ఇది 5.35 శాతానికి సమానం.
ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు ఈ బైబ్యాక్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 31 నాటికి సంస్థల్లో ప్రమోటర్ల చేతిలో 73.85% షేర్లకు బ్యాంకులు, ఎంఎఫ్ సంస్థల చేతుల్లో 6.49 శాతం, ఎఫ్ఐఐలకు 11.74 శాతం, ఇన్వెస్టర్లు, కార్పొరేట్స్ చేతుల్లో 7.92 శాతం వాటాలున్నాయి.
ఉద్యోగుల ఖాతాలసమాచారం చోరీకి గురయినట్లు ప్రకటించటంతో స్టాక్ మార్కెట్లో విప్రో షేర్ నష్టాల్లో సాగింది. బీఎస్ఈలో ఒక దశలో 3.48 శాతం వరకు నష్టపోయిన విప్రో షేర్ చివరకు 2.45 శాతం నష్టంతో రూ.281.10 వద్ద ముగిసింది. కాగా ఎన్ఎస్ఈ నిఫ్టీలో 2.12 శాతం నష్టపోయి 281.60 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే మార్కెట్ ముగిసిన తర్వాత విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదని విప్రో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలీ నీముచ్వాలా అన్నారు. అతిపెద్ద ప్రాజెక్టులపై కంపెనీల మధ్య పోటీ తీవ్రతరంకావడం, తాజా ప్రాజెక్టుల అమలులో ఆలస్యం వల్ల మొత్తం సంస్థ పనితీరుపై ప్రభావం చూపనున్నదని ఆయన పేర్కొన్నారు.
కానీ, రెండో త్రైమాసికంలో వృద్ధి సాధిస్తామని విప్రో సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలీ నీముచ్వాలా గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. డిజిటల్ ద్వారా వచ్చే ఆదాయంలో 32.2 శాతం పెరుగుదల కనిపించింది. గత త్రైమాసికంలో 75 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన మూడు నూతన క్లయింట్లను దక్కించుకున్నట్లు ప్రకటించింది.
