నా ఆస్తులు అమ్మేస్తా.. బ్యాంకుల డబ్బులు ఇచ్చేస్తా: మాల్యా
భారతీయ బ్యాంకులకు తాను పడ్డ బకాయిని చెల్లించేస్తానని ప్రకటించారు విజయ్ మాల్యా. ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి.. లండన్లో తలదాచుకుంటున్నారు మాల్యా. ఆయన్ను భారత్కు అప్పగించాలని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
భారతీయ బ్యాంకులకు తాను పడ్డ బకాయిని చెల్లించేస్తానని ప్రకటించారు విజయ్ మాల్యా. ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి.. లండన్లో తలదాచుకుంటున్నారు మాల్యా. ఆయన్ను భారత్కు అప్పగించాలని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మాల్యాను భారత్కు అప్పగించాలంటూ లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టులో భారత దర్యాప్తు సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై విచారణలో భాగంగా మాల్యా తన కుమారుడు సిద్ధార్థ్తో కలిసి హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మాల్యాను మీడియా ప్రతినిధులు రుణాల చెల్లింపుపై ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెబుతూ.. తనకు ఉన్న రూ.14 వేల కోట్ల ఆస్తులను అమ్మి బ్యాంకుల రుణాలను చెల్లించేస్తానని అన్నారు. అయితే తనపై వస్తున్న మనీలాండరింగ్ ఆరోపణలు అవాస్తవమన్నారు. అంతకుముందు కేసును విచారించిన న్యాయమూర్తి మాల్యాకు బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేశారు.