Asianet News TeluguAsianet News Telugu

నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ..త్వరలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి..

త్వరలో మనదేశంలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జొమాటో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించింది. లాక్ డౌన్ వేళ డ్రోన్ల వినియోగానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణ పరీక్షలకు డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. వచ్చే జూలై తొలివారంలో టెస్టింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు జొమాటో, స్విగ్గీ, డుంజో తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
 

Swiggy And Zomato cleared to test long-range delivery by Drones
Author
Hyderabad, First Published Jun 6, 2020, 11:09 AM IST

న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్‌ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్‌వోఎస్‌ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులిచ్చింది.

ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దన్నుగా ఉన్న డ్రోన్‌ స్టార్టప్‌ ఆస్టీరియా ఏరోస్పేస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వచ్చే సెప్టెంబర్‌ 30 నాటికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్‌ టైమ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. 

డ్రోన్ల నిర్వహణ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్‌ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌కు ఇది తొలి అడుగు కానున్నది. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్‌ ఫ్లయిట్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్‌ గతేడాదే ప్రకటించింది.

జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్‌తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్‌ అధిగమించినట్లు దీపిందర్ గోయల్‌ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 

15 నిమిషాల్లోపే కస్టమర్‌కు ఫుడ్‌ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని దీపిందర్ గోయల్‌ తెలిపారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్‌ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్‌ స్టార్టప్‌ సంస్థ టెక్‌ఈగిల్‌ను కూడా కొనుగోలు చేసింది.  డ్రోన్‌ ట్రయల్స్‌కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మే నెలలో వెల్లడించింది.

డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతుండటంతో డ్రోన్ల తయారీ, వినియోగంపై విధాన మసాయిదాను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు.

also read ఆగిన అట్లాస్ సైకిల్: మూతపడ్డ కంపెనీ చిట్టచివరి యూనిట్!

అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్‌ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా లాక్ డౌన్ వేళ డ్రోన్ల వినియోగం పెరిగిపోవడం కూడా దీనిపై విధి విధానాల రూపకల్పనపై కేంద్రం కేంద్రీకరించింది.

‘మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్‌) నిబంధనలు-2020’ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలను తెలుపాలని ప్రజలను కోరింది. అనంతరం తుది నిబంధనలను విడుదల చేయనున్నారు.

విమానయాన శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు యూఏఎస్‌లకు ఎలాంటి నిబంధనలు లేవు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద అవి భాగంగా ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ల వ్యవస్థ మొత్తం నూతన నిబంధనల పరిధిలోకి వస్తుంది’ అని చెప్పారు.

ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిబంధనలను ఖరారుచేస్తాం’ అని ఆ పౌర విమానయాన శాఖ అధికారి చెప్పారు. డ్రోన్ల ద్వారా ఈ-కామర్స్‌ ఉత్పత్తులను చేరవేయడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాకపోయినా, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు వీటిని వినియోగించవచ్చని తెలిపారు.

ఈ-కామర్స్‌ ఉత్పత్తులకు, ఎయిర్‌ ట్యాక్సీలకు అనుమతించనున్నట్టు ఆ విమానయానశాఖ అధికారి చెప్పారు. యూఏఎస్‌లను మూడు భాగాలుగా విభజించారు. రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌, మోడల్‌ రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌, అటానమస్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌గా వాటిని వర్గీకరించారు. అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను బరువు ఆధారంగా వివిధ క్యాటగిరీలుగా విభజించారు.

ఈ ముసాయిదా ప్రకారం యూఏఎస్‌ తయారీ/నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేసే అధికారం డీజీసీఏకు ఉంటుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ లేని యూఏఎస్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదు. డీజీసీఏ అనుమతి ఉన్నవి తప్ప మిగిలిన యూఏఎస్‌లు పేలోడ్లను తీసుకెళ్లకూడదు. సాధారణంగా 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న నానో డ్రోన్లకే దేశంలో అనుమతి ఉంది.

అయితే అంతకంటే ఎక్కువ బరువున్న డ్రోన్లను వినియోగించేందుకు ‘క్వాలిఫైడ్‌ రిమోట్‌ పైలట్‌'లకు మాత్రమే అనుమతించనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు. డ్రోన్‌ పోర్టుల ఏర్పాటుపై ముసాయిదాలో ప్రస్తావించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios