Asianet News TeluguAsianet News Telugu

మొండి బాకీల వసూళ్లకు పంచముఖ వ్యూహం: 24 బ్యాంకులతో ఐసీఏ


వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుకున్న మొండి బాకీల వసూలు కోసం ఎస్బీఐతోపాటు 23 ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడ్డాయి. మొండి బాకీల వసూలు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా ప్రతిపాదించిన ‘సశక్తి’లోనూ ఇది ఉంది.

SBI, 23 other lenders sign pact to fast-track bad loan resolution

న్యూఢిల్లీ: భారీగా పేరుకున్న మొండిబాకీల (ఎన్‌పీఏ) సమస్యను సత్వరం పరిష్కరించుకోవడంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దృష్టి సారించాయి. ఇందులోభాగంగా సునీల్‌ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు సుమారు 24 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సోమవారం అంతర్‌–రుణదాతల ఒప్పందాన్ని (ఐసీఏ) కుదుర్చుకున్నాయి. కన్సార్షియం కింద ఇచ్చిన రూ. 500 కోట్ల లోపు రుణబాకీల రికవరీకి ఇది తోడ్పడనున్నది. ఈ ఒప్పందంపై 22 ప్రభుత్వ రంగ బ్యాంకులు (ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌), 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 32 విదేశీ బ్యాంకులు సంతకాలు చేశాయి. వీటితో పాటు ఎల్‌ఐసీ, హడ్కో, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి 12 దిగ్గజ ఆర్థిక సంస్థలు కూడా సంతకాలు చేసిన వాటిలో ఉన్నాయి. త్వరలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా కూడా ఐసీఏలో భాగస్వామిగా చేరనున్నది. 

త్వరలో ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు ఏడు బ్యాంకులు కూడా


‘మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ, ప్రఖ్యాత ఎన్‌బీఎఫ్‌సీలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు ఐసీఏలో చేరాయి. దశాబ్దాలుగా ఒత్తిడిలో ఉన్న ఆస్తులకు వేగవంతమైన, సమర్థమైన పరిష్కారాన్ని ఈ ఐసీఏ చూపిస్తుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్‌ అన్నారు. బోర్డు అనుమతులు దక్కాక ఐసీఐసీఐ బ్యాంక్‌ సహా మరో ఏడు బ్యాంకులు ఈ ఒప్పందంలో చేరనున్నాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా వేసిన పెద్ద ముందడుగు ఇదని ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్‌ పేర్కొన్నారు.

వచ్చే మార్చిలోపు బ్యాంకింగ్ వ్యవస్థలో 12 శాతం మొండి బాకీలు


వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ. 50– 500 కోట్ల కేటగిరీలో సుమారు రూ.3.10 లక్షల కోట్ల మేర, రూ.50 కోట్ల లోపు కేటగిరీలో రూ.2.10 లక్షల కోట్ల మేర మొండి బాకీలు ఉన్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు 12 శాతం మేర మొండిబాకీలు పేరుకుపోయాయి. గతేడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికే ఇవి రూ.9 లక్షల కోట్ల మేర ఉన్నాయి. మొండి బాకీల పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) సైతం ఇటీవలే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. 

బోర్డుల అనుమతి పొందిన తర్వాత రంగంలోకి దిగనున్న ఇతర బ్యాంకులు


‘తమ తమ బోర్డుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మిగతా బ్యాంకులూ ఈ ఒప్పందం అమలులో భాగం అవుతాయని ఆశిస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి ఇది అమల్లోకి రావొచ్చు‘ అని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) ఎండీ సునీల్‌ మెహతా విలేకరులకు తెలిపారు. తమ ప్రధాన కార్యాలయాల నుంచి అనుమతులు పొందిన తర్వాత విదేశీ బ్యాంకులు కూడా ఐసీఏలో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు.

రూ.500 కోట్ల మొండి బాకీల వసూళ్లే లక్ష్యం


ప్రధానంగా రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా విలువ ఉండే మొండి బాకీలను పరిష్కరించటం లక్ష్యమని.. రూ. 500 – రూ. 2,000 కోట్ల ఖాతాలను వేరేరకంగా డీల్‌ చేయడం జరుగుతుందని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా వివరించారు. మొండిబాకీల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనపై అధ్యయనం చేసిన సునీల్‌ మెహతా కమిటీ ఇచ్చిన ప్రాజెక్ట్‌ సశక్త్‌లోనూ ఈ ఐసీఏ ప్రతిపాదన కూడా ఉంది.  

మొండి బాకీల వసూళ్ల దిశగా కీలక ముందడుగు


మొండిబాకీల రికవరీ దిశగా ఐసీఏ కీలకమైన ముందడుగు అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ అభివర్ణించారు. భారీ మొత్తంలో రుణాలను రాబట్టడంతో పాటు అనేక ఉద్యోగాలను, జాతి సంపదను కాపాడగలిగే చక్కని ప్రణాళికలు రూపొందినా.. ఒకరిద్దరు బ్యాంకర్ల వల్ల నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బ్యాంకర్లంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయమని చెప్పారు. ‘ఇదేమీ సమాంతర వ్యవస్థ కాదు. దివాలా చట్టానికి లోబడే ఇది ఉంటుంది. నియమ నిబంధనలకు లోబడి ఏదైనా కన్సార్షియం ఇచ్చిన రుణాలకు వేగవంతమైన పరిష్కారం చూపడంలో ఇది సాయపడుతుంది’ అని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 

మొండి బాకీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి


‘ఇది చరిత్రాత్మక సందర్భం. దేశ విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం చూపిన మొండి బాకీల సమస్య భవిష్యత్‌లో మళ్లీ తలెత్తకుండా.. సమష్టిగా వ్యవహరించాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయి. తమంతట తామే సమస్య పరిష్కారానికి ఈ ఒప్పందాన్ని రూపొందించుకున్నాయి’ అని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇది సమాంతర వ్యవస్థగా కాక దివాలా చట్టానికి లోబడే పనిచేస్తుంది. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి భారీ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ఐసీఏలో చేరుతున్నాయి. ఐసీఐసీఐ వంటి ఇతర బ్యాంకులు కూడా ఇందులో భాగం కానున్నాయి‘ అని ఆయన చెప్పారు. ‘2014లో ఎదురైన సమస్యలను భవిష్యత్‌లో రానివ్వం. భారత విశ్వసనీయతను దెబ్బతిననీయమ’ని గోయెల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

‘సశక్త్’లో మొండి బాకీల వసూలుకు పంచముఖ వ్యూహం


మొండి బాకీల సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన పంచముఖ వ్యూహం ప్రాజెక్ట్‌ సశక్త్‌లో ఈ ఒప్పందం భాగంగా ఉండనున్నది. దీని ప్రకారం సదరు మొండి బాకీకి సంబంధించి అత్యధిక మొత్తాన్ని రుణంగా మంజూరు చేసిన బ్యాంకు లీడ్‌ లెండర్‌గా ఉంటుంది. ఈ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలతో పాటు ఇతరత్రా చట్టాలకు అనుగుణంగా తగు పరిష్కార ప్రణాళికను రూపొం దించి, పర్యవేక్షణ కమిటీకి సమర్పిస్తుంది. దాని సిఫార్సులను కూడా కలిపి.. మొత్తం ప్రణాళికను మిగతా రుణదాతల ముందు ఉంచుతుంది.

లీడ్ బ్యాంకుకు మొండి బాకీ కొనుగోలు హక్కు


మొత్తం రుణంలో దాదాపు 66% వాటా ఉన్న రుణదాతలు(మెజారిటీ) దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఐసీఏలోని మిగతా సంస్థలన్నీ కూడా ఇందులో ప్రతిపాదనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఏ రుణదాత అయినా దీన్ని వ్యతిరేకించిన పక్షంలో నిర్దిష్ట శాతం మేర వారి మొండి బాకీని కొనుగోలు చేసేందుకు లీడ్‌ లెండర్‌కు హక్కు ఉంటుంది. అయితే, ఇదేమీ తప్పనిసరి కాదు.

వ్యతిరేకిస్తే మిగతా సంస్థల రుణదాతల వాటాలు కొనుగోలు చేయాలి


ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన రుణదాత.. మిగతా సంస్థల రుణ వాటాలను కొనుగోలు చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది. కన్సార్షియంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి రుణ పరిష్కార ప్రణాళిక అమలుకు లీడ్‌ బ్యాంకర్‌ను తమ ఏజెంటుగా వ్యవహరించేందుకు నియమించుకుంటాయి. ప్రణాళిక అమలుకు లీడ్‌ లెండరే అవసరమైన నిపుణులను ఎంపిక చేసి, 180 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి మొండి బాకీలు తీసుకున్న సంస్థలు 1200 వరకు ఉండవచ్చునని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనా వేస్తోంది. ఈ నెలాఖరుకల్లా అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios