బేర్ర్ర్! సెప్టెంబర్లో బెంబేలు.. రూ.12.5 లక్షల కోట్లు హాంఫట్!
సెప్టెంబర్ నెల మదుపర్లకు పీడకల మిగిల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ.12.5 లక్షల మదుపర్ల పొదుపు ఆవిరై పోయింది. రూపాయి పతనం కారణంగా ద్రవ్యోల్భణం, వడ్డీరేట్లు పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ముంబై: సెప్టెంబర్ నెల ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. దాదాపుగా రెండున్నరేళ్ల పాటు పరుగులు తీసిన బుల్ కుర్రాడు.. అమెరికా అధ్యక్షుడు విసిరిన ట్రేడ్ వార్’ పంజా ముందు విలవిలలాడాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో తొలిసారి మదుపర్లు నష్టపోయిందీ ఈ నెలలోనే కావడం గమనార్హం. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధంతో డాలర్ బలోపేతమై.. రూపాయి అంతకంతకు జీవిత కాల కనిష్టం వద్దకు పతనమైంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లు ‘బేర్’మనిపించాయి మదుపర్ల సంపదకు భారీగా గండి పడింది. చాలా తక్కువ షేర్లు ఈ నెలలో లాభాలను నమోదు చేయగా.. ఎక్కువ షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. వీటికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (ఎన్బీఎఫ్సీ) ద్రవ్యలభ్యతపై ఆందోళనలను కూడా ఒత్తిడికి గురి చూశాయి. అందుకే సెప్టెంబర్లో సెన్సెక్స్ 2418 పాయింట్లు (5%) నష్టపోగా.. మదుపర్ల సంపద రూ.12.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆగస్టు 31న బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.159.35 లక్షల కోట్లు కాగా, ఈ నెల 27 నాటికి రూ.146.86 లక్షల కోట్లకు పరిమితమైంది.
ఒక షేర్ 20% పడిపోతే దాని విలువ సరైనదేనా.. కంపెనీ స్వల్పకాల, దీర్ఘకాల అంచనాలు ఎలా ఉన్నాయో గమనించాల్సి ఉంటుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ఒకటి అంటోంది. కేవలం షేరు విలువను కాకుండా.. మూలాలను బట్టి కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తోంది. మార్కెట్ ఈ సమయంలో అనిశ్చితిగానే కనిపిస్తోంది. కొన్ని పెద్ద స్థాయి కంపెనీలు, మధ్య, చిన్న స్థాయి కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తున్నాయి. విద్యుత్, ఎగుమతులు, తయారీ రంగాలతోపాటు.. డిపాజిట్లను గట్టిగా సేకరించగలిగే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదని ఓ దేశీయ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది.
ఇటువంటి దిద్దుబాట్ల వల్ల మంచి షేర్ల ఎంపికకు వీలవుతుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొన్ని మ్యూచువల్ ఫండ్లు బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొందరు మాత్రం బ్యాంకు షేర్లను కొనడం ప్రస్తుతానికి మంచిది కాదని.. స్వల్పకాల మదుపర్లు పడినపుడల్లా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. మూడేళ్లు, అయిదేళ్ల పాటు అయితే ప్రస్తుత స్థాయిల్లో కొనుగోళ్లు మంచివి కానీ.. 6 నెలలు, ఏడాదికైతే మార్కెట్లకు దూరంగా ఉండడం మంచిదని అంటున్నారు. నిఫ్టీ ఇండెక్స్ డిసెంబర్ 2018కల్లా 10,500 చేరొచ్చన్న అంచనా వేస్తున్నారు.
నెలలో స్టాక్ మార్కెట్లు భారీగా చవిచూసిన నష్టాల్లోనూ వేదాంతా, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ వంటి కొన్ని పెద్ద షేర్లు.. బయోకాన్, రాజేశ్ ఎక్స్పోర్ట్స్ వంటి మధ్య స్థాయి షేర్లు లాభాలను అందుకున్నాయి. ఇక ఏబీబీ, దివీస్ ల్యాబ్స్, ముతూట్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, టీవీఎస్ మోటార్, జిలెట్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి మధ్యస్థాయి షేర్లు కూడా 1-10% రాణించాయి.
చిన్న షేర్లలో హాత్వే, ప్రజ్ ఇండస్ట్రీస్, బాంబే రేయాన్ ఫ్యాషన్స్, త్రివేణి ఇంజినీరింగ్, డీసీఎమ్ శ్రీరామ్, ఆల్సెక్ టెక్నాలజీస్లు 15% పైగా పెరిగాయి. ధమ్పూర్ షుగర్ మిల్స్(50%), అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ(37%), బజాజ్ హిందుస్థాన్ షుగర్(36%), దాల్మియా భారత్(29%), ఉత్తమ్ షుగర్ మిల్స్(28%), ద్వారికేశ్ షుగర్ (27%) వంటి చక్కెర షేర్లు లాభాలే పొందాయి.
ఈ మార్కెట్ పతనంలో చిన్న షేర్లే 90- 60 శాతం దాకా పతనం అయ్యాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్, ఇండియన్ బ్యాంక్, రిలయన్స్ పవర్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్లు 55 శాతం వరకూ దిగాలు పడ్డాయి. ఇక యెస్ బ్యాంక్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ 20-40 శాతం మేర చతికిలబడ్డాయి.
రూపాయి క్షీణత వల్ల ఎగుమతిదార్లు మాత్రం ప్రయోజనం పొందితే.. కానీ దేశీయంగా ధరలు పెరగడానికి కారణమైంది. ఇక చమురు దిగుమతి దేశంగా ఉన్న భారత్పై 80 డాలర్లకు చేరిన పీపా ధర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. త్వరలో ఇది 100 డాలర్లకు కూడా చేరుతుందన్న భయాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు కూడా వినియోగదారు కొనుగోలు శక్తిని నిర్ణయించేవే. ఆహార ధరలు తగ్గడంతో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం దిగివచ్చాయి. భవిష్యత్లో షేర్ల ధరలపై ప్రభావం చూపే అంశాల్లో ద్రవ్యోల్బణం కీలకం కానుంది. ఇక దీనిపై ఆధారపడే ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. జూన్ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు రెపో రేటును పెంచింది కూడా. ఆర్బీఐ నిర్ణయాలు కూడా మార్కెట్కు దిశానిర్దేశం చేయవచ్చు.
సమీప భవిష్యత్లో దేశంలో చోటు చేసుకోబోయే అతిపెద్ద పరిణామం ఎన్నికలే. స్టాక్ మార్కెట్పైనా ఇవి గట్టి ప్రభావాన్నే చూపగలవు. ఓటరు నిర్ణయం ఏదైనా ప్రభావం తప్పదు. ఇక స్థూలంగా చూస్తే భారత్ వేంగా వృద్ధి చెందుతున్న దేశంగా పేరున్నప్పటికీ.. కరెంట్ ఖాతా లోటు పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం 2018-19లో 3.3 శాతానికి పరిమితం చేస్తామని చెబుతోంది. ఇక కంపెనీలు లాభదాయకతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కమొడిటీ ధరలు తగ్గడం వీటికి కలిసివస్తోంది. అయితే వీరికి రుణ వ్యయాలు మాత్రం భారంగానే ఉంటున్నాయి.
అమెరికా, చైనా మధ్య అంతకంతకూ రాజుకుంటున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఎగుమతి ఆధారిత షేర్లకు భారీ అవకాశాలు వస్తున్నాయి. భారత్ కూడా ఈ పరిణామం నుంచి సానుకూలతలను అందుకునే అవకాశం ఉంది. ఇక బ్రెగ్జిట్ పరిణామాలు, అమెరికా ఆర్థిక వృద్ధి, డాలరు బలోపేతం, విదేశీ మదుపర్ల నిధుల ప్రవాహం తదితరాలు కూడా కీలకం కానున్నాయి.