నీరవ్ మోడీ 13 లగ్జరీ కార్ల వేలం: రూ. కోటికే రోల్స్ రాయిస్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచిపారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన ఆస్తుల వేలాన్ని కొనసాగిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. తాజాగా, నీరవ్కు చెందిన విలాసవంతమైన కార్లను కూడా వేలం వేస్తోంది.
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచిపారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన ఆస్తుల వేలాన్ని కొనసాగిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. తాజాగా, నీరవ్కు చెందిన విలాసవంతమైన కార్లను కూడా వేలం వేస్తోంది.
నీరవ్ మోడీ వద్ద మొత్తం 13 కార్లు ఉండగా, వాటిలో అత్యంత విలువైంది, విలాసవంతమైంది రోల్స్ రాయిస్. అయితే, రూ. 5 కోట్ల విలువైన ఆ కారుకు వేలంలో నిర్ణయించిన ప్రారంభ ధర రూ.1.3 కోట్లు కావడం గమనార్హం. ఈ కార్లకు మంచి ధర పలకవచ్చని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
పీఎన్బీలో 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి ప్రస్తుతం బ్రిటన్లో అరెస్టయిన నీరవ్ మీద ఈడీ ఇప్పటికే అనేక అభియోగాలు మోపింది. వాటిని పరిశీలించిన ముంబైలో ప్రత్యేక న్యాయస్థానం అతడి ఆస్తులను వేలం వేయడానికి అనుమతిచ్చింది. దీనిలో భాగంగా వేలం వేసే కార్ల వివరాలను ఈడీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఎస్టీసీ)లో ఉంచింది.
ఆ సంస్థే ఈ కార్ల వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఆ కార్లను పరిశీలించుకోడానికి అనుమతి కూడా ఇచ్చింది. అయితే, టెస్ట్ డ్రైవర్ చేయడానికి మాత్రం వీల్లేదని స్పష్టం చేసింది.
నీరవ్ వద్ద ఉన్న 13 కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనామెరా, రెండు మెర్సిడెజ్ బెంజ్లు, టయోటా ఫార్చునర్, ఇన్నోవా, మూడు హోండా కార్లు, రెండు హోండా బ్రియోస్, ఇతర కార్లు ఉన్నాయి.
ఇప్పటికే ఈడీ నీరవ్ మోడీకి చెందిన పెయింటింగ్లను వేలం వేయడం ద్వారా రూ.54 కోట్లను పొందింది. మరో వైపు లండన్లో ఉన్న అతడిని భారత్కు అప్పగించేందుకు ఈడీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.