రిలయన్స్ అంచనా: ఉత్పత్తిని నిలిపివేసినందుకు 3 వేల కోట్ల నష్టం...
కేజీ-డీ6 బేసిన్ లో సహజవాయు ఉత్పత్తిని నిలిపివేసినందుకు రూ.3000 కోట్లు నష్టపోవాల్సి వస్తుందా? అని రిలయన్స్ అంచనా వేసినట్లు సమాచారం. ఒప్పంద సమయానికి ముందే ఉత్పత్తి నిలిపివేసినందుకు కేంద్రం.. బావి తవ్వకం ఖర్చులు రాబట్టుకునేందుకు రిలయన్స్-బీపీ సంస్థకు అనుమతించకపోవడమే దీనికి కారణం.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో తొమ్మిదేళ్ళుగా కొనసాగుతున్న కేజీ-డీ6 ఖర్చుల వసూలు వివాదంలో సంస్థ ఓడిపోతే గరిష్ఠంగా రూ.3 వేల కోట్ల మేర ప్రభావం ఉండవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల అంచనా వేసింది. కేజీ-డీ6లోని ధీరూభాయ్-1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి సహజ వాయువు ఉత్పత్తిని ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం నిలిపివేశాయి. ముందుగా అంచనా వేసిన దానికంటే త్వరగా ఈ క్షేత్రాలను మూయడాన్ని కేంద్రం తప్పుబట్టింది.
ఆమోదిత ప్రణాళిక అమలులో రిలయన్స్ విఫలం
ఆమోదిత పెట్టుబడి ప్రణాళికను అమలు పరుచడంలో రిలయన్స్ విఫలమైందని, అందుకే 300 కోట్ల డాలర్లకుపైగా ఖర్చులను రాబట్టు కోవడానికి అనుమతించబోమని కేంద్రం పేర్కొన్నది. దీనిపై రిలయన్స్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. ఒప్పందంలో ఇలాంటి నిబంధనేదీ లేదంటున్నది.
రిలయన్స్కు, కేంద్రానికి మధ్య భాగస్వామ్య ఒప్పందం
ఉత్పాదక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం కేజీ-డీ6లో కనుగొన్న, ఉత్పత్తి చేసిన చమురు, గ్యాస్ను తమ పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు వచ్చేదాకా కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. అప్పటిదాకా తమ లాభాల్లో ప్రభుత్వానికి వాటా ఇవ్వవు.
మొత్తం సహజ వాయు విక్రయ లాభాల్లో కేంద్రానికే అధిక వాటా
కానీ, రిలయన్స్ ఆమోదిత పెట్టుబడి ప్రణాళికను పాటించలేదంటున్న కేంద్రం.. ఖర్చులు రాబట్టుకునేందుకు అనుమతించడం లేదు. దీంతో రిలయన్స్, బీపీ లాభాల్లో సర్కారుకు అధిక వాటా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ కేసు తుది విచారణ షెడ్యూల్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ మధ్య జరుగనున్నది.
దేశీయ మార్కెట్లోకి ఎఫ్ఫీఐల నిధులు
ఎఫ్పీఐ మళ్లీ నిధులను విదిల్చారు. కరోనా వైరస్తో వరుసగా రెండు నెలలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్న ఎఫ్పీఐలు ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.9 వేల కోట్ల నిధులను చొప్పించారు. స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాలబాట పట్టడం, హెచ్యూఎల్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఎఫ్పీఐల్లో నమ్మకం పెరిగింది.
గత రెండు నెలల్లో రూ.68 వేల కోట్ల ఉపసంహరణ
దీంతో మార్చిలో రూ.61,793 కోట్లు, ఏప్రిల్లో రూ.6,883 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న ఎఫ్పీఐలు ఆ మరుసటి నెలల్లోనే భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం. ఫిబ్రవరిలో రూ.1,820 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
also read కరోనాలో కొలువు పోయినా.. ఎగసిపడిన బిలియనీర్ల సంపద ...
ఈ నెలలో రూ.9,089 కోట్ల పెట్టుబడులు
తాజాగా డిపాజిటరీ వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ నెల 22 లోపు ఈక్విటీ మార్కెట్లలోకి రూ. 9,089 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్పీఐలు..డెబిట్ మార్కెట్ల నుంచి మాత్రం రూ.21,418 కోట్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుత నెలలో జరిగిన 15 ట్రేడింగ్లలో 12 ట్రేడింగ్లలో ఎఫ్పీఐలు పెట్టుబడులు పెట్టారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిశా నిర్దేశం
అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కూడా మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంక్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు నిరుత్సాహకరంగా ఉండటంతో వారం రోజులుగా తీవ్ర ఊగిసలాడిన సూచీలు ఈ వారంలోనూ ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులతో కలవరం
మరోవైపు వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ బాదితుల సంఖ్య కూడా కలవరానికి గురిచేస్తున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులపై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు దృష్టి సారించే అవకాశం ఉన్నదని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. వీటితోపాటు ఈవారంలో విడుదల కానున్న హెచ్డీఎఫ్సీ, డాబర్ ఇండియా, లుపిన్, టీవీఎస్ మోటర్, వోల్టాస్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి.