పల్లెపల్లెకూ..బేకరీ టు సెలూన్: ఆకర్షణీయంగా ‘ఈ-కామర్స్’
మున్ముందు ‘ఈ-కామర్స్’ బిజినెస్ లో మారుమూల గ్రామాల్లోకి కిరాణా దుకాణాలు కీలకం కానున్నాయి. ఈ కిరాణా దుకాణాలను ‘ఈ-కామర్స్’లో భాగం చేసేలా సదరు ఈ -కామర్స్ సంస్థలు వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందిస్తున్నాయి. చివరకు బేకరీలు, సెలూన్లపైనా ద్రుష్టి పెట్టాయి.
ఈ-కామర్స్ లోకి ‘రిలయన్స్’ రంగ ప్రవేశం చేయనున్న నేపథ్యంలో ఇతర బడా ఈ-కామర్స్ సంస్థలు సరికొత్త వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని మూలమూలలకు తమ వ్యాపారాన్ని విస్తరించేలా గొప్ప గొప్ప ప్రణాళికలను తయారు చేస్తున్నాయి.
ఈ ప్రణాళికల్లో భాగంగానే కంపెనీలు పట్టణాలతోపాటు పల్లెలకూ తన విస్తృతిని పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకు ఆయా సంస్థలు తాజాగా గ్రామాల్లో తప్పకుండా ఉండే కిరాణా దుకాణాలను కేంద్రంగా చేసుకోనున్నాయి.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ వంటి రిటైల్ దిగ్గజ సంస్థలు వీటి ద్వారా తమ ఆన్లైన్, ఆఫ్లైన్ వ్యాపారాన్ని పెంచుకొనేలా ప్రణాళికలు వేస్తున్నాయి. రిలయన్స్ సంస్థ వివిధ మార్గాల్లో తన రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇప్పటికే లక్షలాది కిరాణా దుకాణాలతో జట్టుకట్టాలని భావిస్తోంది.
ఈ దిశగా చర్యలను కూడా మొదలు పెట్టింది. అయితే దీనికి పోటీగా తాజాగా వాల్మార్ట్కు చెందిన దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్డ్ కూడా ఇదే మార్గంలో విస్తరించాలని.. భారత రిటైల్ మార్కెట్లో పాగా వేయాలని భావిస్తోంది.
తాజా ప్రణాళికలో భాగంగా ఫ్లిప్కార్ట్ సంస్థ దేశంలోని 15వేల చిల్లర దుకాణాలు, బ్యూటీ సెలూన్లు, బేకరీలు, ఫార్మా దుకాణాలతో పాటు ఇతర చిన్న వ్యాపార సంస్థలతో కలిసి తమ వ్యాపారాన్ని విస్తరించుకోనుంది.
తెలంగాణలో ప్రయోగాత్మకంగా కిరాణా దుకాణాలను ఆసరగా చేసుకొని వ్యాపారాన్ని విస్తరించాలని ఫ్లిప్కార్టు భావిస్తున్నది. ఇందుకు తాజాగా తెలంగాణలో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
ఈ పైలట్ ప్రాజెక్టు కింద దాదాపు 800 చిన్న దుకాణదారులతో తొలత జట్టుకట్టి మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. ఫ్లిప్కార్డు యాప్ ద్వారా ఫోన్ను బుక్ చేసుకునే సౌలభ్యంతోపాటు వారికి దగ్గరలోని కిరాణ దుకాణం ద్వారా ఫోన్ల డెలివరీని అందించేలా ఈ ప్రాజెక్టు అమలవుతోందని సంబంధిత సిబ్బంది తెలిపారు.
ఈ లావాదేవీలో పాల్గొని సంస్థకు దోహద పడినందుకు కిరాణ దుకాణదారుకు మొబైల్ రిటైలర్కు ఇచ్చే మార్జిన్ను ఈ- రిటైల్ సంస్థలు అందిస్తున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా చిన్న దుకాణాల ద్వారా షిప్మెంట్ నిర్వహించడం వల్ల ఫ్లిప్కార్ట్ సంస్థ నెలకు రూ.15-20 కోట్ల మేర రెవెన్యూను ఆర్జిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ వర్గాల కథనం.
భవిష్యత్లో ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలుపరిచేలా సంస్థ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విధానంతో ఇరు పక్షాల వారికి మేలు జరుగుతుందని చిన్న రిటైలర్లు కొత్త వ్యాపార మార్గాలను, వ్యాపార కేంద్రాలను అందిపుచ్చుకొనే వీలుకలుగనుందని వారు చెబుతున్నారు.
మరోవైపు సంస్థలకు కూడా మౌలిక వసతుల కల్పన కోసం కోట్లలో వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉండదని.. వారు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రిటైల్ రంగంలోకి పలు పెద్ద సంస్థలు అడుగుపెట్టి విస్తరించేందుకు ప్రయత్నిస్తు న్నా.. భారత్లో ఇంకా 95% వ్యాపారం ఇంకా చిన్నచిన్న స్టోర్ల ద్వారానే జరుగుతోంది. అందుకే చిన్నచిన్న స్టోర్లను ఆసరాగే చేసుకొని విస్తరించాలని పెద్ద కంపెనీలు యోచిస్తున్నాయి.
మరోవైపు ఫ్లిప్కార్టుకు చెందిన ప్యాషన్ యూనిట్ మింత్రా వ్యాప్తికి 2017లోనే 'మెన్సా నెట్వర్స్' పేరుతో 50 ప్రధాన నగరాలలోని 9000 చిన్న స్టోర్స్తో జట్టుకట్టింది. ఇప్పుడు ఫ్యాషన్కు అదనంగా ఫ్లిప్కార్టు సంస్థ తన ఉత్పత్తుల విక్రయానికి తొలిసారిగా చిన్న స్టోర్స్తో భాగస్వామ్యం కడుతోంది.
మరోవైపు ఫ్లిప్కార్డ్ పోటీ సంస్థ అమెజాన్ కూడా ఇప్పటికే 'ఐహావ్ స్పేస్' పేరుతో దేశంలోని దాదాపు 350 నగరాలలోని 20,000 మామ్ అండ్ పాప్ స్టోర్స్తో జట్టుకట్టింది. ఆయా చిన్న దుకాణాల చుట్టుపక్కల దాదాపు 2-4 కిలోమీటర్ల పరిధిలో వస్తువులను డెలివరీ అందించడంతోపాటు కొత్త ఉత్పత్తుల పరిచయానికి కూడా ఈ నెట్వర్క్ను వినియోగించుకుంటోంది.
ఫ్లిప్కార్టు సంస్థలా అమెజాన్ చిన్న స్టోర్స్ వారి ద్వారా వినియోగదారుల ఆర్డర్లను తీసుకోవడం లేదు. అయితే రానున్న రోజుల్లో పోటీ సంస్థలకు దీటుగా ఎదిగేందుకు గాను ఈ దిశగా కూడా కంపెనీ అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.