Asianet News TeluguAsianet News Telugu

అనిల్ అంబానీ ఆపసోపాలు: సేల్ లేదంటే లీజుకు రిలయన్స్ హెడ్ క్వార్టర్


అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అడాగ్ రిలయన్స్ రిలయన్స్‌  గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ముంబై నగర పరిధిలో వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని శాంటాక్రూజ్ భవన సముదాయాన్ని విక్రయించడం గానీ, లేదా లీజుకివ్వడం ద్వారా గానీ కొంత నగదు సమకూర్చుకుని అప్పులు తీర్చి.. వచ్చే ఏడాది చివరికల్లా రుణ రహిత సంస్థగా రిలయన్స్ అడాగ్ గ్రూపును నిలుపాలని అనిల్ అంబానీ పట్టుదలగా ఉన్నారని సమాచారం. కానీ ఆయన తాజా నిర్ణయంతో అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లు పతనమయ్యాయి. 

Reliance Infra plans to monetise Mumbai office building to reduce debt
Author
Hyderabad, First Published Jul 2, 2019, 1:40 PM IST

ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న అడాగ్ - రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ తీసుకున్న సంచలన నిర్ణయం మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ముంబైలోని  అతి విలాసవంతమైన భవన సముదాయం  విక్రయించడం గానీ, అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. 


తద్వారా  కొన్ని అప్పులు తీర్చాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో ప్రస్తుతం అడాగ్ గ్రూపునకు ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తున్న ఈ భవనాన్ని లీజు ప్రాతిపదికన అప్పగించడం లేదంటే మంచి బేరం వస్తే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్‌ఈకి సమచారం ఇచ్చింది.

 

దీర్ఘకాలిక లీజు కింద భవనాన్ని అప్పగించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకోనుంది. 2020 నాటికి రుణ రహిత సంస్థగా మారేందుకు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా లక్ష్యం నిర్దేశించుకుంది. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల  చదరపు అడుగుల విస్తీర్ణంలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయం ఉంది. 

 

ఈ భవనం అమ్మకం లేదా లీజు కోసం గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదిక చెబుతున్నాయి.  తద్వారా రిలయన్స్ ఇన్ ఫ్రా రూ. 1,500-2,000 కోట్ల నగదు సమకూర్చుకోనుందని ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన కథనం పేర్కొంది. 

 

మరోవైపు ఈ భవనం కూడా చట్టపరమైన  వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీ పూర్తి చేయడం కోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్‌ను కూడా నియమించుకుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అనిల్ అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అడాగ్‌ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి.

 

ఈ ఒప్పందం పూర్తయితే శాంతాక్రూజ్‌ నుంచి దక్షిణ ముంబైలోని బెల్లార్డ్‌ ఎస్టేట్‌కు ప్రస్తుత కార్యాలయాన్ని మారుస్తారు. ముంబై వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్‌ గ్రూపు కార్యాలయాలకు ఉద్యోగులనూ తరలిస్తారు.

 

ఇదిలా ఉంటే అవసరమైతే ఆస్తులను విక్రయించైనా సరే రుణాలు తిరిగి చెల్లిస్తానని ఇటీవల అనిల్‌ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే రిలయన్స్‌ గ్రూపు వేగంగా పావులు కదుపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. 

 

రిలయన్స్‌ సెంటర్‌ కార్యాలయ భవనం 6.95 లక్షల చదరపు అడుగుల స్థలంలో పరివేష్టితమై ఉంది. ఇక్కడ ఒకేసారి 425 కార్లు పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముంబై వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు పక్కనే ఉండటంతోపాటు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. 

 

అంటే దేశీయ విమానాశ్రయ టెర్మినల్‌కు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌కు చేరుకోవాలంటే కేవలం 20 నిమిషాల ప్రయాణం మాత్రమే. త్వరలో రాబోతున్న శాంతాక్రజ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే రిలయన్స్ అడాగ్ గ్రూప్ కార్యాలయ భవనం ఉంది. 

 

న్యూఢిల్లీ-ఆగ్రా టోల్‌ రహదారిని క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థకు విక్రయించనున్నట్లు ఇటీవల రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ప్రకటించింది. వచ్చేనెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి, రూ.3,600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. 

 

గత ఏడాది ముంబైలో ఉన్న ఇంధన వ్యాపారాన్ని రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించింది. దీంతో రుణ భారాన్ని రూ.22వేల కోట్ల నుంచి తగ్గించుకుంది. 

 

సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో కుబేరుల క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు. 2018 మార్చి నాటికి  రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.

 

11 ఏళ్లలో అనిల్ అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ రూ. 3,651 కోట్లకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005లో  రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్న ముకేశ్‌ అంబానీలో విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్‌ అంబానీకి ఈ కార్యాలయం లభించింది.

 

మరోవైపు, రిలయన్స్‌ గ్రూపునకు చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) కూడా దివాలా బాటలో ఉంది. దివాలా ప్రక్రియ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) చేరింది. ఇప్పటికే రూ.57,500 కోట్ల క్లెయిమ్‌లు వచ్చాయి. ఇందులో సొంత గ్రూపు సంస్థలు కూడా తమకు రూ.7,000 కోట్లు ఆర్‌కామ్‌ నుంచి రావాలని క్లెయిమ్‌ చేశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios