లాక్డౌన్తో ‘ఈ-రిటైల్స్’కు కష్టాలు: లక్షల ఆర్డర్లు రద్దు.. లేదా రీ షెడ్యూల్
కరోనా ‘లాక్ డౌన్’ వల్ల కొన్ని లక్షల ఆర్డర్లను రద్దు లేదా రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని ఈ – కామర్స్ సంస్థలు వాపోతున్నాయి
బెంగళూరు: కరోనా ‘లాక్ డౌన్’ వల్ల కొన్ని లక్షల ఆర్డర్లను రద్దు లేదా రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని ఈ – కామర్స్ సంస్థలు వాపోతున్నాయి. అత్యవసరమైన మెడిసిన్స్, ఫుడ్, గ్రోసరీల సరఫరాను లోకల్ అధికారులు బలవంతగా అడ్డుకున్నారని ఈ–కామర్స్ సంస్థలు బిగ్బాస్కెట్, గ్రోఫర్స్, 1 ఎంజీ ఆరోపించాయి.తమ వేర్హౌస్లను మూసివేశారని, సప్లై ట్రక్కులను ఆపేశారని, డెలివరీ ఏజెంట్లను వీధుల్లోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపాయి.
గత వారం ఈ-కామర్స్ సంస్థల వేర్హౌస్లు, లాజిస్టిక్ ఫెసిలిటీలు, డెలివరీ పార్టనర్లను ప్రొబిషనరీ ఆర్డర్ల నుంచి సర్కార్ మినహాయించింది. అత్యవసరమైన వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికి లోకల్ అధికారులు తమ సరఫరాలను అడ్డుకున్నారని ఈ కామర్స్ సంస్థలు వాపోతున్నాయి.
కాగా లాక్ డౌన్ వల్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థలతో పాటు, బిగ్బాస్కెట్, గ్రోఫర్స్, 1 ఎంజీ వంటి కంపెనీ సరఫరాలు కూడా ఆగిపోయాయి. వేటిని అనుమతించాలన్న విషయమై కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు లేవని గ్రోఫర్స్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా అన్నారు.
అత్యవసరమైన వస్తువులను డెలివరీ చేసే కంపెనీలకు అనుమతి ఇవ్వాలని గ్రోఫర్స్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు. ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడానికి ఇది సాయపడుతుందని తెలిపారు.
గ్రోఫర్స్ ఆదివారం ఏకంగా 1,70,000 ఆర్డర్లను క్యాన్సిల్ చేయడం గానీ, రీషెడ్యూల్ చేయడం గానీ చేసింది. తమ వేర్హౌస్లకు సప్లై చేసే ట్రక్కులను తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలలో ఆపేశారని ధిండ్సా అన్నారు.
వీటితో పాటు మహారాష్ట్ర , హర్యానాలలో కంపెనీ వేర్హౌస్లను బలవంతంగా మూసేశారని ధిండ్సా అన్నారు. దాదాపు అన్ని నగరాలలో తమ డెలివరీ ఏజెంట్లను ఆపారని, కొంత మందిని కొట్టారని కూడా బిగ్బాస్కెట్ ఆరోపించింది.
ఈ విషయాలపై ఈ–కామర్స్ కంపెనీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో చర్చిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మందులను డెలివరీ చేసే 1 ఎంజీ కూడా ఆదివారం ఇబ్బందులు పడింది. ఇళ్ల వద్ద నుంచి శాంపిల్స్ను కలెక్ట్ చేసి, ఈ సంస్థ ఆన్లైన్ డయోగ్నస్టిక్స్ను అందిస్తోంది. ఢిల్లీ, పాట్నా, ముంబైలలో తమ ప్రి ఎనలిటికల్ సెంటర్లను మూసేశారని 1 ఎంజీ తెలిపింది.
హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, ఫరీదాబాద్, గూర్గావ్లో తమ డెలివరీ ఏజెంట్లను అడ్డుకున్నారని 1 ఎంజీ వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు స్పష్టత లేదని 1 ఎంజీ సీఈఓ ప్రశాంత్ టాండాన్ అన్నారు.
కర్ఫ్యూ సమయాలలో అత్యవసరమైన వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండకూడదని 1 ఎంజీ సీఈఓ ప్రశాంత్ టాండాన్ తెలిపారు. గ్రోసరీ డెలివరీ కంపెనీలకు ఆర్డర్లు విపరీతంగా వచ్చాయని కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తెలిపారు.
also read:నిర్మలా సీతారామన్ ప్రకటన: కేంద్ర ప్రభుత్వ కరోనా ఆర్థిక ప్యాకేజీ ఇదీ...
కర్య్ఫూ వల్ల ఒక్క ఆదివారమే ఐదు రెట్లు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని ఆన్ లైన్ రిటైల్ సంస్థల ఎగ్జిక్యూటివ్లు అన్నారు. యావరేజ్ ఆర్డర్ విలువ కూడా 20–25 శాతం పెరిగిందని తెలిపారు. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్లో ఉండడంతో వీటికి డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు.
తిరిగి ఆన్ లైన్ వస్తువుల డెలివరీ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని మరో ఈ-రిటైల్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. లాక్ డౌన్ వల్ల సేవలు నిలిచిపోయిన సంస్థల జాబితాలో జొమాటో, మెడ్ లైఫ్, స్విగ్గీ తదితర సంస్థలు ఉన్నాయి.