పల్లెసీమలకు నెట్: 12.5 లక్షల వైఫై హాట్స్పాట్స్
నెట్ తటస్థత కోసం జాతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) రూపొందించిన సిఫారసులను జాతీయ టెలికం కమిషన్ ఆమోదించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకు డిజిటల్ కమ్యూనికేషన్స్ను, ఇంటర్నెట్ను విస్తరించాలని కేంద్రం ఆశిస్తోంది. తాజాగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ)- 2018 విధానానికి జాతీయ జాతీయ టెలికం కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ విధానంలో భాగంగా సుమారు రూ. 6,000 కోట్ల అంచనా వ్యయంతో 2018 డిసెంబర్కల్లా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 12.5 లక్షల వై–ఫై హాట్స్పాట్స్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా కమిషన్ ఆమోదం తెలిపిందని టెలికం కమిషన్, టెలికం శాఖ సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు.
పోలీస్ స్టేషన్ల నుంచి పాఠశాలల వరకు ఇలా అనుసంధానం
ఈ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు, పాఠశాలలను వై–ఫై సర్వీసులతో అనుసంధానించనున్నారు. రోజంతా ప్రజల వినియోగానికి 1–2 వైఫై హాట్స్పాట్స్ అదనంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, టెలికం ఆపరేటర్ల నుంచి టాక్టైమ్, డేటా మొదలైనవి కొనుగోలు చేసి తమ బ్రాండ్ కింద రిటైల్గా విక్రయించే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ (వీఎన్వో)పై విధిస్తున్న ద్వంద్వ పన్నుల నివారణ ప్రతిపాదనకూ టెలికం కమిషన్ ఆమోదించింది.
‘డిజిటల్ కమ్యూనికేషన్స్’కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాయి
కొత్త టెలికం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకునే దిశగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ) 2018కి కూడా ఆమోదముద్ర వేసినట్లు జాతీయ టెలికం కమిషన్ చైర్ పర్సన్ సుందరరాజన్ మీడియాకు తెలిపారు. ‘భౌతిక మౌలిక వసతుల కన్నా డిజిటల్ మౌలిక వసతులు ప్రస్తుతం దేశానికి చాలా కీలకమని సమావేశంలో సభ్యులంతా అన్నారు. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ మౌలిక వసతులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. సంస్కరణల ఊతంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. సెకన్కు 50 మెగాబైట్ల వేగంతో ప్రజలందరికీ బ్రాడ్బ్యాండ్ను అందుబాటులోకి తేవడం మొదలైన లక్ష్యాలను ఎన్డీసీపీలో నిర్దేశిస్తోంది.
డిజిటల్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు
జాతీయ టెలికం కమిషన్ ఆమోదించిన ‘నేషనల్ డిజిటర్ కమ్యునికేషన్ పాలసీ 2018’ ద్వారా 2022 కల్లా డిజిటల్ కమ్యునికేషన్ రంగంలో దాదాపు 40 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పాడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి దాదాపు 50 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో డిజిటల్ కమ్యునికేషన్ వాటా ఆరు శాతంగా ఉంది. ఈ పాలసీ ద్వారా అది ఎనిమిది శాతానికి పెరగనున్నది.
నెట్ న్యూట్రాలిటీకి ఆమోదం
కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను జాతీయ టెలికం కమిషన్ ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్లు, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనున్నదని టెలికం కమిషన్ చైర్మన్ అరుణ సుందరరాజన్ తెలిపారు. ‘నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ రూపొందించిన సిఫారసులను టెలికం కమిషన్ (టీసీ) ఆమోదించింది.
నెట్ న్యూట్రాలిటీ కింద కొన్ని కీలక సేవలకు మినహాయింపు
నెట్ న్యూట్రాలిటీ నిబంధనల క్రింద కొన్ని కీలక సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది’ అని జాతీయ టెలికం కమిషన్ చైర్ పర్సన్ అరుణా సుందర్ రాజన్ పేర్కొన్నారు. ఈ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం టెలికం శాఖ (డాట్) ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడర్స్, టెలికం ఆపరేటర్లు, పౌర సమాజ సభ్యులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు తదితరులు సభ్యులుగా ఉంటారు. కీలక సర్వీసులకు సంబంధించిన డేటా ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన విధానాల గురించి టెలికం శాఖ .. ట్రాయ్ సిఫారసులు కోరనుంది.
తావు లేదు ఇక పక్షపాతానికి..
సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్లు, సర్వీసులకే ప్రాధాన్యమిస్తూ మిగతా వాటిని బ్లాక్ చేయడం లేదా నెట్ వేగాన్ని తగ్గించేయడం వంటి పక్షపాత ధోరణులతో వ్యవహరించకుండా తటస్థంగా ఉండేలా చూడటం నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ కంటెంట్ను అందించడంలో వివక్ష ధోరణులకు దారి తీసేలా.. ఏ సంస్థలతోనూ సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. అలాగే నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్ను బట్టి ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించడం వంటి పక్షపాత దోరణులకు పాల్పడకుండా నిర్దిష్ట ఆంక్షలు ఉండేలా లైసెన్సింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేయాలని కూడా సూచించింది.