జీ ఎంటర్టైన్మెంట్ పై అంబాని చూపు... రిలయన్స్, ఎయిర్ టెల్ పోటాపోటీ
సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాటాలపై బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కన్నేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
దేశీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటు రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, అటు ఎయిర్ టెల్ అధిపతి సునీల్ మిట్టల్ కూడా అంతర్జాతీయంగా రెండో టెలికం సంస్థగా తమ టెలికం ప్రొవైడర్ సంస్థను నిలిపేందుకు పోటీ పడుతున్నారు.
ఇప్పటికే ‘జీ’ ఎంటర్ టైన్మెంట్ కోసం భారతీ ఎయిర్ టెల్ చర్చలు ప్రారంభించింది. త్వరలో ఓ ప్రతిపాదననూ జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ జియో కూడా జీ వాటాల కొనుగోలు అంశాన్ని సీరియస్ గానే పరిశీలిస్తోంది.
దీనిపై ‘జీ’ ప్రతినిధి స్పందిస్తూ కంపెనీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదని తెలిపారు. ప్రస్తుతం దీనిపై బలమైన భాగస్వాములతో చర్చలు జరుపుతామని మాత్రం పేర్కొన్నారు.
అయితే ఈ ఏడాది ప్రభుత్వం 5జీ వేవ్స్ కోసం వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వీడియో కంటెంట్ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చిన సంస్థలు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అంచనా.
ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీలైన ఏటీఅండ్టీ, వొడాఫోన్, కేడీడీఐ కార్ప్ కూడా సినీ, టెలివిజన్ సంస్థలను కొనుగోలు చేయడంతోపాటు, టీవీ రంగ ఆస్తులను కూడా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు భవిష్యత్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్తో పోటీ పడనున్నాయి.
ఇప్పటికే భారతీ ఎయిర్ టెల్ 4.6బిలియన్ డాలర్లను రైట్స్ ఇష్యూ రూపంలో సమీకరించి నిధులను సిద్ధం చేసుకొంది. గత ఏడాది భారతీ సంస్థ జీతో ఒప్పందం కూడా చేసుకొంది. జీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడంతో తమ టెలికం, కేబుల్ బిజినెస్ పెంచుకోవచ్చునని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
లేకపోతే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇంక్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ ప్రైమ్ సర్వీసెస్ అందించుకోవాల్సి ఉంటుంది. జీ సంస్థతో చర్చలపై రిలయన్స్ జియో ప్రతినిధి మాట్లాడుతూ ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, లావాదేవీల వరకు వెళతాయా? లేదా? చెప్పలేమన్నారు.
వదంతులపై స్పందించబోమని జీ న్యూస్ ప్రతినిధి పేర్కొన్నారు. అటు రిలయన్స్ జియో గానీ, ఎయిర్ టెల్ గానీ అధికారికంగా జీ న్యూస్ షేర్ల కొనుగోలుపై స్పందించలేదు.
భారీగా రుణాల ఊబిలో చిక్కుకున్న జీ గ్రూపు టీవీ చానెళ్లకు 173 దేశాల్లో 130 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. 78 చానెళ్లు, 4800 మూవీ టైటిళ్లతో ముందు వరుసలో ఉంది జీ గ్రూప్. దీని కొనుగోలు కోసం సోనీ గ్రూప్, కంకాస్ట్ సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి.
ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్బెర్గ్ క్వింట్ తాజాగా పేర్కొంది.త్వరలోనే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్ చేసింది.
కాగా ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో సుభాష్ చంద్రా నేతృత్వంలోని జీ అప్పుల్లో కూరుకుపోయింది. మరోపక్క నెట్ఫ్లిక్స్, అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో సంస్థను బలోపేతం చేసేందుకు వ్యహాత్మక భాగస్వామి కోసం వెతుకుతోంది.
ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్ ప్రతిపాదనలు వార్తల్లోకి వచ్చాయి. ప్రస్తుతం జీ ఛానళ్లకు 1.3 బిలియన్ల ప్రేక్షకులు ఉన్నారు. మొత్తం 178 దేశాల్లో 78 ఛానళ్లను నిర్వహిస్తోంది. 4,800 సినిమాలపై హక్కులు పొందింది. గతంలో సోనీ, కామ్కాస్ట్లు దీనిని కొనుగోలు చేయాలని భావించాయి. అయితే ఒప్పందం ఖరారయ్యే వరకు ఈ చర్చలు వెళ్లలేదు.