జెట్ సంక్షోభం: ఎతిహాద్ కుట్రేనంటూ పైలట్లు, ప్రధానికి ఫిర్యాదు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, జెట్ ఎయిర్వేస్ సంక్షోభం విషయంలో ఎతిహాద్ ఏదో కుట్ర చేసిందంటూ జెట్ పైలట్లు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, జెట్ ఎయిర్వేస్ సంక్షోభం విషయంలో ఎతిహాద్ ఏదో కుట్ర చేసిందంటూ జెట్ పైలట్లు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఎస్బీఐ కలిసి ఈ కుట్రకు తెరతీశాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటే ప్రధాని నరేంద్ర మోడీకి జెట్ పైలట్లు, ఉద్యోగులు కోరారు. జెట్ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్లో మరో 25శాతం వాటాను చేజిక్కుంచుకోవాలనుకుందని, అందుకే ఈ కుట్రలకు తెరతీశాయని ఆరోపించారు.
ఆ తర్వాత జెట్ కంపెనీని పూర్తిగా తమ గుప్పిట్లో తీసుకోవాలనేది ఆ కంపెనీ వ్యూహమన్నారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది.
అయితే, జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ. 1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినప్పటికీ ఎస్బీఐ ముందుకు రాలేదని.. ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే ఎలాంటి సాయం చేయలేదని వాపోయారు. ఈ క్రమంలోనే ఎతిహాద్ పాత్రపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.