Asianet News TeluguAsianet News Telugu

టెన్షన్లే కారణమా?: ఇన్‌స్టాగ్రామ్‌ ఫౌండర్స్‌ రాజీనామా

ప్రముఖ ఫొటో షేరింగ్‌ సర్వీస్‌ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సిస్ట్రోమ్‌, మైక్‌ క్రెగర్‌ తప్పుకుంటున్నారు. వారిద్దరి నుంచి ఇన్‌స్ట్రాగ్రాంను ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే

Instagram founders to leave Facebook amid reports of tension
Author
San Francisco, First Published Sep 26, 2018, 8:12 AM IST

ప్రముఖ ఫొటో షేరింగ్‌ సర్వీస్‌ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు కెవిన్‌ సిస్ట్రోమ్‌, మైక్‌ క్రెగర్‌ తప్పుకుంటున్నారు. వారిద్దరి నుంచి ఇన్‌స్ట్రాగ్రాంను ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు సిస్ట్రోమ్‌, క్రెగర్‌ రాజీనామా చేస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. సంస్థ సీఈఓగా కెవిన్ సిస్ట్రోమ్‌, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ క్రెగర్‌ ఉన్నారు.

కెవిన్ సిస్టోమ్, మైక్ క్రైగర్ తమ పదవుల నుంచి తప్పుకుంటున్న మాట నిజమైనా ఎందుకు రాజీనామా చేస్తున్నారో కారణం తెలియజేయలేదని సమాచారం. వారు కాస్త విరామం కోసమే తప్పుకుంటున్నట్లు మాత్రమే చెప్పారని ఆ వార్తాకథనం పేర్కొంది.

దీనిపై ఫేస్‌బుక్‌ను స్పందన కోరగా స్పందించలేదని వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రాం తమకు 100 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. అలాగే సరికొత్త లాంగ్‌ ఫామ్‌ వీడియో ఫీచర్‌ను విడుదల చేసింది.

ప్రముఖ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కోయుమ్‌ కూడా ఈ ఏడాది ఆరంభంలో రాజీనామా చేశారు. వాట్సాప్‌నూ ఫేస్‌బుక్‌ 19 బిలియన్‌ డాలర్లకు కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కోయుమ్‌ కూడా కొంత విరామం తీసుకునేందుకు రాజీనామా చేస్తున్నానని, తన ఆసక్తులు, హాబీలను కొనసాగించేందుకు సమయం కావాలని తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు. అమెరికా మీడియా మాత్రం కోయుమ్‌ రాజీనామాకు ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటా లీకేజీ వ్యవహారం ఓ కారణం కావచ్చునని  పేర్కొన్నాయి.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది. కొత్త కొత్త ఫీచర్లు రావడం, ఎక్కువ మంది సెలబ్రిటీలు దీన్ని వాడటం ఇన్‌స్టాగ్రామ్‌కు క్రేజీగా మారింది. ఎనిమిదేళ్ల కింద ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట సోషల్‌ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. అప్పుడే, దాని స్వయం ప్రతిపత్తికి ఏ ఢోకా ఉండదని వాగ్దానం చేసింది. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ పూర్తిగా తన స్వేచ్ఛ కోల్పోతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా ఆ కంపెనీలో నెలకొన్న పరిణామం కూడా ఇదే సూచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ సహ వ్యవస్థాపకులైన సీఈవో కెవిన్‌ సిస్ట్రోమ్‌, సీటీఓ మైక్‌ క్రెగర్‌ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ రాజీనామా చేయడం టెక్‌ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినందుకే, వీరు రాజీనామా చేశారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొడక్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ వైల్‌ కొన్ని రోజుల క్రితమే ఫేస్‌బుక్‌ కొత్త బ్లాక్‌ చైన్‌ టీమ్‌కు బదిలీ అయ్యారు. జుకర్‌బర్గ్‌ ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్‌కు పలుమార్లు విభేదాలు వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. 

‘కెవిన్‌, మైక్‌ అద్భుతమైన ప్రొడక్ట్‌ లీడర్లు. ఇన్‌స్టాగ్రామ్‌ వారి సృజనాత్మక ప్రతిభే. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. నేను వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా. తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాల్సి ఉంది’ అంటూ మార్గ్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులతో గొడవలు, విభేదాలు ఉన్నట్టు జుకర్‌బర్గ్‌ ఎక్కడా బయటపడలేదు. అదేవిధంగా సిస్ట్రోమ్‌ కూడా స్పందించారు. తమ ఉత్సుకతను, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ను 715 మిలియన్‌ డాలర్లతో ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios