Asianet News TeluguAsianet News Telugu

ఎస్: స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల సొమ్ము తగ్గిందోచ్! 20 ఏళ్లలో రికార్డు పతనం

నరేంద్ర మోదీ సర్కార్‌కు ముందు చూపు బాగానే ఉన్నట్లుంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ దేశంలోని బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వివరాలు క్రమంగా మన దేశానికి వచ్చేస్తున్నాయి. ఇక గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, వారి సంస్థల డిపాజిట్లు ఆరు శాతం తగ్గాయి. ఇది 20 ఏళ్లలో రికార్డు అని తెలుస్తోంది.

Indians' money in Swiss banks falls, hits second-lowest level in two decades
Author
New Delhi, First Published Jun 28, 2019, 11:09 AM IST

న్యూఢిల్లీ: నల్లధనం వెలికి తీయాలన్న నరేంద్రమోదీ ప్రభుత్వ సంకల్పం పని చేస్తున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా విరాజిల్లుతున్న స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపాదన తగ్గుతున్నట్లు కనిపించడమే దీనికి కారణం.

అక్రమార్కుల పంథా మారిందో.. లేక ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయో.. తెలియదుగానీ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో మనోళ్ల సొమ్ము మాత్రం గతేడాది రికార్డు స్థాయికి పడిపోయింది. భారతీయులు, భారతీయ సంస్థల నగదు నిల్వలు నిరుడు దాదాపు ఆరు శాతం దిగజారాయని గురువారం స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలు పేర్కొన్నాయి.

2018లో 954.71 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,757 కోట్లు)కు పరిమితం అయ్యాయి. భారత్ ఆధారిత శాఖల ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఉన్నా స్థూల సంపద క్షీణించడం విశేషం. గత రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఇది రెండో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

1995లో 723 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఉన్నట్లు తేలింది. మళ్లీ ఆ తర్వాత ఇదే కనిష్ఠం. 1987లో మాత్రం 675 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదైంది. ఇదే ఎప్పటికీ కనిష్ఠంగా ఉన్నది. నిజానికి 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లను తాకింది. అంతకుముందు వరుసగా మూడేండ్లు తగ్గుతూనే రాగా, 2017లో మాత్రం పెరుగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే మళ్లీ 2018లో తగ్గినట్లు తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. 

2006లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సంపద రూ.23,000 కోట్లుగా నమోదైంది. ఇదే అత్యంత గరిష్ఠ స్థాయి. ఆ తర్వాతి కాలంలో తగ్గుతూనే వస్తున్నది. 2011, 2013ల్లో మాత్రం పెరిగిన సంకేతాలు కనిపించాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం ఎగిసింది. మళ్లీ 2017లోనే 50 శాతం పెరిగింది. కాగా, నిరుడు సంపదలో 15 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల మేర వెల్త్ మేనేజర్ల దగ్గరే ఉన్నట్లు తెలుస్తున్నది.

బ్యాంకుల ద్వారా 104 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ డిపాజిట్లు జరిగాయి. 2018లో భారతీయుల డిపాజిట్లు 572 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. సెక్యూరిటీస్, ఇతర మార్గాల ద్వారా వచ్చే డిపాజిట్లు తగ్గాయని స్విస్ నేషనల్ బ్యాంక్ తెలిపింది.

బ్యాంకింగేతర, భారతీయ వ్యక్తిగత కస్టమర్ల డిపాజిట్లు 84.6 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2017లో 94.8 మిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. ఇక స్విస్ బ్యాంకుల్లోకి అన్ని దేశాల నుంచి వచ్చే సొమ్ము కూడా తగ్గుముఖం పట్టింది. 2018లో 1.4 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్ (సుమారు రూ.99 లక్షల కోట్లు)లుగానే ఉన్నది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశస్తుల సంపద నిరుడు 33 శాతం తగ్గగా, 744 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ.5,300 కోట్లు)గా ఉన్నది.

నల్లధనంపై పోరును ప్రారంభించిన మోదీ సర్కార్ స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సమాచార మార్పిడి ఒప్పందాన్ని చేసుకున్నది. ఇది గతేడాది జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే నల్లధనం కుబేరుల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం విడుతలవారీగా కేంద్రానికి అప్పజెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది భారతీయుల సంపద స్విస్ బ్యాంకుల్లో మరింతగా తగ్గవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios