స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తులపై షాకింగ్ న్యూస్...కానీ !
ఒకనాడు స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునే వారని ప్రతీతి. కానీ రెండేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.గతేడాది 6% తగ్గి రూ.6,625 కోట్లకు భారతీయుల సొమ్ము చేరుకున్నది. ఇది మూడు దశాబ్దాల్లో మూడో కనిష్ఠం అని స్విస్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
న్యూఢిల్లీ/జ్యూరిచ్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు వరుసగా రెండో ఏడాది కూడా తగ్గాయి. గతేడాది ఇవి దాదాపు ఆరు శాతం క్షీణించి రూ.6,625 కోట్లకు పరిమితం అయ్యాయి. గత మూడు దశాబ్దాల్లో ఇది మూడో కనిష్ఠ స్థాయి అని స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ (ఎస్సెన్బీ) వెల్లడించింది.
ఇవన్నీ స్విట్జర్లాండ్లోని వివిధ బ్యాంకుల నుంచి తమకు అందిన అధికారిక గణాంకాలని, నల్లధనాన్ని వీటిలో చేర్చలేదని ఎస్సెన్బీ తెలిపింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న ఆస్తులను నల్లధనంగా పరిగణించలేమని పదేపదే పేర్కొంటున్నది. గతేడాది చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయులు మొత్తం 899.46 మిలియన్ ఫ్రాంకులు కూడబెట్టారని ఎస్సెన్బీ తెలిపింది.
వీటిలో కస్టమర్ డిపాజిట్ల రూపేణా 550 మిలియన్ ఫ్రాంకులు (దాదాపు రూ.4 వేల కోట్లు), ఇతర బ్యాంకుల ద్వారా 88 మిలియన్ ఫ్రాంకులు (రూ.650 కోట్లు), ట్రస్టుల ద్వారా 7.4 మిలియన్ ఫ్రాంకులు (రూ.50 కోట్లు), సెక్యూరిటీలతోపాటు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల రూపంలో 254 మిలియన్ ఫ్రాంకులు (రూ.1,900 కోట్లు) వచ్చాయని వివరించింది.
ఇవన్నీ వివిధ బ్యాంకులు తమకు తెలియజేసిన అధికారిక గణాంకాలని, స్విట్జర్లాండ్లో భారతీయులు దాచిన నల్లధనం గురించి ఈ గణాంకాల్లో ప్రస్తావించలేదని ఎస్ఎన్బీ తెలిపింది. వేరే దేశాల్లోని సంస్థల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు, భారత సంస్థలు స్విస్ బ్యాంకుల్లో కూడబెట్టిన సొమ్ము వివరాలు కూడా ఈ గణాంకాల్లో లేవని ఎస్ఎన్బీ స్పష్టం చేసింది.
also read చైనా అత్యంత సంపన్నుడికి కరోనా సెగ...జాక్ మా స్ధానంలో పోనీ మా..
వ్యక్తులు, బ్యాంకులు, సంస్థలు సహా భారత కస్టమర్ల నుంచి స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన అన్ని రకాల నిధులను గమనంలోకి తీసుకొని ఈ గణాంకాలను రూపొందించినట్టు తెలిపింది. భారత్లోని స్విస్ బ్యాంకు శాఖల నుంచి వచ్చిన డిపాజిట్లు, నాన్-డిపాజిట్ల వివరాలు కూడా ఈ గణాంకాల్లో ఉన్నాయని పేర్కొన్నది.
గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు స్వల్పంగా 0.07 శాతం (దాదాపు రూ.646 కోట్లు) పెరిగినట్టు బీఐఎస్ (బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్) ఇటీవల వెల్లడించింది. ఈ గణాంకాలు మరింత విశ్వసనీయంగా ఉన్నాయని భారత్తోపాటు స్విస్ అధికారులు కూడా అంగీకరించారు.
స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ నాన్-బ్యాంక్ క్లయింట్లకున్న డిపాజిట్లు, రుణాలను గమనంలోకి తీసుకొని బీఐఎస్ ఈ గణాంకాలను రూపొందించింది. 2007 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా రూ.9 వేల కోట్లకుపైగా పెరిగాయని, కానీ 2017లో ఇవి 44 శాతం, 2018లో 11 శాతం తగ్గాయని బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేశాయి.
అయితే, భారతీయులు కూడబెట్టిన ఆస్తులను నల్లధనంగా పరిగణించలేమని, పన్నుల ఎగవేతపై భారత్ సాగిస్తున్న పోరాటానికి వారంతా మద్దతు తెలుపుతున్నారని స్విస్ అధికారులు పదేపదే చెప్తున్నారు. పన్ను వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఆటోమ్యాటిక్ మార్గం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం 2018 నుంచి స్విట్జర్లాండ్, భారత్ మధ్య కొనసాగుతున్నది.
స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగివున్న భారతీయుల వివరాలను ఈ మార్గం ద్వారా 2019 సెప్టెంబర్లో తొలిసారి భారత అధికారులకు అందజేసిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. ప్రతి ఏటా ఇదే పని చేయాల్సి ఉన్నది.