భారత్లోని కీలక రంగాలపై కరోనా వైరస్ ముప్పు...
భారత ఆర్థిక వ్యవస్థపై చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ భారీగానే ఉండనున్నది. ఈ విషయాన్ని ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ నివేదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.1 శాతానికి పరిమితమవుతుందని, 2021-22 కొద్దిగా కోలుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలే కాదు.. ఆర్థిక వ్యవస్థకు ప్రాణావాయువు వంటి రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే చాలా ముడిసరుకులకు చైనా కేంద్రం కావడం దీనికి కారణం.
చైనాలో చాలా పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో భారత్ తయారీ రంగంపై పెను ప్రభావం చూపనుంది. ఫలితంగా భారత ఎగుమతులు కూడా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. దీంతోపాటు వస్తువుల ధరలు పెరగడం.. కొరత ఏర్పడటం వంటి జరగవచ్చు.
భారత్పై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2020-21లో భారత్ వృద్ధిరేటు 5.1శాతంగా ఉండనుందని ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. అదే తిరిగి పుంజుకొంటే మాత్రమే 2021-22 నాటికి 5.6శాతానికి చేరుతుందని అంచనా వేస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తి దేశంలో వ్యాపారంపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్లు, పర్యాటక రంగం, పంపిణీ వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది.
also read కరోనా వైరస్ భయంతో ట్విట్టర్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు
ప్రపంచ వృద్ధిరేటుపై ఈ వైరస్ ప్రభావం 50 బేసిస్ పాయింట్లు ఉంటుందని వెల్లడించింది. ‘‘చాలా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధిరేటు మందగిస్తోంది. చైనాలో వృద్ధిరేటు నెమ్మదించిన ప్రభావం, భారీగా బ్యాకు రుణాల మొండి బాకీలు, గాలిబుడగల్లా పెరిగిన కార్పొరేట్ బ్యాలెన్స్షీట్లు పెట్టుబడులకు భారంగా మారతాయి’’ అని పేర్కొంది.
‘కరోనావైరస్: ముప్పు ముంగిట ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
మరోపక్క ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కూడా భారత వృద్ధిరేటు 2020లో 5.4శాతంగా ఉంటుందని పేర్కొంది. గతంలో 6.6శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ ప్రపంచ వృద్ధిరేటు కూడా 2.4శాతం ఉంటుందని చెప్పింది. యూబీఎస్ సంస్థ కూడా భారత వృద్ధిరేటు 20బేస్ పాయింట్ల మేరకు ప్రభావితం కావచ్చని పేర్కొంది.
2003లో సార్స్ వ్యాధి వ్యాపించినప్పటితో పోలిస్తే ఇప్పుడు చైనాపై ఆధారపడటం బాగా పెరిగింది. ప్రపంచ ఉత్పాదక రంగం, పర్యాటకం, వాణిజ్యం, కమోడిటీ మార్కెట్లలో చైనాదే కీలక పాత్ర. 2003లో సార్స్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఇది ఒక శాతం లోపే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కానీ 2020 నాటికి ప్రపంచ మార్కెట్లు చైనా మీద ఆధారపడటం పెరిగిపోయింది. ఉదాహరణకు భారత్నే తీసుకొంటే 2002-03లో చైనాతో వ్యాపారం కేవలం 4.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 2018-19 నాటికి 18 రెట్లు పెరిగి 87 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19.71శాతం అంటే దాదాపు ఐదోవంతు అన్న మాట. కనుక కరోనా వైరస్ ప్రభావం చైనా వృద్ధిరేటులో మార్పులు దీనిపై కచ్చితంగా చూపుతుంది. చైనా ప్రపంచంలోనే 13 శాతంతో అతిపెద్ద ఎగుమతిదారుగా.. 11 శాతంతో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచింది.
కరోనాతో చైనాలో దాదాపు 50 కోట్ల మంది దిగ్బంధంలో ఉన్నారు. చాలా కర్మాగారాలు మూతపడ్డాయి. ఈ సారి కూడా ప్రపంచ జీడీపీ 0.5శాతం ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. కానీ ఈ స్థాయి దాటి మరింత ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి.
భారత్ దిగుమతులు అత్యధికంగా చేసుకొనే దేశం. దేశీయ పరిశ్రమలు చాలా వరకు ముడి సరులకు చైనా నుంచి దిగుమతి చేసుకొంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతుల్లో 45శాతం చైనా నుంచే వస్తున్నాయి. మూడో వంతు యంత్ర పరికరాలు అక్కడి నుంచే భారత్కు చేరుకొంటున్నాయి.
భారత్ దిగుమతి చేసుకొనే ఆర్గానిక్ కెమికల్స్లో 40శాతం చైనా నుంచి వచ్చేవే. ఆటోమొబైల్ విడిభాగాలు, ఫర్టిలైజర్స్లో 25శాతం భారత్ డ్రాగన్ నుంచి కొనుగోలు చేస్తున్నాది.
భారత్ ఫార్మారంగంలో వాడే కీలకమైన ముడి పదార్థాల్లో 65-70శాతం చైనాలో తయారైనవే. మొబైల్ ఫోన్స్, విడిభాగాల్లో 90శాతం చైనాలో తయారయ్యేవే ఉంటున్నాయి. ఇవే కాకుండా పంపిణీ వ్యవస్థ దెబ్బతినడంతో భారత కంపెనీల ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గుతుంది. సీఎల్ఏఎస్ నివేదిక ప్రకారం ఫార్మా, కెమికల్స్, ఎలక్ట్రానిక్ రంగాలు ఈ ప్రభావంతో 10శాతం వరకు ధరలను పెంచవచ్చు. భారత్కు ఎలక్ట్రానిక్ పరికరాల అతిపెద్ద ఎగుమతి దారు చైనానే.
చైనాలో ముడిసరుకుల నుంచి తయారైన వస్తువులు వరకు భారీగా భారత్కు వస్తాయి. ముఖ్యంగా ముడిసరుకుల కొరత, ఉత్పత్తి తగ్గిపోవడం, ధరలు పెరగడం వంటి ప్రతికూలాంశాలను భారత ఎలక్ట్రానిక్స్ రంగం ఎదుర్కోవాల్సి ఉంది.
రసాయన పరిశ్రమలు మూతపడటం, షిప్మెంట్లపై ఆంక్షలవల్ల మరింత ప్రభావితం కానున్నాయి. చైనా నుంచి భారత్కు ‘ఇండిగో’ భారీగా సరఫరా అవుతుంది. ఇది డెనిమ్ పరిశ్రమకు చాలా అవసరం.
ఆటోమొబైల్ పరిశ్రమ భారీగా చైనాపై ఆధారపడింది. ఇప్పటి వరకు చైనా నుంచి వచ్చే పరికరాల సరఫరాలో పెద్దగా అడ్డంకులు ఏర్పడలేదు. కానీ, భవిష్యత్లో అక్కడ పరిశ్రమల మూసివేత కొనసాగితే మాత్రం 8-10శాతం వరకు విడిభాగాల కొరత ఎదుర్కోక తప్పదు.
చైనా నుంచి బల్క్డ్రగ్స్ను భారత్కు అత్యధికంగా దిగుమతి చేసుకొంటారు. వీటిని వినియోగించి ఔషధాలు తయారుచేసి భారత్ ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నది. ఇప్పుడు కరోనా కారణంగా ఈ పరిశ్రమ బాగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
also read అమెజాన్ ఉద్యోగికి కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు...
సోలార్పవర్ పరిశ్రమలో ముడిపదార్థాల కొరత తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోలార్ ప్యానల్స్, సెల్స్ అత్యధికంగా చైనా నుంచి వస్తున్నాయి. చైనా నుంచి పర్యాటకుల రాక తగ్గడం తూర్పు ఆసియా దేశాలపై ప్రభావం చూపిస్తోంది. భారత్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోనుంది.
చైనాలో కరోనా కారణంగా నూతన సంవత్సర సెలవును పొడిగిస్తే ఐటీ పరిశ్రమపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయా సంస్థల రెవ్యెన్యూ, వృద్ధిరేటు ప్రభావితం కానున్నాయి.
భారత్ అత్యధికంగా సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా మూడో స్థానంలో ఉంది. మన మొత్తం ఎగుమతుల్లో 5శాతానికి పైగా ఆ దేశానికి వెళతాయి. ముఖ్యంగా ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్, మత్స్య పరిశ్రమకు చెందిన ఉత్పత్తులు, కాటన్ తదితరాలు ఉన్నాయి.
దీంతోపాటు భారత్కు చెందిన చాలా కంపెనీలు చైనాలోని తూర్పు ప్రాంతాలో కర్మాగారాలను నెలకొల్పాయి. వీటిల్లో 72శాతం షాంఘై, బీజింగ్, గ్యాంగ్డాంగ్, జియాంజు, షాన్డాంగ్ వంటి నగరాల వద్ద ఉన్నాయి.
ఇప్పుడు వైరస్ ప్రభావం కారణంగా ఈ కంపెనీల ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తయారీ, ఐటీ, తయారీ రంగ సేవలు, బీపీవో, లాజిస్టిక్స్, కెమికల్స్, ఎయిర్లైన్స్, టూరిజం వంటివి ఉన్నాయి. చైనాలో టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడటంతో భారత్ నుంచి దుస్తులు, నూలు, ఇతర ముడి పదార్థాలకు డిమాండ్ తగ్గనుంది.