ప్రపంచంలోనే నెంబర్ వన్ టూవీలర్ మాన్యుఫాక్చరింగ్ సంస్థగా పేరొందిన హీరో మోటో కార్ప్ సంస్థపై ఐటీ శాఖ కన్నేసింది. అధిక లాభాలతో రాణిస్తున్న హీరో మోటాకార్ప్ యజమాని పవన్ ముంజాల్, సహా ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల ఇళ్లపై బుధవారం దాడులు జరిగాయి.
Hero Motocorp: దేశీయ టూవీలర్ దిగ్గజ సంస్థ హీరో మోటార్స్ సంస్థ ఐటీ శాఖ వలలో చిక్కుకుంది. హీరో మోటాకార్ప్ యజమాని పవన్ ముంజాల్ ఇంటిపై బుధవారం ఐటీ దాడులు జరిగాయి. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పవన్ ముంజాల్ ఇంటిపై తెల్లవారు జామునుంచి ఐటీశాఖ సోదాలు జరిపినట్లు సమాచారం అందుతోంది. గుర్గావ్లోని ఆయన నివాసం, కార్యాలయంలో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ముంజాల్ తన ఖాతాల్లో బోగస్ ఖర్చులు చూపించాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఐటీ బృందానికి వచ్చిన కొన్ని అనుమానాస్పద ఖర్చులు కూడా ఇన్హౌస్ కంపెనీల నుంచి వచ్చినవేనని చెబుతున్నారు. ప్రస్తుతం కూడా ఈ రెయిడ్ కొనసాగుతుందని భావిస్తున్నారు. పవన్ ముంజాల్ ఇల్లు, ఆఫీసుతో పాటు కంపెనీకి చెందిన మరికొందరు పెద్ద అధికారులకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి.
రెయిడ్ వార్తలతో ఒక్కసారిగా కలకలం
ఐటీ రెయిడ్స్ పై ఇప్పటి వరకూ హీరో మోటోకార్ప్ కానీ, ఐటీ శాఖ కానీ ఇంకా అధికారికంగా ఏమీ తెలపలేదు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే హీరో మోటోకార్ప్ షేర్లు కూడా పతనమయ్యాయి. దాడులు వెలుగులోకి రాకముందే హీరో మోటోకార్ప్ షేరు బిఎస్ఇలో లాభాలతో ట్రేడవుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే, హీరో మోటోకార్ప్ స్టాక్ 2 శాతం వరకు పడిపోయింది.
దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో హీరో ఆధిపత్యం చెలాయిస్తోంది
హీరో మోటాకార్ప్ ప్రపంచ అతిపెద్ద టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్ గా పేరొందింది. ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ఎక్కువ వాహనాలను అమ్మిన కంపెనీ టైటిల్ ను హీరో 20సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం పవన్ ముంజాల్ హీరో మోటోకార్ప్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే సంస్థ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని 40 దేశాలలో వ్యాపారం చేస్తోంది. Hero MotoCorp గ్లోబల్ బెంచ్మార్క్లతో 8 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. వీటిలో 6 భారతదేశంలో ఉండగా, మిగితా రెండూ కొలంబియా, బంగ్లాదేశ్లు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. భారతదేశంలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో హీరో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశీయ మోటార్సైకిల్ మార్కెట్లో ఈ కంపెనీకి 50 శాతానికి పైగా వాటా ఉంది.
ఇదిలా ఉంటే..ఇటీవల ఐటీ శాఖ ఢిల్లీ NCR, చండీగఢ్, లూథియానా, లక్నో, ఇండోర్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 45 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ సమాచారం ఆధారంగానే సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.