ముకేశ్ అంబానీ రహస్య ఆస్తులు?.. కూపీ లాగుతున్న ఐటీ
ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్నఐటీ శాఖ ఆరా తీయడంతోపాటు ఇతర అంశాలను పోలీసులు చక్కబెడుతున్నారు.
న్యూఢిల్లీ: మనదేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆదాయం పన్నుశాఖ అధికారులు కనుగొన్నట్టు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లోని తమ ఆస్తుల వివరాలను వెల్లడించలేదని నోటీసు కూడా పంపింది. ఉక్రెయిన్లో ఇటీవల ఐటీ అధికారులు ఏడు దేశాల ప్రతినిధులతో మాట్లాడగా, ఈ సమాచారం దొరికింది. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ (డీటీఏఏలు), మనీలాండరింగ్, ఫైనాన్సింగ్ టెర్రరిజం ఒప్పందాల ప్రకారం స్విట్జర్లాండ్, సెయింట్ లూసియా, మారిషస్, లగ్జెంబర్గ్, అమెరికా, బ్రిటన్, బెల్జియం నుంచి తన పౌరుల ఆస్తుల సమాచారాన్ని భారత్ పొందవచ్చు.
ఇలాంటి విషయాల్లో ఇండియా సమాచారం కోరితే, ఇవి 90 రోజుల్లోపు స్పందిస్తాయి. ఇటీవల కుదుర్చుకున్న ఆటోమేటిక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) ఒప్పందంలో భాగమైన కామన్ రిపోర్టింగ్ సిస్టమ్ ప్రకారం ఇవి ఇండియాకు వివరాలను పంపుతాయి. అంబానీల విదేశీ ఆస్తుల సమాచారం కోసం ఇండియా ఆఫీసర్లు త్వరలోనే లెటర్ రెగోటరీ (ఎల్ఆర్)ని సంబంధిత దేశాలకు పంపనున్నారు.
కేమన్ ఐలాండ్స్ నుంచి పనిచేసే ఇన్ఫ్రా కంపెనీ గురించి వీళ్లు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇదే విషయమై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే ప్రభుత్వం నుంచి తమకు లెటర్ ఏదీ అందలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. విదేశీ బ్యాంకుల్లో 1,195 ఇండియన్ అకౌంట్లు ఉన్నాయని 2015లో బయటపడ్డ స్విస్లీక్ డాక్యుమెంట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
వీటిలోని14 హోల్డింగులకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్తో సంబంధం ఉంది. ఈ హోల్డింగులు 628 మంది ఇండియన్ల పేరిట ఉన్నాయి. ఈ లిస్టులో అంబానీలూ ఉన్నారు. వీళ్లందరికీ హెచ్ఎస్బీసీ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నట్టు ఇండియాకు సమాచారం అందింది. ఈ ఖాతాల్లో రూ.25 వేల కోట్ల ఉన్నట్లు 2006-07 గణాంకాలు చెబుతున్నాయి. అయితే అంబానీల ఖాతాలకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు చాలా టైం పడుతుందని ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు హోల్డింగ్స్ సమాచారం తెలియజేయాలని అడిగారు. ఈ నోటీసుల్లో ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్ ఆఫ్ 2015 ప్రకారం అంబానీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.