కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరి సాధారణ సంస్థల్లో పరిస్థితిలు ఇలా ఉంటే.. దిగ్గజ టెక్ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి. ప్రపంచ దేశాలకు చెందిన టాప్-10 టెక్ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలకు 2020-2021 మధ్య కాలంలో భారీగా బోనస్లు అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థల్లో సీఈవోలుగా పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా బోనస్లు పెంచాయి. కానీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు గూగుల్ సంస్థ 14 శాతం బోనస్ను తగ్గించిందని ఫైన్బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తన కథనాన్ని ప్రచురించింది.
భారీగా బోనస్లు పెరిగిన సీఈవోల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్కామ్ సీఈవో తాన్ హాక్ ఎంగ్ ఉన్నారు. ఆయన అత్యధికంగా ఏకంగా 1586శాతం బోనస్ పొందాడు. ఇది 3.6 అమెరికన్ మిలియన్ డాలర్ల నుంచి 60.7మిలియన్ డాలర్లుగా ఉంది. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈవో పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, అమెజాన్ సీఈవో ఆండీ జెస్పీ ఉన్నారు.
ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్లు పొందిన సీఈవోల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందారు. ప్యాండమిక్లో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున లాభాల్లో గడించాయి. దీంతో సంస్థలు సైతం అందుకు కారణమైన సీఈవోలకు కళ్లు చెదిరేలా బోనస్లు అందించినట్లు ఫైన్బోల్డ్ తన నివేదికలో హైలెట్ చేసింది.
ఇంటెల్ సీఈవో పాట గ్లెసింగెర్ 713.64శాతంతో 22 మిలియన్ల నుంచి 179 మిలియన్ డారల్లను పొందారు. అదే సమయంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్తో 35.8 మిలియన్ల నుంచి 211.9మిలియన్లు, అమెజాన్ సీఈవో అండీ జాస్సీ 491.9 శాతంతో 35.8 మిలియన్ల నుంచి 211.9 మిలియన్లను సొంతం చేసుకొని.. అత్యధికంగా బోనస్లు పొందిన టాప్-5 టెక్ కంపెనీల సీఈవోల జాబితాలో ఒకరిగా నిలిచారు.
సుందర్ పిచాయ్కు షాక్
మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్ను, సిస్కో సీఈవో చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతంతో 43.2 మిలియన్ డాలర్ల నుంచి 34.7 మిలియన్ డాలర్లు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు 14శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం (సంవత్సరం) రూ.14 కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1707కోట్లు అందించినట్లు ఫైన్బోల్డ్ నివేదిక తెలిపింది.