Asianet News TeluguAsianet News Telugu

ప్లీజ్! పసిడిపై దిగుమతి సుంకం తగ్గించండి!!

జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం ఇంకా తొలిగిపోనందున పసిడి దిగుమతి సుంకాన్ని నాలుగు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ కోరింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల విడి భాగాల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం అభ్యర్థించింది. 

Gems & jewellery sector seeks cut in gold import duty to 4%
Author
Mumbai, First Published Jan 30, 2019, 9:17 AM IST

ఇంకా నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలను ఎదుర్కొంటున్నందున బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గోల్డ్ అండ్ జ్యువెల్లరీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కట్, పాలిష్డ్‌ వజ్రాలు, కట్, పాలిష్డ్‌ రత్నాలపై పన్నును ప్రస్తుత 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ కోరింది. అదనంగా రుణ నిబంధనలను సరళతరం చేయాలని ఈ పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. 

ఆర్థిక మంత్రికి అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ లేఖ ఇలా
శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ లేఖ రూపంలో తెలియజేశారు. 

అధిక సుంకాలతో దొంగ రవాణ పెరిగే చాన్స్
‘కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అధికంగా ఉన్నప్పుడు దానికి కళ్లెం వేయడానికి ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకం 10 శాతానికి పెంచింది. నాటి నుంచి వాణిజ్య లోటు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోకి వచ్చింది. అయితే, బంగారంపై అధిక దిగుమతి సుంకాలతో ఈ లోహం దొంగ రవాణా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో సంబంధిత లక్ష్యాలు నెరవేరవు’అని పద్మనాభన్‌ పేర్కొన్నారు.

పాన్ నంబర్ తప్పనిసరన్న నిబంధన సడలించాలి
బంగారు ఆభరణాల కొనుగోళ్ల సమయంలో విలువ రూ.2 లక్షలు, అంతకుమించి ఉంటే పాన్‌ నంబర్‌ సమర్పించాలన్న నిబంధనను సడలించాలి. రూ.5 లక్షలకు పెంచాలని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ కోరింది.

దేశంలో 50% మందికి పాన్‌ లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రత్యేకంగా గుర్తించిన జోన్ల ద్వారా ముడి వజ్రాల విక్రయానికి విదేశీ మైనింగ్‌ కంపెనీలు ఆదాయం పన్ను నిబంధనల్లో మార్పులు చేయాలని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ అభ్యర్థించింది. 

రాయితీలు కల్పించాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ కౌన్సిల్ డిమాండ్
ఇన్‌పుట్‌ సేవలపై 0.25 జీఎస్టీ ఉండాలని, మూలధన అవసరాల కోసం రుణాలను సులభంగా పొందేందుకు నిబంధనలు సడలించాలని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ తెలిపింది. రత్నాభరణాల ఎగుమతులకు తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టి, కమోడిటీ ట్రేడింగ్‌ ట్యాక్స్‌ ఎత్తివేయాలని అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్‌ కోరింది. 

ఎలక్ట్రానిక్స్‌ విడి భాగాల దిగుమతిపై సుంకాలు తగ్గించాలి 
దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతోపాటు, వీటికి సంబంధించిన విడిభాగాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కోరింది.

టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు వంటి పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలని, వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల వీటి దిగుమతులపై సుంకాలు విడిభాగాల కంటే తక్కుగా ఉంటున్నాయని సీఈఏఎంఏ తెలిపింది. 

దేశీయంగా కంప్రెషర్లు, డిస్ ప్లే ప్యానళ్ల తయారీకి ప్రోత్సాహమివ్వాలి
కంప్రెషర్లు, ఓపెన్‌ సెల్, డిస్‌ప్లే ప్యానెళ్లపై ప్రస్తుత 10% సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది.

ధరల పరంగా స్థానిక కంపెనీలు పోటీ పడగలుగుతాయి. ఓపెన్‌ సెల్స్, డిస్‌ప్లే ప్యా నెళ్లు, కంప్రెషర్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం వల్ల, అధిక సుంకాల కారణంగా దేశీయ పరిశ్రమలో రెండేళ్లుగా వృద్ధి ఉండటం లేదని సీఈఏఎంఏ తెలిపింది. 

విడి భాగాల ఉత్పత్తికి సబ్సిడీలతో దేశీయంగా ఉత్పత్తి పెరుగుదల
దేశీయంగా తయారయ్యే విడిభాగాలు, ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల స్థానికంగా తయారీ పెరుగుతుందని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) పేర్కొంది.  

భారీగా దిగుమతి అవుతున్న సెక్యూరిటీ, నిఘా కెమెరాల విషయమై దృష్టి సారించి, వీటిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచాలని, దిగుమతులను నిరుత్సాహపరిచి, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఇది అవసరం అని సీఈఏఎంఎ స్పష్టం చేసింది. 

ఎగుమతుల పెంపునకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం: ఎఫ్‌ఐఈవో  
నత్తనడకన ఉన్న దేశీయ ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వపరంగా బడ్జెట్‌లో ప్రోత్సాహం అవసరమని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది.

గత 2–3 నెలల్లో ఎగుమతుల వృద్ధి  నామమాత్రమేనని, ఇది ఆందోళనకరమని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేశ్‌ కుమార్‌ అన్నారు. మధ్యంతర బడ్జెట్ అయినా ఎగుమతులకు ప్రోత్సాహాలు కావాలి.

‘రానున్నది మధ్యంతర బడ్జెటే అయినా కొన్ని ప్రోత్సాహకాలు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి, పరిశోధన, అభివృద్ధికి ఇవ్వాల్సి ఉంది. ఇది ఎగుమతులను పెంచడంతోపాటు తయారీ, ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది’అని  ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

2018 నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి 0.8 శాతం, డిసెంబర్‌లో 0.34 శాతంగా ఉంటే, గడచిన ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 10.18 శాతం పెరుగుదలతో 245 బిలియన్‌ డాలర్ల మేర ఉండటం గమనార్హం. 

పెట్రోల్, విద్యుత్ పన్నులను రాష్ట్రాలకివ్వాలిపెట్రోలియం, విద్యుత్‌పై పన్నుతోపాటు రాష్ట్రాల పన్నులను తిరిగి ఇచ్చేయాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేశ్‌ కుమార్‌ కోరారు. ఉద్యోగాలను కల్పించే యూనిట్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని. ఎగుమతి ప్రోత్సాహక నిధి ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios