గోద్రేజ్ సిగలో ‘ఐకానిక్’ఆర్కే స్టూడియోస్
ఒకనాటి రాజ్ కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన మరణం తర్వాత చేతులు మారుతోంది. రెండేళ్ల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన ఆర్కే స్టూడియోస్ మరమ్మతులు అసాధ్యమని నిర్ధారణకు వచ్చాక విక్రయించాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో పలు సంస్థలు పోటీ పడ్డా గోద్రేజ్ ప్రాపర్టీస్ దక్కించుకున్నది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్కపూర్ స్వయంగా నిర్మించిన ఐకానిక్ ఆర్కే స్టూడియోస్ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ స్టూడియోస్ హస్తగతానికి చాలా సంస్థలు పోటీపడినా చివరకు.. గోద్రెజ్ సంస్థ గతేడాది అక్టోబర్లోనే రూ.190 కోట్లకు చేజిక్కించుకుంది.
అయితే శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. ఆర్కే స్టూడియోస్ను తమ ఆస్తుల్లో భాగం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ గోద్రేజ్ తెలిపింది. దీనిపై గోద్రేజ్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్షా గోద్రేజ్ వ్యాఖ్యానిస్తూ.. ‘చెంబూరు మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది.
మా వ్యూహాలకు ఈ స్థలం సరిగ్గా సరిపోతుంది. ఆర్కే స్టూడియోస్ ఎంతో ప్రాచుర్యం చెందింది. దీనికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటాం’ అని స్పష్టం చేశారు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
మరమ్మతులు చేయించాలనుకున్నా దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియోస్ యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. స్టూడియోస్ను ముంబయిలోని చెంబూరులో 2.2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
కాగా సుమారు 70 సంవత్సరాల క్రితం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 2.2 ఎకరాల్లో ఆర్కే స్టూడియోస్ను బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కపూర్ నిర్మించారు. 1948లో ఆవిర్భవించిన ఆర్కే స్టూడియోస్ తర్వాత 1950లో విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు.
ఆర్కే స్టూడియో బ్యానర్ పై 1970, 80 దశకాల్లో పలు చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆర్కు ఫిలింస్ బ్యానర్లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మితమయ్యాయి.
రాజ్ కపూర్ మరణించిన తరువాత ఈ స్టూడియోస్ను ఆయన కుటుంబం దీని బాగోగులు చూస్తూ వచ్చింది. దీనిని అమ్మేయాలని రిషి కపూర్ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లుగా డెవలప్ చేయాలని గోద్రేజ్ ప్రాపర్టీస్ యోచిస్తున్నట్లు సమాచారం.