Asianet News TeluguAsianet News Telugu

పెను సవాళ్లివి: వాటినిలా ఎదుర్కొందాం: సిబ్బందికి లేఖలో టాటా చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌


జాతీయంగా, అంతర్జాతీయంగా పలు పేరెన్నికగన్న సంస్థల సమ్మేళనం టాటా సన్స్. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు.. ఆ పై పారిశ్రామికంగా నెలకొన్న సూక్ష్మ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు క్రుసి చేయాలని ఆ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 7 లక్షల మంది ఉద్యోగులకు తన న్యూఇయర్‌ సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు టాటా సన్స్ సంస్థను పునర్వ్యవస్థీకరించి.. పూర్తిగా సరళతరం చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. 

Focus on what you can control: Chandrasekaran to Tata workers amid hurdles
Author
New Delhi, First Published Dec 28, 2018, 11:09 AM IST

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. 

డిజిటల్‌ టెక్నాలజీపై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దిశా నిర్దేశం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచిందని చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందన్నారు. 100 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించనున్నట్లు తెలిపారు.  

‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది.  ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘మన పరుగును కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’అని సూచించారు.  

టాటా కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలక ఆస్తుల కొనుగోలు, భవిష్యత్ వృద్ధికి రూ.70 వేల కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు ఆ సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు.  పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం.  

దేశంలో ఎలక్ట్రికల్‌ వాహనాల ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి టాటా మోటార్స్‌ పనిచేస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ చెప్పారు. ‘టాటా క్యాపిటల్‌ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్‌ నుంచి చార్జింగ్‌ వసతుల నెట్‌వర్క్‌ విషయమై టాటా మోటార్స్‌ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios