Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఏడాది పాలన:రూ.27 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల వెల్త్ హాంఫట్

 కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారంతో ఏడాది పూర్తయింది. మిగతా రంగాల్లో మోదీ సర్కార్ పని తీరు ఎలా ఉన్నా, ఆర్థిక రంగం విషయంలో మాత్రం అధ్వాన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దానికి దేశీయ స్టాక్ మార్కెట్ అద్దం పడుతోంది.

First anniversary of Modi 2.0: Investors lose Rs 27L cr in equity wealth, ask is it worth investing
Author
New Delhi, First Published May 31, 2020, 10:50 AM IST

న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారంతో ఏడాది పూర్తయింది. మిగతా రంగాల్లో మోదీ సర్కార్ పని తీరు ఎలా ఉన్నా, ఆర్థిక రంగం విషయంలో మాత్రం అధ్వాన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దానికి దేశీయ స్టాక్ మార్కెట్ అద్దం పడుతోంది.

గత ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్‌లో మదుపర్లు ఏకంగా రూ.27 లక్షల కోట్ల సంపదను కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. హరించుకుపోయిన సొమ్ము దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 13.5 శాతానికి సమానం. 
అంతేకాదు కరోనా విశ్వమారి కల్పించిన సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజితో పోలిస్తే ఈ మొత్తం విలువ 35 శాతం ఎక్కువ. ఇదే ఏడాదిలో ప్రతి పది స్టాక్స్‌లో 9 స్టాక్‌లు నెగెటివ్ రిటర్న్‌లు ఇచ్చాయి.

ఇదే సమయంలో బిఎస్‌ఇలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10 శాతం కంపెనీల షేర్లు మాత్రమే రెండంకెల ఆదాయాలను అందుకున్నాయి. మరో వైపు కరోనా విశ్వమారి ప్రబలడానికి ముందే జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నది.

ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నాలుగో త్రైమాసికంలో జీడీపీ మరింతగా దిగజారి 3.1శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంమీద జిడిపి వృద్ధి 11 ఏళ్ల కనిష్టస్థాయి అంటే 4.2 శాతానికి చేరుకుంది.

ఇక పారిశ్రామిక ఉత్పత్తి సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఇక ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా తగ్గిపోయిన తరుణంలో పెట్టుబడి పెట్టడానికి ఏదయినా సరయిన రంగం ఉందా అనే సందేహాలు ఇన్వస్టర్ల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గత మూడు నెలల్లో పరిణామాలు ఎవరూ ఊహించనివని, నిజంగా చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థకు దాని పరిమితులు దానికున్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్ విభాగం హెడ్ ఉమేశ్ షా అన్నారు. 
నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు మందగించడానికి జీఎస్టీ అమలు ప్రభావమే కారణమని శామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్ విభాగం హెడ్ ఉమేశ్ షా అభిప్రాయ పడ్డారు. అంతేకాదు, ఈ పరిస్థితిని సరి చేసుకునే వాతావరణం భారత మార్కెట్‌లో ఉందని గత వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మార్కెట్ పతనాలు చెబుతున్నాయి.

కేవలం 10 శాతం స్టాక్స్ మాత్రమే లాభాలు అందిస్తున్నప్పుడు మిగతా 90 శాతం మార్కెట్ మాటేమిటనేది మదుపరుల ప్రశ్న. అయితే 2019-20 సంవత్సరం మదుపరుల పాలిట ‘ వాషౌట్ సంవత్సరం’గా నిలిచిపోయిందని  ఆర్థిక, మార్కెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు.

అయితే ఇప్పుడు ఉన్న ధరల్లో స్టాక్స్ కొనుగోలు చేసిన పక్షంలో మరో మూడేళ్ల తర్వాత మంచి  లాభాలు ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం బిఎస్‌ఇలోని అన్ని స్టాక్స్ విలువ గత ఏడాది మే 30న రూ.154.44 లక్షల కోట్లు ఉంటే ఈ రోజు (శనివారం) నాటికి రూ.127.06 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలో ఈ స్టాక్స్ విలువ 17.7 శాతం పడిపోయింది.

కాగా మోదీ ఏడాది పాలనకు పది మార్కులకు ఏడు మార్కులు ఇచ్చిన హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కు చెందిన దీపక్ జైసని మాట్లాడుతూ,‘ ప్రభుత్వం పనితీరుకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రామాణికం కాదు. ప్రభుత్వం పని తీరు కేవలం ప్రభుత్వ విధానంపైనే ఆధారపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటుగా ఇతర అనేక అంశాలపై మార్కెట్లను ప్రభావితం చేస్తాయి’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios