దొడ్డిదారి నిర్ణయం: ముడి చమురు ధర తగ్గింపు.. సుంకంతో ఖజానాకు మళ్లింపు!
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. దేశీయంగా ప్రజలకు పెట్రోల్, ఉపశమనం కలిగే సంకేతాలు కనిపించడం లేదు. డీజిల్పై లీటరుకు రూ. 3 ఎక్సైజ్ సుంకం పెంచి.. సదరు తగ్గింపుతో వచ్చే ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకుని తన మార్క్ చూపింది కేంద్రం.
పెట్రోల్, డీజిల్పై కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున పెంచుతూ శనివారం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో కేంద్ర ఖజానాకు రూ.39,000 కోట్ల వార్షికాదాయం సమకూరే అవకాశం ఉన్నది.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గి సామాన్యులకు ఊరట లభించాలి. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండకపోవచ్చు.
Aslo Read:యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: పెట్టుబడుల వరద
దీనికి కారణం.. సర్దుబాటు పేరుతో తగ్గిన చమురు ధరలకు ఎక్సైజ్ సుంకం పెంపు పేరిట ప్రభుత్వం మరికొంత మొత్తాన్ని వసూలు చేయడమే. కాగా ఎక్సైజ్ సుంకం పెంపు పేరిట తగ్గిన చమురు ధరల ఫలితాన్ని సామాన్య ప్రజలకు అందకుండా ప్రభుత్వం తన ఖజానాకు మళ్లిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న తాజా ఎక్సైజ్ సుంకం పెంపుదల నిర్ణయంతో రిటైల్లో లభించే పెట్రోల్, డీజిల్ ధరలపై అంతగా ప్రభావం ఉండకపోయినా, సామాన్యులకు మరింత తక్కువ ధరకు లభించాల్సిన పెట్రోల్, డీజిల్ ఆ విధంగా లభించే అవకాశం లేదని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నోటిఫికేషన్ ప్రకారం.. లీటర్ పెట్రోల్పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 నుంచి రూ.8కి, డీజిల్పై రూ.4కు పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్పై రోడ్డు సెస్ లీటరుకు రూ.1 పెంచారు. దీంతో ఈ సెస్సు రూ.10కి చేరింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.22.98కు, డీజిల్పై రూ.18.83కు ఎగబాకింది.
Also Read:అమెరికాకు అలీబాబా వ్యవస్థాపకుడి భారీ విరాళం....
అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో నవంబర్ 2014, జనవరి 2016 మధ్య బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. ఈ 15 నెలల్లో లీటర్ పెట్రోల్పై రూ. 11.77, లీటరు డీజిల్పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.
దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2.42 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్ మండిపడింది. సుంకం పెంపు పేరుతో సర్కారు సామాన్యులను లూటీ చేస్తున్నదని ఆరోపించింది.