చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. 

చిత్రా రామకృష్ణ. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘విమన్‌ ఆఫ్ ది ఇయర్‌’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గ‌తం. ఇప్పుడామె అరెస్ట్ అయ్యారు. ట్రేడింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆమె.. ఇప్పుడిలా దోషిలా నిల‌బ‌డ‌టానికి కార‌ణం.. ఓ హిమాల‌య యోగి. ఆమె జీవితాన్ని మ‌లుపు తిప్పిన‌ ఓ 'అదృశ్య' స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 

చిత్రా రామకృష్ణ కెరీర్

చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్రా రామకృష్ణ ఒకరు. 2009లో చిత్రా.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు. 

చిత్రా రామకృష్ణ పతనం

20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్రా.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది. ఇక‌.. చిత్రా రామకృష్ణ హయాంలో NSE చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించడం.. కొంత‌కాలానికే ఆయ‌న‌ను గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం అనుమానాస్ప‌దంగా మారింది. గ‌తంలో సెబీ ద‌ర్యాప్తులో సంచ‌న‌ల విష‌యాలు వెలుగుచూశాయి. చిత్ర గత 20 ఏళ్లుగా ఓ ‘అదృశ్య’ యోగి ప్రభావానికి లోనైనట్టు తెలిసింది. హిమాలయాల్లో ఉండే ఆ యోగితో ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకుని ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు సెబీ అధికారులు గుర్తించారు. 

ఆ యోగి చెప్పార‌నే.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌ను ఎన్ఎస్ఈలో ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అంత‌కుముందు ఆనంద్‌ జీతం 15లక్షలు ఉండ‌గా.. ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 1.38 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ ఇయ‌ర్‌కే అతడి శాల‌రీ 20శాతం పెంచేశారు. వారానికి 3 రోజులు మాత్రమే వ‌ర్కింగ్ డేస్‌గా వెసులుబాటు కూడా క‌ల్పించారు. ఇదంతా ఆ హిమాల‌య‌ యోగి చెప్పినందుకే చిత్రా రామ‌కృష్ణ‌.. ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు అలాంటి బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇచ్చార‌ని సెబీ దర్యాప్తులో తేలింది.   

ఇంత‌కీ ఆ హిమాల‌య యోగి ఎవ‌రు? ఆయ‌న‌తో చిత్రాకు ఎలాంటి సంబంధం ఉంద‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రం. ఆ యోగి ఓ నిరాకారుడని, సిద్ధ పురుషుడు, శిరోణ్మని అని చిత్రా గ‌తంలో చెప్పారు. తన వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఆయన నుంచి ఏళ్లుగా స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని, ఆయన ఎలా కావాలంటే అలా మారుతార‌ని.. ఆయ‌న హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉంటార‌ని.. చిత్రా సెబీ విచార‌ణ‌లో తెలిపారు. 

అయితే, సెబీ దర్యాప్తులో ఆ అదృశ్య యోగి.. మనిషేనని తేలింది. ఆ యోగికి, చిత్రాకు, ఆనంద్‌ సుబ్రమణియన్‌కు ఎలాంటి లింక్ ఉంద‌ని ఆరా తీశారు. ఇక‌, ఆ యోగితో చిత్రా ఈ-మెయిల్ సంభాష‌ణ‌లు కూడా జ‌రిపార‌ని సెబీ ద‌ర్యాప్తులో తేలింది. వారిద్ద‌రి మ‌ధ్య న‌డిచిన మెయిల్స్‌లో ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన ఆ యోగి.. ఆమె శిరోజాలపై ఆసక్తి చూపారు. జడను వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెకు కొన్ని పాటలు షేర్ చేశారు. ఇద్దరూ కలిసి సీషెల్స్‌కు వెళ్లారనీ తెలుస్తోంది. 

2015 ఫిబ్రవరి 18న చిత్రారామకృష్ణకు ఆ వ్యక్తి పంపిన ఇ-మెయిల్‌లో 'ఇవాళ నీవు చాలా బాగున్నావు. నీ శిరోజాలుగా వివిధ రకాలుగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా, దీన్ని నువ్వు స్వీకరిస్తావని తెలుసు' అని ఉంది. అంతకు ముందు రోజు ఇమెయిల్‌లో 'నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. మనం వెళ్లేదారిలో హాంకాంగ్‌ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు'.. అంటూ ఆ మెయిల్‌లో రాసుంది. 

ఇలా చిత్ర రామ‌కృష్ణ ఈ-మెయిల్స్ ప‌రిశీలించిన సెబీ ద‌ర్యాప్తు బృందం.. ఆమె చెబుతున్న‌ట్టు అత‌ను అదృశ్య యోగినో.. హిమాల‌య యోగినో కాక‌పోవ‌చ్చ‌ని.. ఓ అదృశ్య వ్య‌క్తి అయి ఉంటార‌ని అంటోంది. ఇక‌, ఆ వ్య‌క్తికి ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఆయ‌నే ఈయ‌నా? చిత్ర ఆ వ్య‌క్తి బుట్ట‌లో ప‌డిందా?  చిత్ర‌నే ఇలా అదృశ్య డ్రామా ప్లే చేస్తోందా? అనే కోణంలోనూ సెబీ విచారించింది. 

చిత్రా రామ‌కృష్ణ అరెస్ట్‌

అయితే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఆమె అరెస్ట్ దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తున్న స‌మ‌యంలో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శ‌నివారం (మార్చి 5, 2022) కొట్టి వేసింది. ముందస్తు అరెస్ట్‌పై ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జీ సంజీవ్‌ అగర్వాల్‌ తిరస్కరించారు. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. తాజాగా కోలొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.