నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె అరెస్ట్ దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె అరెస్ట్ దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెను కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ పలుమార్లు విచారించింది. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. తాజాగా చిత్రా రామకృష్ణ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. ముందస్తు అరెస్ట్‌పై ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జీ సంజీవ్‌ అగర్వాల్‌ తిరస్కరించారు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం లాంఛనప్రాయమే అయింది.

చిత్రా రామకృష్ణన్ తన హయాంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేయడం, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డును సైతం తప్పుదారి పట్టించేలా వ్యవహరించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె ఓ యోగి సూచనలు, సలహాలను పాటించారని చెబుతున్నారు. ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు వచ్చే సమాచారాన్ని, వాటికి సంబంధించిన డేటాను ఆ హిమాలయాల యోగి ఇచ్చిన సూచనల మేరకు ఎంపిక చేసిన వారికి లీక్ చేశారని సీబీఐ అధికారులు గుర్తించారు.

చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సందర్భంగా ఆమె ఇచ్చిన సమాచారాన్ని అధికారులు రికార్డ్ చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తోన్నారు. ఇదివరకు ఎన్ఎస్ఈ మరో మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవి నరేన్‌, ఆనంద్ సుబ్రమణిన్‌ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వారిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదే కేసులో ఓపీజీ సెక్యూరిటీస్ ప్రమోటర్స్ సంజయ్ గుప్తా సహా పలువురిపై సీబీఐ అధికారులు కేసు సైతం నమోదు చేశారు. ఈ కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పాలుపంచుకున్నారు. రామకృష్ణ, సుబ్రమణియన్ నివాసాల్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే సీబీఐ అధికారులు చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పుడు తాజాగా ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేయడంతో అరెస్టు కావడం ఖాయమైంది.

చిత్ర రామకృష్ణ ఎవరు..?
చార్టెడ్ అకౌంటెంట్‌గా జీవితం ప్రారంభించిన చిత్రా రామకృష్ణ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్‌లో చేరారు. చిత్ర రామకృష్ణ కాలక్రమేణా ఒక్కో మెట్టు ఎక్కుతూ 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా నియామకం కావడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎన్ఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఈఓ) పదివి చేపట్టి 2016 వరకు కొనసాగారు.