డజన్ల కొద్ది కంపెనీలు... వేల కోట్ల పెట్టుబడులు...ఇది రాణా కపూర్ స్టైల్...
రాణా కపూర్ కూతుళ్ల డొల్ల కంపెనీలు, రూ.2000 కోట్ల పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఇతర సంస్థలకు రుణాలిచ్చినందుకు రాణా కపూర్ కూతుళ్ల సంస్థలకు లబ్ది చేకూర్చారన్న అభియోగాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ/ముంబై: రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట గల 12 షెల్ కంపెనీలు, రూ.2000 కోట్ల పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగిస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ వంటి కొన్ని కంపెనీల నుంచి లంచాలు తీసుకొని లోన్లు ఇచ్చారని, డిబెంచర్లు కూడా కొన్నారని ఈడీ ఆరోపించింది. అందుకే డీహెచ్ఎఫ్ఎల్ లోన్లు మొండిబాకీలుగా మారాయని పేర్కొంది.
డీహెచ్ఎఫ్ఎల్ (ఇది తదనంతరం దివాలా తీసింది) నుంచి యెస్ బ్యాంకు రూ.3,700 కోట్ల విలువైన డిబెంచర్లు కొన్నది. బదులుగా డీహెచ్ఎఫ్ఎల్… కపూర్ కూతుళ్లు డైరెక్టర్లుగా ఉన్న డాయిట్ అర్బన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు కొల్లేటర్ లేకుండా రూ.600 కోట్ల విలువైన రుణాలిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్, యెస్ బ్యాంక్ ప్రమోటర్లు వాధ్వాన్, కపూర్ కుట్ర చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు ఉన్నాయి.
also read యెస్ బ్యాంకు ఎవరిది... ?.. ఎవరీ రాణా కపూర్... ?
యెస్ బ్యాంకులో రాణా కపూర్ వ్యవహార శైలి వల్ల రూ.4,300 కోట్ల విలువైన ప్రజాధనం దుర్వినియోగం అయింది. రూ.రెండు వేల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్లు, 44 ఖరీదైన పెయింటింగ్స్, 12 షెల్ కంపెనీలు, కపూర్ విదేశీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది. ఇదిలా ఉంటే, అవినీతి నిరోధక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ల ప్రకారం కపూర్, వాద్వాన్, డాయిట్ అర్బన్ డైరెక్టర్లపై కేసులు పెట్టామని సీబీఐ తెలిపింది.
దేశంలోని ప్రముఖ బ్యాంకర్లలో ఒకరిగా ఒకప్పుడు వెలుగు వెలిగిన రాణా కపూర్కు ఇప్పుడు లాకప్లో ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. యెస్ బ్యాంక్ను 17 ఏళ్లలో ఐదు పెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటిగా చేశారు.
సొంతంగా ఎదిగిన బిలియనీర్గానూ రాణా కపూర్ మారారు. ఆయన కుటుంబ సభ్యులు డీహెచ్ఎఫ్ఎల్కు అక్రమంగా అప్పులు ఇచ్చారని, తద్వారా అందిన ముడుపులతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపణలోచ్చాయి. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు రావొచ్చని నిపుణులు అంటున్నారు.
విచ్చలవిడిగా అప్పులు ఇవ్వడం వల్లే యెస్ బ్యాంకుకు మొండి బాకీలుపెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఎంత రిస్క్ ఉన్నా అప్పు ఇవ్వడానికి వెనుకంజవేయలేదు. ఇతర బ్యాంకులు నో చెప్పిన కార్పొరేట్ కంపెనీలకు కూడా యెస్ బ్యాంకు అప్పులు ఇచ్చేది. తదనంతరం ఆయన యెస్ బ్యాంక్లోని తన వాటాలన్నింటినీ అమ్మేశారు. తన సంస్థను హెచ్డీఎఫ్సీ, కోట్క్ మహీంద్రా బ్యాంకులకు ధీటుగా తీర్చిదిద్దాలని రాణా కపూర్ కోరుకునేవారు.
యెస్ బ్యాంకుపై ఆర్బీఐ 2015లో నిర్వహించిన అసెస్మెంట్లో దీని మొండి బాకీలు రూ.8,373 కోట్లకు చేరాయని తేల్చింది. తమ మొండి బాకీలు రూ.2,018 కోట్లు మాత్రమేనని యెస్ బ్యాంక్ చెప్పిందని ఆర్బీఐ విమర్శించింది. ఐఎల్ఎఫ్స్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి కంపెనీలకు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాక మొండి బాకీలు పేరుకుపోయాయి.
also read స్టాక్ మార్కెట్ భారీ పతనం, నష్టాల్లో సెన్సెక్స్....
రాణా కపూర్ ఇన్వెస్ట్మెంట్లు, ఖరీదైన పెయింటింగ్స్, డొల్ల కంపెనీలపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది. లండన్లోని కపూర్ కుటుంబ సభ్యుల ఆస్తుల డాక్యుమెంట్లనూ జప్తు చేసినట్టు వెల్లడించింది. లంచాలుగా అందిన డబ్బుతో లావాదేవీలు చేయడానికి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారని ఈడీ వర్గాలు తెలిపాయి.
ఖరీదైన పెయింటింగ్స్లో కొన్నింటిని రాజకీయ నేతల నుంచి కొన్నట్టు గుర్తించారు. వీటిలో ఒక పెయింటింగ్ ప్రియాంకా గాంధీ నుంచి కొన్నట్టు సమాచారం. విచారణలో భాగంగా కపూర్తోపాటు ఆయన భార్య బిందు, ముగ్గురు కూతుళ్ల స్టేట్మెంట్లను ఈడీ అధికారులు రికార్డు చేశారు. బిందును కూడా ఈడీ ఆఫీసులో ప్రశ్నించారు. కపూర్ కూతుళ్ల కంపెనీపైనా సీబీఐ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే తమ ఏటీఎంలన్నీ పనిచేస్తున్నాయని, వాటి నుంచి యథావిధిగా డబ్బు తీసుకోవచ్చని యెస్ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ యెస్ బ్యాంక్ కార్డులను వాడొచ్చని తెలిపింది. బాండ్ల రూపంలో యెస్ బ్యాంక్ తమకు రూ.662 కోట్లు బాకీ ఉందని ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఈ బ్యాంకు నుంచి టర్మ్లోన్లు తీసుకోలేదని తెలిపింది. బ్యాంకు కో–ఫౌండర్, మాజీ సీఈఓ రాణా కపూర్ అరెస్టు నేపథ్యంలో ఇండియా బుల్స్ ఈ వివరణ ఇచ్చింది.