Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో ఎకానమీకి కష్టమే:డీఅండ్‌బీ.. తొలిసారి ‘నిర్మల’మ్మ పెదవిరుపు

చైనాలో వచ్చిన కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు కష్ట కాలమేనని మరో రేటింగ్ సంస్థ డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఆందోళన వ్యక్తం చేసింది. మరో రెండు నెలలూ ఇలాగే కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకు కొరత ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 

Coronavirus Outbreak Could Impact Indian Economy Amid Inflationary Pressures: Dun & Bradstreet Report
Author
Hyderabad, First Published Feb 28, 2020, 12:22 PM IST

నిన్న మూడీస్‌.. నేడు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావంపై వరుస హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక మందగమనంలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌కు.. కరోనా వైరస్‌తో మరిన్ని కష్టాలేనని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) గురువారం అభిప్రాయపడింది. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తొలిసారి పరిస్థితి ఇలాగే ఉంటే కష్టమేనని ముక్తసరి వ్యాఖ్యలు చేశారు.

కరోనా వల్ల చైనా నుంచి ముడి సరుకు, విడి భాగాల సరఫరాల్లో అంతరాయం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఏర్పడవచ్చని తమ ఆర్థిక సలహాదారు నివేదికలో అంచనా వేశారని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) తెలిపింది. ఈ ప్రాణాంతక వైరస్‌ అదుపులోకి రాకపోతే దేశీయ ఉత్పాదక రంగమే కుంటుపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. 

‘కరోనా వైరస్‌ వ్యాప్తి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార-వాణిజ్య పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బ తింటున్నది. భారతీయ సంస్థలను ఈ పరిణామం తీవ్రంగానే ప్రభావితం చేయవచ్చు’ అని డీఅండ్‌బీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త అరుణ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమయంలో కరోనా వైరస్‌ విజృంభణ.. భారత ఎకానమీకి ఇబ్బందేనని వ్యాఖ్యానించారు. 

కరోనా వైరస్‌.. మహమ్మారిగా ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కష్టాలేనని మూడీస్‌ బుధవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం భారత్‌పైనా తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. గత నెల 30న కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఇప్పటిదాకా చైనాలో ఈ వైరస్‌ బాధిత మరణాల సంఖ్య 2,744గా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 78,500లకు పెరుగగా, మళ్లీ ఈ వైరస్‌ విజృంభిస్తున్నదని చైనా చెబుతుండటం ప్రపంచాన్నే కలవరపెడుతున్నది. 

కరోనా దెబ్బకు మొబైల్‌, టెలివిజన్‌, ఆటో రంగాలకు చైనా నుంచి ముడి సరుకు సరఫరా నిలిచిపోగా, దేశీయ కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా పరిశ్రమలన్నీ మూతబడటంతో ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. కాగా, ఈ జనవరిలోనూ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 0.1-0.5 శాతంగానే ఉండొచ్చని డీఅండ్‌బీ అంచనా వేసింది. డిసెంబర్‌ ఐఐపీ -0.3 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ జీడీపీకి దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని పరిశ్రమ సంఘం పీహెచ్‌డీసీసీఐ అంచనా వేసింది. సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం.. కేవలం చైనా ఎగుమతుల్నేగాక, దిగుమతి దేశాల ప్రయోజనాలనూ దెబ్బతీస్తున్నదని పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు డీకే అగర్వాల్‌ అన్నారు. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగాలని, విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభావితం కాకుండా ఉండవచ్చని పరిశ్రమకు సూచించారు.

మరోవైపు అంతర్జాతీయంగా ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు గురువారం నాలుగు శాతం మేర తగ్గాయి. ఈ వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతున్నట్లు వచ్చిన భయాలతో గ్లోబల్‌ మార్కెట్లో క్రూడాయిల్‌కు డిమాండ్‌ పడిపోయింది. ఏప్రిల్‌ నెల డెలివరీకి బ్యారెల్‌ ఇంధన ధర 4.2 శాతం తగ్గి 51.20 డాలర్ల వద్ద నిలిచింది. 

వరుసగా ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో క్రూడ్‌ ఆయిల్ ధర 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ వైరస్‌తో చైనాలో మరణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, మరోవైపు దక్షిణ కొరియా, ఇటలీ. ఇరాన్‌, కెనడా, అమెరికాకు కూడా పాకుతుండటం కూడా గ్లోబల్‌ మార్కెట్లపై భయాలు చుట్టుముట్టాయి. 

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ‘ఇప్పటికైతే దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావం లేదు. మరో రెండు నెలలు పరిస్థితులు మెరుగుపడకపోతే మాత్రం ఇబ్బందే. ముడి సరుకు కొరత ఉండొచ్చు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. త్వరలోనే అంతా సర్దుకోవచ్చు. నేనిప్పటి వరకు 20-23 మంది పారిశ్రామిక వేత్తలను కలిసి కరోనా ప్రభావంపై ఆరా తీశాను. వారిలో నాకెలాంటి ఆందోళన కనిపించలేదు’ అని తెలిపారు. 

మరోవైపు కరోనా భయాలు స్టాక్‌ మార్కెట్లను వీడటం లేదు. వరుసగా ఐదోరోజు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుదేలయ్యాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఇంధన రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను మరింత పెంచింది. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఒక దశలో 500 పాయింట్ల వరకు కోల్పోయాయి. 
చివరకు 30 షేర్ల ఇండెక్స్‌ బీఎస్ఈ సూచీ సెన్సెక్స్‌ 143.30 పాయింట్లు పతనమై 39,745.66 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 45.20 పాయింట్లు పడిపోయి 11,633.30 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ 1,577.34 పాయింట్లు, నిఫ్టీ 492.60 పాయింట్లు పతనమయ్యాయి. ఓఎన్‌జీసీ 2.61 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. 

మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌ షేర్లు ఒక్క శాతానికి పైగా పడిపోయాయి. వీటితోపాటు టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రా సిమెంట్‌, ఐటీసీ, రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్లు మదుపర్లను ఆకట్టుకోలేక పోయాయి. 

కానీ, సన్‌ఫార్మా 3.68 శాతం ఎగబాకి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతి, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios