మళ్లీ గ్యాస్ సిలిండర్ ‘మంట’: 9 రోజుల్లో రెండో ‘వడ్డింపు’
వంట గ్యాస్ సిలిండర్ ధర 10 రోజుల్లోనే రెండోసారి పెరిగింది. డీలర్ల కమిషన్ రూ.2 పెంచాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు అందుకోసం గ్యాస్ సిలిండర్ ధర రూ.2కు పైగా పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సంస్థలు నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల ఒకటో తేదీన తొలుత రూ.2.94 పెంచుతూ ముడి చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. జూన్ నెల నుంచి ప్రతి నెల పెరుగుతున్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో కేవలం 9 రోజుల్లోనే రెండవసారి పెరిగింది. ఎల్పీజీ డీలర్లకు ఇచ్చే కమిషన్ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధరను సిలిండర్కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ముడి చమురు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. తాజా పెంపుతో ఒక్కో సిలిండర్ ధర రూ. 507.42కు చేరింది. డీలర్ కమిషన్ పెంపు కారణంగా సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.3.50 చొప్పున పెరిగింది.
ప్రస్తుతం వంటగ్యాస్ డీలర్లకు 14.2కేజీల సిలిండర్కు రూ.48.89, 5కేజీల సిలిండర్కు రూ. 24.20 చొప్పున కమిషన్ ఇస్తున్నారు. అయితే దీన్ని పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14.2కేజీల సిలిండర్కు రూ. 50.58, 5 కేజీల సిలిండర్కు రూ. 25.29 చొప్పున కమిషన్ ఇవ్వాలి. రాష్ర్టాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చులకు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగనున్నది.14.2 కిలోల సిలిండర్కు 20.50 డెలివరీ ఛార్జ్ ఉంటుంది. అయితే పంపిణీదారుల ప్రాంగణంనుంచి సిలిండర్ను నేరుగా తీసుకుంటే డెలివరీ ఛార్జినుంచి మినహాయింపు వుంటుందని కేంద్ర ప్రభుత్వ ముడి చమురు సంస్థలు పేర్కొన్నాయి.
కాగా ఈ నెలలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబర్ 1వ తేదీనే రాయితీ గ్యాస్ సిలిండర్పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతినెలా వంటగ్యాస్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.60 పెరిగి రూ.939లకు చేరుకోగా డీలర్ల కమిషన్ పెంపుతో ప్రస్తుతం రూ.942.50లకు చేరింది.