ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగని వాళ్లు ఎందరో. వారందరికీ ఇది నిజంగా చేదు వార్తే. చికెన్ కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.
పండుగలు, పబ్బాలు, ఆదివారాలు.. ఇలా ముక్కలేనిదే పూట తినని వారు ఎందరో.. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా కోడికూర తింటుంటారు. కానీ తాజాగా హోలీ పండుగ రాబోయే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి తగ్గించడంతో చికెన్ ధరలు కొండెక్కాయి. మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి చికెన్ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు (Prices) విపరీతంగా పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.300కు చేరింది. గత నెలలో రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు పెరిగింది. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. ఇక, హైదరాబాద్లో 290 నుంచి 310 వరకు లభిస్తోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ఇబ్బందులు పడుతున్న జనానికి చికెన్ ధరల పెరుగుదల గుదిబండలా మారింది. చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
గత ఆరునెలల్లో ఎన్నుడూ లేనివిధంగా చికెన్ కిలో ధర రూ.290కు పెరిగింది. ఫిబ్రవరి 7న ఇదే చికెన్ కిలో కేవలం రూ.185 మాత్రమే ఉండేది. ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ రూ.290 పలుకుతోంది. దీనికి తోడు వంట నూనెలు కూరగాయలు పప్పుల ధరలూ పెరగడంతో ఏం తినేటట్లు లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక చికెన్ ధర పెరగడానికి ప్రధాన కారణం.. వినియోగం పెరగడం.. ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయింది. అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇక వచ్చేనెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ కిలో ధర రూ.300కు పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో చికెన్ తినడం ఇక కష్టమేనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ధరలు 300కు చేరువ కావడంతో జనాలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ఈ వేసవిలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో పౌల్ట్రీ యజమానులు కూడా కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో డిమాండ్ కు తగ్గ సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఇక మటన్ ధరలు కూడా బాగా పెరిగింది. కిలో రూ.800 దాటింది. రాబోయే రోజుల్లో 1000కి కూడా చేరువ అవుతుందని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ఎండాకాలంలో (Summer) చికెన్ రేట్లు తగ్గుతాయి. వేసవి తాపానికి పక్షులు చనిపోవడంతో పూర్తి బరువు రాకముందే వాటిని విక్రయిస్తారు. దాంతో కిలో కోడిమాంసం ధర గతంలో రూ.160 నుంచి రూ.180 పలుకేది. కానీ ఈసారి పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. కాబట్టి, ధరలు పెరిగాయి.
