‘బాయ్కాట్ చైనా ప్రాడక్ట్స్’కు మద్దతివ్వండి: ముకేశ్ అంబానీ, రతన్ టాటాలకు లేఖ..
చైనా బాయ్ కాట్ ప్రచారోద్యమం తాజాగా పారిశ్రామికవేత్తలను కోరింది. ఈ మేరకు దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు కెయిట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ లేఖ రాశారు. తమ ప్రచారోద్యమానికి మద్దతు ఇవ్వాలని ముకేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతం ఆదానీ తదితరులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: తాము చేపట్టే బాయ్కాట్ చైనా క్యాంపెయిన్కు మద్దతు ఇవ్వాలని, తమ వ్యాపారాల కోసం చైనా నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకోవడం నిలిపివేయాలని పారిశ్రామికవేత్తలను భారతదేశంలోనే అతిపెద్ద ట్రేడర్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) కోరింది. భారత దేశంలోని అగ్రశ్రేణి 50 పారిశ్రామిక వేత్తలకు కెయిట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక లేఖ రాశారు.
ఇప్పటికే సీఎంలు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్లను తాకిన బాయ్కాట్ చైనా ఉద్యమం తాజాగా టాప్ పారిశ్రామిక వేత్తలు, బిలీయనీర్ల వద్దకు చేరింది. వీరిలో ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, సునీల్ మిట్టల్, అజీం ప్రేమ్జీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత, ఇండియాలో యాంటీ చైనీస్ ప్రొడక్ట్ల క్యాంపెయిన్ ముందుకు వచ్చింది.
చైనాలోని వుహాన్ రాష్ట్రంలో పుట్టిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. భారతదేశంతో పాటు చాలా దేశాలు సప్లయి చెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీని తర్వాత ఇండియా–చైనా సరిహద్దులో తలెత్తిన టెన్షన్లతో, భారతీయుల్లో బాయ్కాట్ చైనా ఉద్యమం మరింత ముదిరింది.
‘మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఇండియన్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇండియా ఇండస్ట్రీకి మిమ్మల్ని కెప్టెన్లుగా ఫీల్ అవుతున్నారు. ఈ క్యాంపెయిన్లో మీరు పాలుపంచుకోవాలని గౌరవ పూర్వకంగా కోరుతున్నాం’ కెయిట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పారిశ్రామికవేత్తలకు రాసిన లేఖలో కోరారు.
also read ఫెయిర్ అండ్ లవ్లీలో ‘ఫెయిర్’ కట్.. తాజా సంచలన నిర్ణయం..
‘ఉధృతంగా సాగుతున్న ఈ ఉద్యమానికి మీరు పూర్తి సపోర్ట్ ఇవ్వండి. ఇది గేమ్ ఛేంజింగ్ ఇనీషియేటివ్గా నిలువనుంది. గ్లోబల్గా చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ఇండియా జర్నీ పూర్తిగా మారిపోనుంది’ అని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్వాలా ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ మూవ్మెంట్లో పాల్గొనేందుకు మీ ఆర్గనైజేషన్ల వద్ద పలు ఆప్షన్లు ఉంటాయని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్వాలా చెప్పారు. దేశం ముందు ఏదీ ఎక్కువ కాదని చూపించడానికి ఇదే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఇనీషియేటివ్ మిగిలిన ఇండస్ట్రియలిస్ట్లకు ప్రోత్సాహం అందించనుందని, ఇండియాను సెల్ఫ్ డిపెండెంట్ భారత్గా మార్చనుందని చెప్పారు.
చైనా నుంచి నాలుగు కేటగిరీల వస్తువులను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వీటిలో ఫినిష్డ్ గూడ్స్, ముడి సరుకులు, విడి భాగాల, టెక్నాలజీ ఉత్పత్తులు ఉన్నాయి. క్రమక్రమంగా చైనీస్ గూడ్స్ను బాయ్కాట్ చేసేలా ఆర్గనైజేషన్లు నిర్ణయించుకోవాలని కెయిట్ చెప్పింది. తొలి దశలో ఫినిష్డ్ ప్రొడక్ట్లను బాయ్కాట్ చేయాలని తెలిపింది.
ఇండియాలో తయారు అవుతున్నా, 450 బ్రాండ్లకు చెందిన మూడు వేలకు పైగా ఫినిష్డ్ ప్రొడక్ట్లను చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. 2021 డిసెంబర్ నాటికి చైనా నుంచి రూ. లక్ష కోట్ల దిగుమతులను తగ్గించుకోవాలని ఈ బాయ్కాట్ చైనా ఉద్యమం లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా నుంచి ఇండియా ఏటా 65.26 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. స్మార్ట్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆటో మొబైల్స్ వంటి రంగాలు ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతున్నాయి.