టైరు పగిలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, కంపెనీ బాధిత కుటంబానికి పూర్తి పరిహారం చెల్లించాలని బాంబే హై కోర్టు తీర్పునిచ్చింది. నిజానికి పరిహారం ఎక్కువగా ఉన్న కారణంగా టైరు పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకు వస్తుందని బీమా కంపెనీ కోర్టుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆ పప్పులేవి న్యాయస్థానం ముందు ఉడకలేదు.
టైరు పగిలి కారు డ్రైవర్ మృతి చెందిన కేసులో బీమా కంపెనీ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ టైర్ పగిలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అని, అందువల్ల పరిహారం చెల్లించలేమని పేర్కొంది. అయితే టైర్ పేలడాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ గా చూడలేమని, అందువల్ల మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అలాగే ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.1.25 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇఛ్చింది. మకరంద్ పట్వర్ధన్ అక్టోబర్ 25, 2010న జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. పూణె నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనం వేగం పెంచడంతో టైరు పగిలి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పరిహారం మొత్తం ఎక్కువగా ఉందని, టైర్ పగిలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అని బీమా కంపెనీ కోర్టుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది.
మానవ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరగలేదని బీమా కంపెనీ కోర్టుకు వివరించింది. టైర్ పేలడాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ కేటగిరీలో చూడలేమని, సహజ శక్తుల వల్ల అదుపు తప్పిన ఘటనలను మాత్రమే యాక్ట్ ఆఫ్ గాడ్ కేటగిరీలో చేర్చవచ్చని కోర్టు స్పష్టం చేసింది. టైర్ పేలడం మానవ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం అని కూడా కోర్టు పేర్కొంది.
అధిక వేగం. టైర్లో ఒత్తిడి, టైర్ వయస్సు, వేడి కారణంగా టైర్ పగిలిపోయి ఉండవచ్చని కోర్టు బీమా కంపెనీకి సూచించింది. ప్రయాణం ప్రారంభించే ముందు డ్రైవర్ టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలని, టైర్ పగిలిపోవడం సహజమైన విషయం కాదని కోర్టు వివరించింది. ఆ కుటుంబంలో పట్వర్ధన్ ఒక్కరే జీతం పొందుతున్నారని, అందువల్ల ఆ కుటుంబం కోరిన నష్టపరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది.
