చిక్కుల్లో ‘మహరాజా’!!: ఐదు సంస్థల డిఫాల్ట్ నోటీసులు
అప్పులతో పీకల్లోతు ఊబిలో కూరుకున్న ఎయిరిండియాకు గోటి చుట్టూ రోకటి పోటు అన్నట్లు తమ రుణ బకాయిలు చెల్లించాలని వివిధ బ్యాంకుల కన్సార్టియం నోటీసులు జారీ చేసింది. మరోవైపు సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం చేసింది ఎయిరిండియా.
న్యూఢిల్లీ: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరింత చిక్కుల్లో పడింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని మూడు బ్యాంకులు, రెండు ఎయిర్క్రాప్ట్ లీజింగ్ సంస్థలు ఎయిరిండియాకు నోటీసులు పంపినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన వెల్స్ ఫార్గొ ట్రస్ట్ సర్వీసెస్, యూఏఈకి చెంది ఉబాయ్ ఏరోస్పేస్ ఎంటర్ప్రైజెస్(డీఏఈ) సంస్థలు తమకు రావాల్సిన అద్దె చెల్లించాల్సిందిగా ఎయిరిండియాకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించేందుకు ఎయిరిండియా నిరాకరించింది.
ఎయిరిండియా కొనుగోలుకు ముందుకు రాని బిడ్డర్లు
22 కన్సార్టియం బ్యాంకుల్లోని మూడు బ్యాంకులు ఎయిరిండియాకు ఇచ్చిన రుణాలు పెరిగిపోయాయని వాటిని వెంటనే చెల్లించాల్సిందిగా నోటీసులు పంపాయి. స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిరిండియాకు నోటీసులు పంపిన వాటిలో ఉన్నాయి. రుణభారంతో సతమతమవుతున్న ఎయిరిండియాకు ఉపశమనం కలిగించేందుకు ప్రైవేటీకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 76శాతం వాటాను విక్రయించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను చేపట్టింది. కానీ ఎయిరిండియా వాటా కొనుగోలుకు ఆసక్తి చూపేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు.
ఎయిరిండియాలో వేతనాల చెల్లింపు ఆలస్యం
మరోవైపు ఎయిరిండియా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు ఆలస్యం చేసింది. దీంతో సంస్థ సరైన సమయానికి జీతాలు చెల్లిస్తేనే పనిచేస్తామని లేదంటే యాజమాన్యానికి సహకరించబోమంటూ తేల్చి చెప్పారు. ఎయిరిండియాకు అవసరమయ్యే నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇటీవల చెప్పారు.
6% కాదు 25 శాతం వేతనాలు పెంచాలని బ్యాంకు ఉద్యోగుల డిమాండ్
గతంలో ప్రతిపాదించిన రెండు శాతం పెంపుదల కాక బ్యాంకు ఉద్యోగులకు ఆరు శాతం వేతనాలు పెంచుతామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (యూఎఫ్బీయూ) వ్యతిరేకించింది. ఇంకా చర్చలు కొనసాగుతాయని తెలిపింది. ‘వేతనాలను 2 శాతం నుంచి 6 శాతానికి పెంచుతామన్న ఐబీఏ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. మా చర్చలు కొనసాగుతాయి’ అని వేతనాల పెంపుపై జరిపిన 13వ రౌండ్ సమావేశం ముగిసిన తర్వాత యూఎఫ్బీయూ మహారాష్ట్ర కన్వీనర్ దేవిదాస్ తుల్జాపూర్ తెలిపారు.
మరోసారి చర్చలకు ఐబీఏ అంగీకారం
బ్యాంకు యూనియన్లు 25 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో ఆగస్టు ముగిసే సరికి మరోసారి చర్చలు జరపేందుకు ఐబీఏ అంగీకరించింది. దాదాపు 37 ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. 2012, నంవంబర్ నుంచి 2017 అక్టోబర్ కాలానికి పదో బైపార్టైట్ వేతన ఒప్పందం కుదిరింది. ప్రస్తుత వేతన సవరణ ఒప్పందం 2017 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 15 శాతం వేతనాలు పెంచేందుకు ఐబీఐ అంగీకరించింది. ఉద్యోగుల ఒత్తిడితో మరో 2 శాతం పెంచుతామని ప్రతిపాదించింది. దీనిని అంగీకరించని ఉద్యోగులు మే 30న రెండు రోజుల సమ్మె చేశారు.
యాజమాన్యాల వాదనకు ఉద్యోగులు ససేమిరా
వేతనాలను కొంతమేరకు పెంచినా లాభాలు తగ్గి నష్టాలు వస్తాయని బ్యాంకు యాజమాన్యాలు చెప్తున్నాయి. స్థూల నిరర్ధక ఆస్తుల కోసం అత్యధికంగా ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడంతో నష్టాలు వస్తాయని అందుకు తాము బాధ్యులం కాదంటూ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. తామిప్పటికే జన్ ధన్, నోట్ల రద్దు, ముద్ర, అటల్ పెన్షన్ యోజన వంటి ప్రభుత్వ పథకాల అమలు కోసం విపరీతంగా శ్రమిస్తున్నామని అంటున్నారు.
తొలిసారి 11,300ను దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల మోత మారుమోగిపోతుంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో కూడా మార్కెట్లు రికార్డు స్థాయిల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ సుమారు 100 పాయింట్ల మేర లాభపడి.. సరికొత్తగా 37,400 మార్కును చేధించింది. నిఫ్టీ కూడా తొలిసారి 11,300 మార్కును అధిగమించింది. నేటి ట్రేడింగ్లో బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. పీపీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ళ మద్దతు కొనసాగుతోంది. వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం మేర లాభపడుతున్నది.