రచ్చరచ్చ: ప్రగతి తగ్గించే యత్నం.. జీడీపీ గణాంకాల తగ్గింపుపై విపక్షాల ఫైర్
సార్వత్రిక ఎన్నికల సమరం ముంగిట్లో ఉంది. తమ ప్రభుత్వం భేష్షుగ్గా పని చేస్తోందన్న వాదన ముందుకు తెచ్చేందుకు మోదీ సర్కార్ యమ యాతన పడుతోంది. ఆర్బీఐలో గల మిగులు నిధులను మళ్లించడానికి సెక్షన్ 7 ప్రయోగించేందుకు సిద్ధమైన కేంద్రం.. మన్మోహన్ సింగ్ హయాంలో సాధించిన వ్రుద్ది రేటును తగ్గించి చూపేందుకు సవరణలు ప్రకటించింది. దీనిపై విపక్షాలు, ఆర్థికవేత్తలు మండి పడుతున్నారు.
యూపీఏ హయాం నాటి జీడీపీ గణాంకాలన్నింటినీ సవరిస్తూ మోదీ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పెద్ద దుమారాన్నే రేపుతోంది. అటు ప్రభుత్వం.. ఇటు ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఇంతకీ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ఈ సవరణ చేపట్టడానికి కారణాలేమిటి? ఈ గణాంకాలను ఆయుధంగా వాడుకోవాలనుకుందా? తన అసమర్థ పనితీరును కప్పిపుచ్చుకోవాలనుకుంటుందా? మరి విపక్షాలు ఏమంటున్నాయి? ఇంతకీ ఎవరి వాదనలో నిజం ఉంది? ఈ గణాంకాల ప్రకటనలో నీతి ఆయోగ్ జోక్యం ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మోదీ సర్కార్ కోరుకుంటున్నదేమిటి?
పాత సిరీస్లతో ఇపుడు పాత గణాంకాలను సవరించిన మోదీ ప్రభుత్వం ఏం కోరుకుంటోంది. పదేళ్లలో వెలువడిన వృద్ధి రేట్లు నిజం కావని.. అంత కంటే తక్కువ వృద్ధి నమోదైందని చెప్పడం వల్ల ఏం సాధించాలనుకుంటోందని కొంత మంది ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల ధోరణికి అనుగుణంగా కొనసాగుతుంది. కాకపోతే ఆయా కాలాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఊగిసలాటకు గురి అవుతుంటుంది. అయితే ఇకపై ఏ పార్టీ అధికారంలో ఉంది. అంతక్రితం ఏ పార్టీ అధికారంలో ఉంది. ఏ పార్టీ గణాంకాలను ప్రకటిస్తోందన్నది దానిపై ఆధారపడి వృద్ధి రేటు ఉంటుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కొంత మంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.
ఎన్నికల ముందు సవరణలేమిటి?
దాదాపు నాలుగేళ్ల తర్వాత యూపీఏ హయాంలో వెలువడ్డ గణాంకాలన్నిటిని సవరించారు. అదీకాక ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోనే ఆ ప్రకటన చేయడంతో ఈ గణాంకాలు కాస్త రాజకీయ రంగును పులుముకున్నాయి. ఇంతకీ ఈ అధికార గణాంకాలు పరీక్షలో నెగ్గాయా? మోదీ ప్రభుత్వ హయాంలో సగటు వృద్ధి 7.35 శాతంగా నమోదైందని.. యూపీఏ హయాం మొత్తం మీద కూడా 6.7 శాతమే నమోదైందని బీజేపీ ట్వీట్ చేసింది. ఇవి సవరించిన లెక్కలన్నమాట.
టాప్ 500 కంపెనీల ప్రగతి మాటేమిటి?
మరి 2006-2014లో భారత్లోని అగ్రగామి 500 కంపెనీలు సగటున 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోదీ ఆధ్వర్యంలో ఇవి అందులో సగం రేటును కూడా సాధించలేకపోయాయి. గతంలో కంటే వృద్ధి ఇటీవల బాగుంది అనుకుంటే.. మరి ప్రైవేట్ పెట్టుబడుల మాటేమిటని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్, బ్యాంకుల బ్యాలెన్స్షీట్లు బలహీనపడ్డాయెందుకని అడుగుతున్నారు. అసలు జీడీపీ సవరణకు ఇప్పుడు వాడిన కొన్ని జీడీపీ పారామీటర్లు అప్పుడు లేనే లేవు. ఇలాంటి సాంకేతిక సంక్లిష్టతల మధ్య వెలువరచిన గణాంకాలను ఎలా విశ్వసించాలని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
సీఎస్ఓ, నీతి ఆయోగ్ ఇలా ప్రకటన
2005-12 మధ్య జీడీపీ వృద్ధి గణాంకాలను సవరిస్తూ బుధవారం కేంద్ర గణక కార్యాలయం (సీఎస్ఓ), నీతి ఆయోగ్ ఒక ప్రకటన జారీ చేశాయి. ప్రపంచీకరణ తర్వాత రెండంకెల వృద్ధి నమోదైన ఏకైక సంవత్సరం 2010-11. ఆ ఏడాది 10.3% నమోదైనా దానిని 8.5 శాతంగా సవరించారు. మిగతా సంవత్సరాలకూ రెండు శాతం వరకూ వృద్ధి రేటును తగ్గించారు. మొత్తానికి యూపీఏ హయాంలో 6.7% వృద్ధి నమోదైందని.. తమ ప్రభుత్వ హయాంలో సగటున 7.35% వృద్ధి నమోదైందని బీజేపీ ట్వీట్ చేసింది.
గణాంకాలు ఎందుకు మారాయ్
ఆర్థిక సమాచారంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగునంగా ఖచ్చితత్వం పేరిట జీడీపీ లెక్కింపునకు ప్రాతిపదిక సంవత్సరాన్ని సీఎస్ఓ మార్చింది. 2015 జనవరి నుంచి ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రాతిపదిక సంవత్సరాన్ని మారుస్తూ ఉంటే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా సవరించిన ప్రాతిపదిక సంవత్సరంలో కార్పొరేట్ రంగం నుంచి కూడా సమాచారం రాబట్టారు. ప్రాతిపదిక మార్చాక పాత సంవత్సరాల్లో జీడీపీ రేటు ఎంత అన్నది తెలుసుకుంటే పోలిక బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే తాజాగా సవరించిన గణాంకాలను ప్రకటించింది.
యూపీఏ ప్రగతిపై సంజీవ్ సన్యాల్ సన్నాయి నొక్కులు
యూపీఏ హయాంలో ఆర్థిక వృద్ధి ‘బాగుంది’ని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక ద్రవ్య లోటు, కరెంట్ ఖాతా లోటు, రుణ సమస్యల కారణంగా ఏర్పడ్డ స్థూల ఆర్థిక అనిశ్చితే అసలు సమస్య అని తెలిపారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు సవరణలను ఆయన సమర్థించుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవడానికే ఈ సవరణల ఉద్దేశమని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిని చూడాల్సిన అవసరం లేదని.. కేవలం ఒక సాంకేతిక అంశంగా పరిగణించాలని తెలిపారు. ‘యూపీఏ హయాంలో వృద్ధి రేటు సమస్య లేనేలేదు. స్థూల అనిశ్చితే అసలు సమస్య’ అని పేర్కొన్నారు. ‘2012-13, 2013-14లో ఇపుడు పాటించిన పద్ధతిలోనే గణించి జీడీపీ గణాంకాలు ప్రకటించాం. అపుడు నమోదైన వాటి కంటే ఎక్కువగా వచ్చాయి. ఆ సమయంలో మాత్రం ప్రతిపక్షాలు హర్షించాయి. ఇపుడు మాత్రం విమర్శిస్తున్నాయ’ని అన్నారు.
నీతి ఆయోగ్ జోక్యంపై ఆర్థిక వేత్తల ఫైర్
తాజా గణాంకాల సవరణలో నీతి ఆయోగ్ జోక్యాన్ని కొంత మంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది కూడా ఈ గణాంకాల సవరణ ప్రకటనకు నీతిఆయోగ్ను దూరంగా ఉంచితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.. బుధవారం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, ముఖ్య గణాంకాధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ కలిసి జీడీపీ పాత సిరీస్ గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘జీడీపీ గణాంకాల లెక్కింపులో నీతిఆయోగ్కు సంబంధమే లేదు. అది సీఎస్ఓ పని. ప్రకటన సమయంలో కేవలం సీఎస్ఓ ఒక్కటే ఉండినట్లయితే బాగుండేది’ అని ప్రభుత్వంలోని కొంత మంది అన్నారు.
మాజీ ముఖ్య గణాంకాధికారి అయిన ప్రణబ్సేన్ కూడా నీతిఆయోగ్ జోక్యాన్ని ప్రశ్నించారు. అసలు గణాంకాల విషయంలో నీతి ఆయోగ్ పని ఏమిటంటూ ప్రణబ్సేన్ చేసిన వ్యాఖ్యలను చిదంబరం సైతం సమర్థించారు. ‘నీతి ఆయోగ్ జీడీపీ కథలోకి ఎందుకు చొరబడింది. సీఎస్ఓకు సామర్థ్యం లేదని.. ఆయోగ్కే మేధోపరమైన శక్తి ఉందని సంకేతాలు ఇస్తోంద’ని మరో ఆర్థికవేత్త అన్నారు. కాగా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘అప్పటి ప్రణాళిక సంఘంలో గణాంక, పథక అమలు శాఖ(ఎమ్ఓఎస్పీఐ)లో ఒక విభాగంగా ఉండేది. తాజాగా సవరించిన జీడీపీ గణాంకాలను నిపుణులు, గణకవేత్తలతో తనిఖీ చేయించడానికి నీతిఆయోగ్ ఒక వేదికగా ఉపయోగపడింది’ అని వివరించారు.
ఎప్పటికప్పుడు కొత్త సవరణలేమిటని నిలదీస్తున్న విపక్షం
జీడీపీ సవరణ పద్ధతిపై ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. ఆగస్టులోనూ ఈ తరహా సవరణ చేశారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వ గణాంకాలు.. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా వచ్చాయి. ఆ సమయంలో జాతీయ గణక కమిషన్(ఎన్ఎస్సీ) సుదిప్టో ముండిల్ కమిటీ ఆ గణాంకాలను లెక్కవేసింది. మళ్లీ ఇపుడు కొత్తగా సవరణ ఎందుకు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ సవరణలను ‘ఒక చెడ్డ జోక్’ అని అభివర్ణించారు. నీతి ఆయోగ్పైనా ఆయన విరుచుకుపడ్డారు. ఆ పనికిమాలిన సంస్థను మూసివేయడం మంచిదన్నారు. ‘జీడీపీ గణాంకాలను ఇలా తారుమారుచేయడం ప్రధాని మోదీకి ఉన్న అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ అధ్వాన పనితీరును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీతి ఆయోగ్, గణక శాఖలు జాతికి ద్రోహం చేసినట్లే లెక్క’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు.
కష్టపడి అధికారులు లెక్క గట్టారని ప్రభుత్వ వాదన
ఆగస్టు గణాంకాలు వాస్తవ గణాంకాలు కాదని.. అవి ప్రయోగాత్మకమని ప్రభుత్వ వాదన. సుదిప్తో ముండిల్ కమిటీ కేవలం ప్రయోగాత్మక ఫలితాలను వెల్లడించిందని.. అవి అధికారిక గణాంకాలు కావని చెబుతోంది. పాత సిరీస్ జీడీపీ గణాంకాలను సీఎస్ఓ అధికారులు కష్టపడి లెక్కగట్టినవని.. దిగ్గజ ఆర్థికవేత్తలతో తనిఖీ చేయించి మరీ అధికారికంగా ప్రకటించామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం దీనిపై స్పష్టతనిచ్చారు. సీఎస్ఓకు అత్యంత విశ్వసనీయత ఉందని అన్నారు. ‘2012-13, 2013-14లో సీఎస్ఓ సవరించిన (పెంచిన) గణాంకాలను యూపీఏ ఆహ్వానించింది. ఇపుడు అదే సీఎస్ఓ.. అవే నిబంధనలతో సవరించిన గణాంకాలను ఎందుకు ఆహ్వానించలేకపోతోంది’ అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు.
చిదంబరం సవాలుకు సిద్ధమన్న రాజీవ్ కుమార్
జీడీపీ గణాంకాల సవరణపై చర్చకు వస్తారా అని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం చేసిన సవాలుకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అంగీకరించారు. ‘చిదంబరంజీ మీ సవాలును అంగీకరిస్తున్నాను. పాత సిరీస్ గణాంకాలపై చర్చిద్దాం. బుధవారమే నేను మూడు గంటలు సవివరంగా ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ ప్రశ్నలేవీ అడగొద్దని మీడియాను నేను అన్నట్లు మీరు పేర్కొనడం సబబు కాదు’ అని కుమార్ ట్వీట్ చేశారు. అంతక్రితం చిదంబరం ‘విలేకరులు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇవ్వదగినవి కావన్న రాజీవ్ కుమార్.. నా సవాలుకు అంగీకరిస్తారని అనుకోను’ అని ట్వీట్ చేశారు. దీనికి స్పందనగానే రాజీవ్ పై ట్వీట్ చేశారు. మరిన్ని సంస్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, అధిక నిధుల లభ్యత ఉంటే భారత్ 8 శాతం కంటే అధిక వృద్ధి రేటును నమోదు చేయగలదని నీతి