NSE Scam: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ కోలొకేషన్ కుంభకోణం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే సంస్థ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు 7 రోజుల రిమాండ్ విధించగా, సంస్థ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ కోర్టు బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ కోర్టు బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన కో-లొకేషన్ కుంభకోణంలో సహ నిందితుడిగా ఉన్నందుకు సుబ్రమణియన్‌పై ఈ చర్య తీసుకున్నారు. ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులో  కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన అవకతవకల నేపథ్యంలో మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఇప్పటికే అరెస్టయ్యారు. 

ఫిబ్రవరి 24 అర్ధరాత్రి ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. స్టాక్‌ ఎక్సేంజీలో కొంతమంది హై-ఫ్రీక్వెన్సీ వ్యాపారులకు చెందిన సర్వర్లకు ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్‌ సమాచారం ముందుగా చేరేట్లు చేయడం లాంటి ఆరోపణలు, నిషేధిత ఎక్స్ఛేంజ్ నెట్‌వర్క్ సర్వర్‌ల యాక్సెస్‌ ఇవ్వడంపై  విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐ ఈ చర్య తీసుకుంది. మార్చి 9 వరకు సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయన మరో 14 రోజుల పాటు సీబీఐ రిమాండ్‌లో ఉండాల్సి ఉంటుంది. కో-లొకేషన్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ 2018లో కేసు నమోదు చేసింది. 


చిత్రా రామకృష్ణకు ఏడు రోజుల రిమాండ్
అంతకుముందు, ఎన్‌ఎస్‌ఇ మాజీ సిఇఒ చిత్రా రామకృష్ణను ప్రత్యేక కోర్టు ఆమెను ఏడు రోజుల సిబిఐ రిమాండ్‌కు పంపింది. ముందుగా సిబిఐ కోర్టులో హాజరుపరిచి ఎన్‌ఎస్‌ఇ కో-లొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణకు 14 రోజుల కస్టడీని కోరింది. అరెస్టు కు ముందు  సిబిఐ చిత్రా రామకృష్ణను వరుసగా మూడు రోజుల పాటు విచారించి, ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది, ఆ తర్వాత అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణలో ఆమె సరిగా స్పందించడం లేదని అధికారులు తెలిపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సీనియర్ సైకాలజిస్ట్ సేవలను కూడా సీబీఐ తీసుకుంది. దీంతో ఆమెను  అరెస్టు చేయడం తప్ప సీబీఐకి వేరే మార్గం లేదని సైకాలజిస్టులు కూడా నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సెబీ జరిమానా విధింపు..
ఆనంద్ సుబ్రమణియన్ నియామకంలో అక్రమాలకు పాల్పడినందుకు గాను ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీలు, సీఈవోలు రామకృష్ణ, రవి నారాయణ్‌లతో సహా పలువురికి సెబీ ఇటీవలి ఉత్తర్వుల్లో జరిమానా విధించింది.

హిమాలయాలపై నివసించే ఓ యోగి తనను  20 ఏళ్ల పాటు మార్గనిర్దేశం చేశారని  చిత్రా రామకృష్ణ తెలిపినట్లు రెగ్యులేటర్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్స్ఛేంజ్ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్‌లు, ఆర్థిక ఫలితాలతో సహా రహస్య సమాచారాన్ని యోగితో పంచుకున్నానని, ఎక్స్ఛేంజ్ ఉద్యోగుల అంచనా పనితీరుపై యోగితో సంప్రదింపులు జరిపినట్లు చిత్రా రామకృష్ణపై ఆరోపణలు వచ్చాయి.

" చిత్రా రామకృష్ణ ప్రకారం, అతడు ఒక అజ్ఞాత వ్యక్తి అతను ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించగలడు. అతనికి ఖచ్చితమైన చిరునామా. ఆచూకీ లేదు. అతను ఎక్కువగా హిమాలయ పర్వతాలలో నివసించాడు" అని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.