ఆదానీ పవర్ సంస్థ షేర్‌హోల్డర్లు 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్‌కు సెప్టెంబర్ 5న ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు ఆగస్టు 1న ఆమోదించిన ప్రతిపాదనకు అనుగుణంగా వచ్చింది. దీంతో షేర్ హోల్డ‌ర్ల‌కు జ‌రిగే ప్ర‌యోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

స్టాక్ స్ప్లిట్ వివరాలు

ఇప్పటి వరకు ఆదానీ పవర్ ఒక్కో ఈక్విటీ షేర్ విలువ రూ. 10గా ఉంది. ఇప్పుడు దీనిని ఒక్కో షేర్‌ను రూ. 2 విలువ కలిగిన 5 షేర్లుగా విభజిస్తారు. ఇది కంపెనీ చరిత్రలో తొలి స్టాక్ స్ప్లిట్. ఇప్పటి వరకు కంపెనీ బోనస్ షేర్లు లేదా స్టాక్ స్ప్లిట్స్ చేయలేదు. దీంతో షేర్‌ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ వద్ద ఉన్న మొత్తం ఈక్విటీ షేర్లు: 2,480 కోట్లు. స్టాక్ స్ప్లిట్ తర్వాత ఇవి 12,400 కోట్లకు పెరుగుతాయి. రికార్డ్ డేట్ (ఎవరికి కొత్తగా విభజించిన షేర్లు వస్తాయో నిర్ణయించే తేదీ)ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

షేర్‌హోల్డర్ల ఆమోద ప్రక్రియ

ఈ నిర్ణయం కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగింది. స్క్రూటినైజర్ రిపోర్ట్ ప్రకారం, అధిక శాతం షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారు. ఆదానీ పవర్ షేర్ ధర ట్రెండ్ గ‌మ‌నిస్తే.. గత ఏడాది కాలంలో షేర్ ధరపై ఒత్తిడి కనిపించింది.

* 52 వారాల గరిష్టం: రూ. 681.30 (సెప్టెంబర్ 16, 2024)

* 52 వారాల కనిష్ఠం: ₹430.85 (నవంబర్ 21, 2024)

* గత ఒక సంవత్సరం కాలంలో షేర్ 6% తగ్గింది.

* కానీ, 2025లో ఇప్పటివరకు షేర్ ధర 15% పెరిగింది. ఇది సెన్సెక్స్ (2% పెరుగుదల) కంటే మెరుగ్గా ఉంది.

సెప్టెంబర్ 5న షేర్ కదలిక

గత ముగింపు ధర: రూ.608.50గా ఉండ‌గా ప్రారంభ ధర: రూ.609.90, ఇంట్రాడే కనిష్ఠం: రూ.601.80గా ఉంది. సెప్టెంబ‌ర్ 5వ తేదీన మధ్యాహ్నం 12:05కి ధర రూ.603.10 (0.90% తగ్గుదల)గా న‌మోదైంది.