కరోనా పిడుగు: రూ. 2 లక్షల కోట్లు ఎల్ఐసీ ఎం-క్యాప్ గోవిందా!
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ‘ఎల్ఐసీ’ పెట్టుబడులు ఒక్కసారిగా కరిగిపోయాయి. కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో అతి పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ ఏకంగా రూ.2 లక్షల కోట్ల వరకు కోల్పోయింది
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ‘ఎల్ఐసీ’ పెట్టుబడులు ఒక్కసారిగా కరిగిపోయాయి. కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో అతి పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ ఏకంగా రూ.2 లక్షల కోట్ల వరకు కోల్పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు 30 శాతం వరకు పతనమవడంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
గతేడాది డిసెంబర్ చివరి నాటికి రూ.6.02 లక్షల కోట్లుగా ఉన్న ఎల్ఐసీ పెట్టుబడులు గడిచిన 75 రోజుల్లో ఏకంగా రూ.1.9 లక్షల కోట్లు తగ్గి రూ.4.14 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ఐపీవోకి రావడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం ఐపీవో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఎస్ఈ 500 ఇండెక్స్లో ఉన్న 209 కంపెనీల్లో ఎల్ఐసీ ఒక్క శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల క్యాపిటలైజేన్ మొత్తం విలువలో వీటి వాటా 65 శాతానికి పైగా ఉన్నది. ఆవిరైన పెట్టుబడుల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వాటా అత్యధికంగా 30 శాతం ఉండగా, ఆ తర్వాతి చమురు అండ్ గ్యాస్, సిగరెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్స్, ఆటోమొబైల్స్, మౌలిక రంగాలు ఉన్నాయి. ఈ కరోనా వైరస్ దెబ్బకు సేవల రంగం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండగా, కానీ, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం కొసమెరుపు.
అందరికీ హోం ఫ్రం వర్క్ కష్టమే: టీసీఎస్, ఇన్ఫోసిస్
కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడంతో ఈ విధానం తమకు చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతున్నదని పలు ఐటీ కంపెనీల అధిపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు లభించిన రంగాల్లో ఐటీ లేకపోవటంతో ఆయా ఉద్యోగులందరూ ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తున్నది.
దాంతో తాము జాతీయ అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భారతీయ ప్రముఖ ఐటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సీఈవోలు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవలు అందిస్తున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తమ సేవలు ఆగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల కొంతమంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పనిచేయాల్సిందేనని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు.