మీకు బ్యాంక్‌లో పని ఉందా? బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు, ఎల్లుండి బ్యాంక్ సేవలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ యూనియన్లు సమ్మె బాట పట్టనున్నారు.

మీరు ఎస్​బీఐ ఖాతాదారా? అయితే మీకు ఓ హెచ్చ‌రిక‌. సోమ‌వారం(మార్చి 28) నుంచి రెండు రోజుల సమ్మెకు ట్రేడ్​ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్​బీఐ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ఎస్​బీఐ అధికారికంగా ప్రకటించింది. వివిధ ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనున్న నేపథ్యంలో ఆ ప్రభావం బ్యాంకింగ్ సేవలపై పడొచ్చని తెలిపింది. ఎస్​బీఐ శాఖలు, ఏటీఎం సర్వీసులపై ఈ ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొంది.

'అవసరమైన ఏర్పాట్లు చేసినా.. సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు పరిమితంగా జరగొచ్చు.' అని ఎస్​బీఐ వివరించింది. అందుకే ఎస్​బీఐ ఖాతాదారులు తమకు ఏదైనా పని ఉంటే దానిని వాయిదా చేసుకోవడం ఉత్తమమని సంకేతాలిచ్చింది. అత్యవసమైన పనులు ఉంటేనే బ్యాంక్​కు రావాల‌ని కూడా సూచించింది. ఇక డబ్బులు అవసరమైన వారు ఏటీఎంల నుంచి ముందుగానే విత్​డ్రా చేసుకోవడం బెటర్ అని తెలుస్తోంది.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారతీయ బ్యాంక్ ఉద్యోగుల ఫెడరేషన్ (బీఈఎఫ్​ఐ), ఆల్​ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ)లు సమ్మెకు దిగుతున్నట్లు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింక్ కార్యాకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నట్లు పేర్కొంది ఎస్​బీఐ. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలపై కూడా ప్రభావం పడనుంది.

సమ్మె ఎందుకు..?

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనుండటం సహా.. బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్​తో మార్చి 28, 29 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంక్​ యూనియన్లు. ప్రభుత్వ ఆదాయ ప్రణాళికల్లో భాగంగా.. రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం 2021 బడ్జెట్​లో నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు బ్యాంకులను ఇప్పటికే ఎంపిక చేసింది. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలో కూడా నోటీసులు ఇచ్చాయి బ్యాంకింగ్ యూనియన్లు.