అరుదైన శస్త్ర చికిత్సతో ఓ చిన్నారి ప్రాణాలు కాపాడింది శ్రీ మధుసూదన్‌ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి. ఒక్క రూపాయి తీసుకోకుండానే వైద్యం అందించింది. 

పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి కొత్తజీవితం అందించారు శ్రీ మధుసూదన్‌ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి వైద్యులు. అరుదైన శస్త్రచికిత్సతో మూడేళ్ల చిన్నారిని కాపాడారు. లక్షల రూపాయల విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. ఇలా చిన్నారి బాలిక ముఖంలో చిరునవ్వు చిందేలా చేశారు శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్ సైన్సెస్‌ డాక్టర్లు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చత్తీస్‌గడ్ కు చెందిన బాలిక శివాంగి శర్మకు 2025లో శ్రీ సత్యసాయి సంజీవనీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్స జరిగింది. అయితే శస్త్ర చికిత్సతో గుండె సమస్య నుంచి బయటపడిందనుకుంటే ఆ తర్వాత మరో కొత్త సమస్య మొదలయ్యింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చాలా రోజుల పాటు శ్వాసనాళ ట్యూబ్‌ని అమర్చాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ‘సబ్‌గ్లోటిక్ స్టెనోసిస్‌’ (శ్వాసనాళం కుంచించుకొని దాదాపు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి) అనే తీవ్రమైన సమస్య ఏర్పడింది. దీంతో బాలికకు శ్వాస తీసుకోవడమే కష్టమైపోయింది.

బాలిక పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం చత్తీస్‌గఢ్ ఎయిమ్స్‌ సహా అనేక ఆసుపత్రులను సంప్రదించారు కుటుంబసభ్యులు. కాానీ క్రిటికల్ కండీషన్ లోని బాలికకు చికిత్స అందించేందుకు వైద్యులు వెనుకంజ వేశారు. ప్రైవేటు ఆస్పత్రులలో 30 నుంచీ 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఆ కుటుంబానికి దిక్కు తోచలేదు. చివరి ప్రయత్నంగా బాలికను కర్ణాటక ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన సాయి మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. 

అయితే చెవి, ముక్కు, గొంతు (ENT) విభాగాధిపతి డాక్టర్‌ కుల భూషణ్‌ బాలి నేతృత్వంలో నిపుణులైన వైద్య బృందం ఈ సవాల్‌ను స్వీకరించి దశలవారీగా చికిత్స అందించింది. లేజర్‌, కోబ్లేషన్‌, బెలూన్ డైలేషన్‌, స్టెంట్ అమరిక వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్వాసనాళాన్ని పునర్నిర్మించారు. మే 11న స్టంట్‌ను తొలగించారు... అనంతరం దశలవారీ చికిత్స ద్వారా చివరకు మే 18న ట్రేకియోస్టమీ ట్యూబ్‌ను పూర్తిగా తొలగించారు. దీంతో బాలిక ఇప్పుడు సహజంగా శ్వాస తీసుకోవడంతో పాటు మాట్లాడగలుగుతోంది.

ఈ సందర్భంగా బాలిక తండ్రి గౌరవ్ శర్మ మాట్లాడుతూ... “ముద్దెనహళ్లి ఆసుపత్రి ఒక దేవాలయం లాంటిది. ఇతర ఆసుపత్రుల్లో లభించని వైద్య సదుపాయాలు, ప్రేమాభిమానాలు ఇక్కడ అందిస్తున్నారు. నా కుమార్తెకు కొత్త జీవితం ఇచ్చిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా వంటి పేద కుటుంబాలకు ఇది ఆశాకిరణం” అని అన్నారు.

బాలికలో పూర్తిగా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని ఎండోస్కోపిక్ సాంకేతికతతో పునర్నిర్మించడం అత్యంత అరుదైన విజయమని ఇఎన్‌టి విభాగాధిపతి డాక్టర్‌ కుల్‌ భూషణ్‌ బాలి తెలిపారు. ఈ బాలికకు అత్యంత క్లిష్టమైన ఐదు శస్త్రచికిత్సలు నిర్వహించామని అన్నారు. ప్రపంచంలో కొద్ది ఆసుపత్రులకే ఇలాంటి క్లిష్ట శస్త్రచికిత్సలను నిర్వహించే నైపుణ్యం, సదుపాయాలు ఉన్నాయని... వాటిలో కూడా విజయశాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ చిన్నారికి తాము పునర్జన్మ ఇచ్చినందుకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్ర-కర్నాటక సరిహద్దుల్లో సద్గురు శ్రీ మధుసూదన్‌ సాయి నేతృత్వంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌కి విద్య, వైద్యం, పోషకహార రంగాలలో ఉచిత సేవలందించడంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానం ఉంది. ఈ మిషన్‌ ఆధ్వర్యంలో 100 దేశాల్లో సేవలందిస్తున్నారు. మన దేశంలో ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన్‌ సాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తో పాటు దేశ వ్యాప్తంగా శ్రీ సత్య సాయి సంజీవనీ ఆస్పత్రులలో గత 13 ఏళ్లలో లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలందించింది. శ్రీ సత్యసాయి లోక సేవా గురుకులం, శ్రీ సత్య సాయి యూనివర్శిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచీ పీహెచ్‌డీ వరకు ఉచిత విద్యను అందిస్తోంది. అలాగే ఎంబీబీఎస్‌ సహా వైద్య విద్యలో పీజీ కోర్సులను కూడా పూర్తి ఉచితంగా అందించే ఏకైక సంస్థ వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇక పోషకాహార విషయంలో రోజూ కోటి మందికి పైగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉదయాన్నే సాయి ష్యూర్‌ పేరుతో ఉచితంగా పోషకాహార పానీయాన్ని అందిస్తోంది.