సుజుకి + టయోటా వాటాలు ఈచ్ అదర్.. విద్యుత్ కార్ల ధరలు తగ్గుతాయ్..
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక సంస్థలో వాటాను మరొకటి కొనేలా ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక సంస్థలో వాటాను మరొకటి కొనేలా ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇలా పరస్పరం షేర్ల కొనుగోళ్లు
దీని ప్రకారం సుజుకీలో 2.4 కోట్ల షేర్లను 96 బిలియన్ యెన్ల (దాదాపు రూ.6,510 కోట్లు)కు టయోటా కొనుగోలు చేయనుంది. మరోవైపు టయోటాలో 48 బిలియన్ యెన్ (దాదాపు రూ.3,255 కోట్లు)లకు సమానమైన షేర్లను సుజుకీ కొనుగోలు చేస్తుంది.
2016లో టయోటా, సుజుకి మధ్య తొలి బంధం
2016 అక్టోబర్ 12వ తేదీన టయోటా, సుజుకి మోటార్ కార్పొరేషన్ తమ తొలి వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. సంయుక్తంగా ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ సహకారం, ప్రచారం నిమిత్తం ఈ ఏడాది మార్చిలో కూడా ఇరు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
టెక్నాలజీ టయోటా.. కంపాక్ట్ సుజుకి బలం
విద్యుదీకరణ టెక్నాలజీ టయోటా బలమైతే, కాంప్యాక్ట్ వాహనాల సాంకేతికతలో సుజుకీకి మంచి పట్టు ఉంది. వాహన రంగానికి ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించి స్థిరమైన వృద్ధి సాధించే ఉద్దేశంతో ఇరు సంస్థలు ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు టయోటా, సుజుకీ ఓ సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. ఓ పక్క పోటీ సంస్థలుగా కొనసాగుతూనే కొత్త విభాగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోనున్నట్లు తెలిపాయి.
విద్యుత్ కార్ల ధరలు తగ్గుతాయి
భవిష్యత్లో విద్యుత్ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. రానున్న 3, 4 ఏళ్లలో ప్రస్తుత కార్ల ధరలకే దాదాపు అవీ లభించనున్నాయని ఆయన చెప్పారు. బ్యాటరీ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇది సాధ్యమని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు.
దేశంలో 1000 మందికి 28 కార్లు
ప్రస్తుతం దేశంలో వెయ్యి మందికి 28 కార్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. అదే అమెరికాలో 980, యూరప్లో 850 ఉన్నాయని తెలిపారు. అంటే భవిష్యత్లో పట్టణీకరణ మొత్తం విద్యుత్ వాహనాల వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
బ్యాటరీ ధర తగ్గితే ఆటోమేటిగ్గా కారు ధర తగ్గుతుంది
కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ధర 276 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గనుండటంతో ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ లెక్కన రానున్న మూడు నాలుగేళ్లలో ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఆధారిత ఇంజిన్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ వాహనాలు లభించే అవకాశం ఉందని అమితాబ్ కాంత్ చెప్పారు. దీనివల్ల క్రూడాయిల్ వినియోగం తగ్గించుకోవచ్చన్నారు.
క్రూడ్ వినియోగం తగ్గుదలతో 111 బిలియన్ల మాదక ద్రవ్యం మిగులు
క్రూడాయిల్ వినియోగం తగ్గడంతో సుమారు 111 బిలియన్ డాలర్ల దిగుమతులు తగ్గుతాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధానాలను రూపొందించామని తెలిపారు. అలాగే పారిస్ ఒప్పందం ప్రకారం.. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు.