Asianet News TeluguAsianet News Telugu

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం.. 1,441 ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రీకాల్‌..!

దేశ ప్ర‌జ‌లు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇప్పుడిప్పుడే ఆస‌క్తి పెంచుకుంటూ కొనుగోళ్లు జ‌రుపుతున్నారు. ఈ సానుకూల ప‌రిణామం వ‌ల్ల కాలుష్యం త‌గ్గుతుంద‌ని, పెట్రోలు వినియోగం, దిగుమ‌తులు త‌గ్గుతాయ‌ని భావిస్తోన్న వేళ అనేక ప్రాంతాల్లో ఈ-బైక్‌ల పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వాటి బ్యాటరీల నాణ్యత, ఇత‌ర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతోన్న వేళ ఓలా ఎల‌క్ట్రిక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 
 

Ola recalls 1,441 units of electric two-wheelers
Author
Hyderabad, First Published Apr 24, 2022, 4:21 PM IST

ఎలక్ట్రిక్​ వాహనాలకు మంటలు అంటుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఓలా చర్యలు చేపట్టింది. తమ సంస్థ రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

పుణెలో గత నెల 26న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నామని ఓలా ఎలక్ట్రిక్​ వెల్లడించింది. "పుణెలోని ఓ ఎలక్ట్రిక్​ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే మా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్​ వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఇదొక్కటే అని తెలుస్తోంది. అయినప్పటికీ.. 1,441 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాము. వాటి భద్రత, ఇతర ప్రమాణాలను మరోమారు పరిశీలిస్తాము. మా సర్వీసు ఇంజనీర్లు ఆ పని చూసుకుంటారు. బ్యాటరీ, థర్మల్​, సెఫ్టీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు," అని ఓలా ఎలక్ట్రిక్​ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు నిప్పంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాయి. ఒకినావా ఆటోటెక్​ సంస్థ.. ఇప్పటికే 3వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించింది. ప్యూర్​ఈవీ సంస్థ సైతం 2వేలకుపైగా ఎలక్ట్రిక్​ వాహనాలను తిరిగి తీసేసుకుంది. ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఘటనలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వీటిపై ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేసిన దర్యాప్తు చేపట్టింది. నిర్లక్ష్యం వహిస్తే.. వాహన తయారీ సంస్థలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios